నిజామాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయ దశమి. తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా. ఈ పండుగ రోజే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలకమైన నిర్ణయాలను తీసుకుని అమలు చేస్తుంటారు. ఇందుకు 2016, అక్టోబర్ 11 ఉదాహరణ. తెలంగాణ ఏర్పడిన తొలి నాళ్లలో అధికార వికేంద్రీకరణకు పూనుకుని జిల్లాలను దసరా పర్వదినం రోజు నుంచే పరిపాలనను పరుగులు పెట్టించారు. ఓ వైపు భౌగోళికంగా జిల్లాలను వేరు చేసి పరిపాలనను మొదలు పెట్టడంతో పాటు నూతన కలెక్టరేట్లు, పోలీస్ భవనాలకు సైతం శంకుస్థాపనలు చేయించి పూర్తి చేశారు. 10 జిల్లాల తెలంగాణ కాస్త 33 జిల్లాలుగా మారి వికేంద్రీకరణ ఫలాలతో నాలుగున్నర కోట్ల మంది జనం ఆనందిస్తున్నారు. ఇప్పుడీ దసరా పండుగ రోజునే మరో సంచలనానికి సీఎం కేసీఆర్ సిద్ధం అవుతున్నారు. దేశానికి శనిలా దాపురించిన చెడును పారదోలి భారతీయ సమాజానికి మంచిని అందించేందుకు బరిగీసేందుకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే ప్రజల నుంచి వస్తున్న డి మాండ్కు తగ్గట్లుగానే బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కేసీఆర్ యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలుండడంతో సర్వత్రా ఆసక్తి పెరుగుతున్నది.
దేశానికి మార్గదర్శకుడు కేసీఆర్
బానిస సంకెళ్ల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఏకంగా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు రెడీ అయ్యారు. భారతీయ జనతా పార్టీ రూపంలో దేశం నాశనం అవుతున్న తీరును పట్టలేక కీలకమైన ప్రకటన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అడుగు ముందుకు వేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం రోజున తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించడంతో ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 21 ఏండ్ల క్రితం ఒక్కడై బయలుదేరిన కేసీఆర్ అలుపెరగని ఉద్యమాలతో దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి నూతన రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగా అన్ని రంగాలు సమూలంగా అభివృద్ధి చెందడం కోసం ఒక్కో రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి విజయాలు సాధించింది. భవిష్యత్తు తెలంగాణ దశ, దిశ పట్ల అంకితభావం ఉన్న ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎనిమిదిన్నర ఏండ్లలో తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చారు. దేశానికే రోల్ మోడల్గా నిలిచిన రాష్ర్టాన్ని యావత్ దేశానికి దిక్సూచిగా నిలబెట్టే ప్రయత్నాలకు కేసీఆర్ కృషి చేస్తున్నారు. తద్వారా బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసే ఆలోచనతో కేసీఆర్ ప్రకటన ఉండబోతున్నది.
ఇందూర్ వేదికగా ఇప్పటికే కీలక ప్రకటన
రాష్ట్ర సాధనలో నిజామాబాద్ జిల్లా ప్రాధాన్యతను ప్రతి సందర్భంలోనూ నొక్కి చెప్పే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత నెలలోనే ఇందూరు గడ్డపై నుంచి కీలకమైన ప్రకటన చేశారు. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ అడుగు పెడితే వ్యవసాయానికి ఉచిత కరెంట్ అందిస్తామంటూ సెప్టెంబర్ 5న ప్రకటన చేసి సంచలనం రేపారు. ఓ వైపు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏకంగా రైతులను ముక్కు పిండి విద్యుత్ పేరిట డబ్బులు వసూలు వేస్తోంది. మీటర్లు పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేస్తోం ది. ప్రభు త్వరంగ డిస్కమ్లను నామరూపాల్లేకుండా మూ లకు నెట్టేసి ప్రైవేటు గుత్తేదార్లకు అప్పగించేందుకు బీజేపీ సర్కారు కుటిల నీతికి పాల్పడుతున్నది. ఇందులో భాగంగా మొదలైన రగడకు కేసీఆర్ మొండి ధైర్యంతో అడ్డుకుని బీజేపీ సర్కారుతో ఢీకొంటున్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగం లో మీటర్లు పెట్టం అంటూ ప్రకటన చేయడంతో పాటు రైతన్నలకు కొండంత ఆసరాగా నిలిచారు. ఇదే భరోసాను యావత్ దేశ వ్యాప్తంగా రైతన్నలకు కల్పించే అవకాశాలు కేసీఆర్ ద్వారా భవిష్యత్తులో ఏర్పడబోతుండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందూరు వేదికగా తెలంగాణ ఉద్యమం లో చేసిన శపథం రాష్ట్ర ఏర్పాటుతో నిజమైనట్లుగానే దేశ రాజకీయాల్లో కేసీఆర్ అడుగేస్తే దేశమంతటా ఉచిత విద్యుత్ అమలుకావడం తథ్యమన్న సంకేతాలు అందరిలోనూ మెదులుతున్నది.
సర్వత్రా ఉత్కంఠ
టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఏమిటన్న దానిపై సర్వత్రా ఉత్కఠ మాత్రం నెలకొన్నది. చాలా రోజులుగా దేశ రాజకీయాల్లో కేసీఆర్ రావాలంటూ మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలంతా నినదిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సరిహద్దు ప్రాంతంలోని ప్రజలైతే ఒక అడుగు ముందుకేసి తెలంగాణలో తమ ప్రాంతాలను విలీనం చేయాలంటూ కోరుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో ఉండడం మూలంగా సంక్షేమ పథకాలు రావడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు. సరిహద్దు శాపగ్రస్తులుగా పడి ఉండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ప్రాంతా ల విలీన డిమాండ్లతో ఆయా రాష్ర్టాల్లో ప్రభుత్వాలకు ముచ్చెమటలు పడుతుండడంతో ప్రజల నోళ్లు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదీ ఏమై నా కేసీఆర్ లాంటి వ్యక్తులు దేశానికి నాయకత్వం వహిస్తే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ప్రజల దరి చేరుతాయని సం తోషం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు మోదీ ప్రభుత్వం ఏకంగా ప్రజలకు ఉచితాలు ఎందుకని కుట్రలకు పాల్పడుతున్న సమయంలో కేసీఆర్ రూపంలో మానవతావాది దేశానికి లీడర్గా వస్తే సామాన్యులకు ఆలంబన ఉంటుందని ఆశాభావం అందరిలోనూ కనిపిస్తోంది.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి..
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేసే దమ్మున్న నాయకుడు కేసీఆర్. దేశానికి ఆయన నాయకత్వం అవసరం. తెలంగాణలో మాకు చుట్టాలు ఉన్నారు. మా చుట్టాలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మహారాష్ట్రలో ఇలాంటి పథకాలు ఏమీలేవు. ఈ పథకాలు దేశం మొత్తం అమలయితే బాగుంటుంది.
-రాజు పండిత్, కార్లపాటక్, బిలోలి, మహరాష్ట్ర
సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నడు
రెంజల్, అక్టోబర్ 4 : మహారాష్ట్ర – తెలంగాణలో పాలన చూస్తే మనస్సు కరిగిపోతది. గోదావరినది ఒడ్డు దాటితే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి ఫలాలు కందకుర్తి గ్రామంలో చూసి మా దగ్గర లేవని బాధ పడ్డాం. జన్మలో అలాంటి పథకాలు రావని ఆశలు వదులుకున్న తరుణంలో కేసీఆర్ ప్రకటన సంతోషాన్ని కల్గించింది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తే అటువంటి పథకాలు మాకు కూడా అమలవుతాయి.
-గంగాధర్, రైతు, బెల్లూర్ గ్రామం
కేసీఆర్తోనే దేశం మొత్తం సుభిక్షం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాబ్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. తెలంగాణలో ఉన్న విధంగా మాలాంటి రైతులకు ఎకరానికి పదివేల రూపాయల పంట సహాయం అందించాలి. దేశం మొత్తం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. మాకు తెలంగాణలో చాలా మంది బంధువులు ఉన్నారు. మా అమ్మగారి ఊరు కోటగిరి మండలం రాంపూర్. అక్కడ వాళ్లకు అన్ని పథకాలు వస్తున్నాయి.
-రాజు, నరంగల్
తెలంగాణ పథకాలు మాకు కావాలి..
పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఉన్న పథకాలు మాకు కావాలి. కేసీఆర్ సాబ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండాలి. రాష్ట్రంలో ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయి. మా రాష్ట్రంలో కూడా అలాంటి పథకాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
-అజయ్, దెగ్లూర్
కేసీఆర్ సాబ్ మంచి పనులు చేస్తున్నారు
కేసీఆర్ సాబ్ తెలంగాణలో మంచి పనులు చేస్తున్నారు. అటువంటి పనులు, పథకాలు మొత్తం భారతదేశంలో ఉంటే బాగుంటుంది. ఆయన దేశ రాజకీయాల్లోకి రావాలి, వచ్చిన తరువాత తెలంగాణలో ఉన్న పథకాలు ప్రవేశపెట్టాలి.
-కపిల్, శివని
అటువంటి నాయకుడు దేశానికి అవసరం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరం. అక్కడ జరుగుతున్నఅభివృద్ధి దేశం మొత్తం జరగాలి. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటివి అన్ని రాష్ర్టాల్లో ఉండాలి. ముఖ్యంగా తెలంగాణలో రోడ్లు చాలా బాగున్నాయి. కేసీఆర్ సాబ్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తాం.
-సంతోష్, దెగ్లూర్