లింగంపేట : రాష్ట్రంలో ఉన్న పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ అన్నారు. శనివారం మండలంలోని ముంబాజీపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదస్పదంగా ఉన్న భూములపై సంయుక్త సర్వే నిర్వహించి సమస్యను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని గుర్తు చేశారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత వల్ల వందలాది మంది చనిపోయారని అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మొక్కలను నాటి చెట్లుగా పెరిగేంతవరకు వాటిని సంరక్షించాలని కోరారు.
నియోజకవర్గంలోని లింగంపేట, ఎల్లారెడ్డి, గాంధారి మండలాల్లో పోడు భూములు ఉన్నాయని, అర్హులకు పట్టాలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ పోడు భూములు సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 8వతేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సర్పంచ్ గురం స్వప్న, తాసీల్దార్ అమీన్సింగ్, మండల రైతుబంధు కమిటీ అధ్యక్షుడు విష్ణువర్దన్రెడ్డి, మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు, అటవీ శాఖ సెక్షన్ అధికారి ఓంకార్, నాయకులు నయీం, సంతోశ్రెడ్డితో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు.