విద్యానగర్ : విశ్రాంత ఉద్యోగులు స్వచ్ఛందంగా సేవ చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు.బుధవారం కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ దవాఖానలో విశ్రాంత ఉద్యోగులు రోగుల వద్దకు వెళ్లి మనోధైర్యం కల్పించడం హర్షణీయమని అన్నారు.అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సలహాలు,సూచనలు ఇవ్వడంలో విశ్రాంత ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
వంద శాతం వ్యాక్సినేషన్ అయ్యేవిధంగా విశ్రాంత ఉద్యోగులు అవగాహన కల్పించాలని సూచించారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి, కౌన్సిలర్ అనూష,ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్కుమార్, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్రావు, ప్రతినిధులు శ్యాంరావు, కుతుబుద్దీన్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.