ఇందల్వాయి, ఆగస్టు 19: మూగజీవాలకు రోడ్డు ఆవాసమైంది. చెత్తే ఆహారంగా మారింది. అడవుల్లో ఉండాల్సిన కోతులు జనవాసాల్లోకి వచ్చాయి. వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మూగజీవాలు ఆహారం కోసం అనేక పాట్లు పడుతున్నాయి. మండలకేంద్రంలో ఎక్కడ చూసినా కోతులు, కుక్కలు, ఆవులు దర్శనమిస్తున్నాయి. అవసరం వచ్చినప్పుడు అమ్ముకోవడం, సొమ్ముచేసుకోవడం తప్ప, వాటి ఆలనా పాలనా చూడడంలో యజమానులు చేతులెత్తేశారు.
దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆవులు, ఎడ్లు రోడ్లపై తిరుగుతున్నాయి. జాతీయ రహదారితోపాటు పల్లె ప్రాంతాల్లోనూ రాత్రింబవళ్లు తేడాలేకుండా రోడ్లపైనే తిష్టవేస్తున్నాయి. దీంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వాహనాలు ఢీకొని మూగజీవాలు సైతం మృత్యువాత పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు, పశువుల యజమానులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆహారం లేక చెత్తాచెదారంతో పాటు ప్లాస్టిక్ కవర్లు తింటూ పశువులు రోగాలబారిన పడి మృతి చెందుతున్నాయి. కొన్నిచోట్ల కోతులు ఇండ్లలోకి వచ్చి ఆహార పదార్థాలు తీసుకువెళ్తున్నాయి. రైల్వేస్టేషన్ వద్ద ఎక్కడ చూసినా కోతుల దండు దర్శనమిస్తున్నది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కుక్కల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. గుంపులు గుంపులుగా చేరి అనేక ప్రాంతాల్లో రోడ్డుపై వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
కోతుల బెడదను నివారించాలి
మండల కేంద్రంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. వాటికి ఆహారం దొరక్కపోవడంతో చిరు వ్యాపారాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అనేక సార్లు పలువురిపై దాడి చేసి గాయాలపాలు చేశాయి. వాటిపై ప్రత్యేక దృష్టిసారించి జన వాసాల నుంచి అటవీ ప్రాంతాలకు తరలించాలి.
– చాంద్ పాషా, వ్యాపారి, ఇందల్వాయి