బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడి ఆవేదన
కామారెడ్డి రూరల్, ఏప్రిల్ 10: తనకు అమ్మిన స్థలాన్నే రియల్టర్తో కుమ్మక్కై కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కామారెడ్డికి చెందిన చాట్ల వంశీకృష్ణ ఆరోపించారు. కామారెడ్డిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మండలంలోని క్యాసంపల్లి శివారులో సర్వేనంబర్ 324లో ఉన్న నాలుగు ఎకరాల 31 గుంటల భూమిని తాను 2011వ సంవత్సరంలో గర్గుల్ రాజిరెడ్డి, లింగారెడ్డి వద్ద కొనుగోలు చేసినట్లు చెప్పాడు. ప్రస్తుతం అక్కడ భూమి ధరలు పెరగడంతో రియల్టర్ మోయినొద్దీన్తో కుమ్మక్కయ్యారని, తనకు అమ్మిన స్థలం కాకుండా పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని అమ్మినట్లు నకిలీ పత్రాలు సృష్టించారన్నారు. తనకు అమ్మిన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయాడు. తాను కొన్న భూమికి సంబంధించిన పత్రాలన్నీ తన వద్ద ఉన్నాయని, రైతుబంధు సాయం కూడా వస్తున్నదని పేర్కొన్నాడు. తనకు ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, ఈ విషయంలో అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వంశీకృష్ణ కోరుతున్నాడు.