రుద్రంపూర్, ఆగస్టు 08 : గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్కు గురైన వ్యక్తికి అత్యవసర సమయంలో సకాలంలో సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సి.హెచ్.వెంకటరమణ అన్నారు. జీ.ఎం ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు సీపీఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సీపీఆర్పై ప్రాథమిక అవగాహనతో పాటు శిక్షణ కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా పని ప్రదేశాల్లో అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతకు సంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు ప్రాథమిక సహాయం అందించే విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్కు గురైన వ్యక్తిని గుర్తించడం, స్పందన, శ్వాసను పరిశీలించడం, అత్యవసర వైద్య సహాయం కోసం సమాచారం అందించడం, ఛాతీపై కంప్రెషన్స్ చేయడం, అవసరమైన సందర్భాల్లో ఏఈడీ (AED) పరికరాన్ని వినియోగించడం వంటి అంశాలపై శిక్షకులు అవగాహన కల్పించారు. అనంతరం ఉద్యోగులతో ప్రాక్టికల్గా సీపీఆర్ చేయించి, సరైన విధానాన్ని ఎంఆర్ఎస్ సిబ్బంది వివరించారు.
అత్యవసర పరిస్థితుల్లో తొలి కొన్ని నిమిషాలు ఎంతో కీలకమని, వైద్య సిబ్బంది చేరుకునేలోపు సరైన పద్ధతిలో సీపీఆర్ అందించడం ద్వారా బాధితుడి ప్రాణాలను నిలబెట్టే అవకాశం ఉంటుందని శిక్షకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మొక్కపాటి వెంకటేశ్వర్లు, ఏరియా ఇంజనీర్ వి. రామకృష్ణ, పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, ఇన్చార్జ్ ఎంఆర్ఎస్ అనంతరామయ్య, ఏరియా ఎస్టేట్స్ ఆఫీసర్ బి. తౌర్య, డీవైపీఎం హరీష్, సీనియర్ పీఓ మురళి, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ సి.హెచ్. సాగర్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ కె. సౌజన్యతో పాటు వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.