కొవిడ్-19 ఈ పేరు వింటేనే గుండెల్లో దడ పుడుతున్నది. వైరస్ వ్యాప్తితో అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. 2019-2020 విద్యా సంవత్సరం ముగింపులో వెలుగు చూసిన కరోనా మహమ్మారితో ప్రైవేటు విద్యా సంస్థలు మూత పడ్డాయి. 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభంలో వైరస్ ప్రభావం తగ్గినట్లే అనిపించినా.. తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో ప్రైవేటు పాఠశాలలు మరోసారి మూతపడగా.. వాటిలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వారి స్థితిని గమనించిన రాష్ట్రప్రభుత్వం ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. గతనెల నుంచి రూ. 2వేల ఆర్థిక సహాయంతోపాటు 25 కిలోల సన్నబియ్యం అందిస్తున్నది. నిజామాబాద్లో 9,102 మందికి, కామారెడ్డిలో 3,106 మందికి లబ్ధి చేకూరుతున్నది. దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రైవేటు పాఠశాలల సిబ్బంది కుటుంబాల్లో ప్రభుత్వ సహాయంతో ఆనందం వెల్లివిరుస్తున్నది.
నిజామాబాద్, మే 26, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా వైరస్తో సమస్తం అస్తవ్యస్తం అవుతున్నది. ప్రస్తుత విపత్కర సమయంలో అన్ని రంగాలు తీవ్రంగా సంక్షోభంలో కూరుకు పోయాయి. ఏడాది కాలంగా ఎదురవుతున్న గడ్డు పరిస్థితులతో సామాన్య ప్రజలంతా కకావికలం అవుతున్నారు. వైరస్ ప్రభావం తగ్గి అన్లాక్ సమయంలోనూ అనేక రంగాలకు ఊరట లభించినప్పటికీ ప్రైవేటు విద్యా సంస్థలకు మాత్రం అంతగా లాభం లేకుండా పోయింది. 2019 – 2020 విద్యా సంవత్సరం ముగింపులో వెలుగు చూసిన కరోనా మహమ్మారి సరిగ్గా 2020 మార్చి నెలతో వ్యవస్థను అతలాకుతలం చేసింది. అనంతరం 2020-2021 విద్యా సంవత్సరం ప్రారంభమైనట్లే కనిపించినప్పటికీ గడ్డు కాలమే ఎదురైంది. స్కూళ్లకు విద్యార్థులు భౌతికంగా హాజరయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో ప్రైవేటు విద్యా సంస్థలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. తద్వార ప్రైవేటు పాఠశాలలు మూత పడిపోవడం అనివార్యంగా మారింది. అందులో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది జీవనం అగమ్యగోచరంగా మారింది.
ఏడాదిన్నర కాలంగా ఎదురైన క్లిష్ట పరిస్థితులను గమనించిన తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు టీచర్లను, అందులో పని చేసే సిబ్బందిని ఆదుకోవాలని తలిచింది. గత నెల నుంచి ఆర్థిక సాయంతో పాటు సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో ఆ వర్గాల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి.
ఆపత్కాలంలో అండగా..
కరోనా కారణంగా స్కూళ్లు మూతపడడంతో ఏ పని చేయలేక అవస్థలు పడుతున్న ప్రైవేటు టీచర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా కల్పించారు. ఆపద కాలంలో మరోసారి ఉదారతను చాటుకున్నారు. ఒక్కొక్కరికి రూ.2వేలు ఆర్థిక సాయంతో పాటు 25 కిలోల బియ్యం అందించాలని నిర్ణయించడంతో వారి జీవితాల్లో కాసింత వెలుగులు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో వేలాది మందికి లబ్ధి చేకూరుతున్నది. ప్రైవేటు ఉపాధ్యాయులంతా కష్టకాలంలో ఆదుకున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కరోనాతో విద్యాసంస్థలు కుదేలయ్యాయి. గత ఏడాది మార్చిలో లాక్డౌన్ విధించినప్పటి నుంచి ప్రైవేటు టీచర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2021, ఏప్రిల్ నెల నుంచి బడులు తెరిచే వరకు రూ.2వేలతో పాటు 25 కిలోల సన్నబియ్యం అందిస్తుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో ప్రైవేటు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి సర్కారు సాయం అందుతున్నది. స్కూళ్ల మూతతో కుటుంబ పోషణ కష్టంగా మారిన వారందరికీ కేసీఆర్ ప్రకటించిన ఆర్థిక సాయం, సన్న బియ్యం పంపిణీ వారిలో ధైర్యాన్ని నింపుతున్నది.
పారదర్శకంగా సాయం…
ప్రైవేటు టీచర్లు, అందులో పనిచేస్తున్న సిబ్బందికి సర్కారు అందిస్తున్న సాయం పారదర్శకంగా పంపిణీ జరుగుతున్నది. ఎక్కడా తప్పులకు తావు లేకుండా అర్హుల గుర్తింపు ప్రక్రియను చేపట్టారు. ప్రైవేటు విద్యా సంస్థలు అందించిన వివరాలను మండల స్థాయిలో ఎంఈవో, కాంప్లెక్స్ టీచర్లు వేర్వేరుగా పరిశీలించి డీఈవోకు పూర్తిస్థాయి నివేదికను సమర్పించారు. యూ డైస్లో నమోదైన వివరాల ఆధారంగా ఆర్థిక సహాయాన్ని నేరుగా టీచర్లు, స్కూల్ సిబ్బంది బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నారు. యూ డైస్లో ఉన్న టీచర్ల వివరాలను సంబంధిత పాఠశాలలు వెబ్సైట్లో అప్లోడ్ చేసి, ఎంఈవోలకు ఇప్పటికే అందజేశారు. ఆ వివరాలను ఎంఈవోల ద్వారా డీఈవో కార్యాలయానికి చేరవేశారు. తర్వాత డీఈవో కార్యాలయం నుంచి విద్యాశాఖకు చేరాయి. జిల్లాల నుంచి సేకరించిన టీచర్ల సమాచారాన్ని రాష్ట్ర విద్యా శాఖాధికారులు బియ్యం పంపిణీ కోసం పౌరసరఫరాల శాఖకు అందించారు. ఆ వివరాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లోని రేషన్ షాపుల పరిధిలో బియ్యం తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఏప్రిల్ నెలలో బియ్యం పంపిణీ విజయవంతంగా జరిగింది. మే నెలలోనూ సన్న బియ్యాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఉమ్మడి జిల్లాలో 12,208 మందికి లబ్ధి…
ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం, సన్న బియ్యం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 13వేల మందికి అందుతున్నది. తొలి విడుత సాయం కొద్ది మందికే చేరింది. వివరాల నమోదులో జాప్యం, సమయాభావంతో కొంత మందికి తొలి నెలలో సాయం చేరలేదు. ప్రస్తుతం అర్హులందరికీ సాయం చేరవేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్ నెలలో 5,804 మందికి సాయం అందింది. మే నెలలో అదనంగా 3,288 మందిని చేర్చారు. మొత్తం 9,102 మందిని గుర్తించారు. వీరికి రెండో విడుత రూ.2వేలు వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు. కొద్ది మందికి బ్యాంక్ వివరాల్లో తప్పులు ఉండడంతో జమ కాలేదు. వీరందరికి 227 మెట్రిక్ టన్నులు సన్న బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేయనుంది. కామారెడ్డి జిల్లాలో ఏప్రిల్ నెలలో 1996 మందికి సాయం అందింది. మే నెలలో అదనంగా 1,110 మంది వివరాలు చేర్చారు. మొత్తం 3,106 మందికి లబ్ధి చేకూరింది. కామారెడ్డి జిల్లాలోని ప్రైవేటు టీచర్లు, సిబ్బంది కోసం 77 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని కేటాయించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 12,208 మందికి రూ.2.44 కోట్ల నగదు జమ చేయగా… 305 మెట్రిక్ టన్నులు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు టీచర్లకు సాయం…
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్లుగా గడిచిన రెండు నెలలుగా ప్రైవేటు స్కూళ్లలో పని చేస్తున్న బోధన, బోధనే తర సిబ్బందికి సాయం అందుతున్నది. ఏప్రిల్ నెలలో కొంత మంది పేర్లు నమోదు కాలేదు. వారందరికీ మే నెలలో సర్దుబాటు చేశారు. అర్హులైన వారందరికీ సాయం పారదర్శకంగా అందుతున్నది. ఇంతటి కష్టకాలంలో రూ.2వేలు, 25కిలోల సన్న బియ్యం ద్వారా ఆయా కుటుంబాల్లో భరోసా అన్నది కేసీఆర్ రూపంలో కనిపిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు టీచర్లను ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. యావత్ దేశానికి కేసీఆర్ ఆదర్శంగా నిలుస్తున్నారు.
డబ్బులు పడని వారు
ఆందోళన చెందవద్దు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవే టు టీచర్లు, సిబ్బందికి సన్న బి య్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఏప్రిల్ నెలలో బియ్యం తీసుకోని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారందరూ మే నెలలోనూ ఏప్రిల్ కోటా బియ్యాన్ని పొందవచ్చు. రేషన్ దుకాణాలకు గుర్తింపు కార్డు తీసుకుని వస్తే సరిపోతుంది. ఇబ్బందులు ఎదురైతే స్థానిక రెవెన్యూ అధికారులను లేదంటే విద్యా శాఖ అధికారులను సంప్రదిస్తే సరిపోతుంది.