Kamareddy | కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ అధ్వర్యంలో సమగ్ర వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాల్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. కొత్తపల్లి గ్రామంలో సమగ్ర వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్న బోడ మల్లారెడ్డి, శ్రీకాంత్ అనే రైతులతో మాట్లాడారు. వారు పాటిస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో సాగు నీటి వసతి ఉంది కాబట్టి రైతులు వరి పంట మాత్రమే కాకుండా కూరగాయలు, పండ్ల తోటల సాగు వైపు వెళ్లాలని సూచించారు.
మల్లారెడ్డి చేస్తున్న సమగ్ర వ్యవసాయ పద్ధతులైన మెషీన్ ద్వారా నాటు వేయడం, నర్సరీ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, గొర్లు, మేకల పెంపకం మొదలగు వాటిని పరిశీలించారు. అనంతరం యూసుఫ్ అనే రైతుకు సంబంధించిన డ్రాగన్ ఫ్రూట్ క్షేత్రాన్ని సందర్శించారు. రైతు పాటిస్తున్న సమగ్ర పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ మేనేజర్ రాజు.. రైతులతో కలిసి చేస్తున్న వివిధ కార్యక్రమాలను కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ మిగతా రైతులు కూడా ఈ విధంగా వ్యవసాయంతో పాటు ఇతర ఆదాయం సమకూర్చే పనులు చేసుకోవాలని సూచించారు. రైతులకు ఆదాయాన్ని పెంపొందించుకొనే వివిధ కార్యక్రమాల గురించి సలహాలు, సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎంఆర్వో సునీత, ఎంపీడీఓ బాలకృష్ణ, వ్యవసాయ అధికారి రమ్యశ్రీ, సర్పంచ్ లక్ష్మణ్, ఉప సర్పంచ్ బోడ లక్ష్మి మల్లారెడ్డి, ఏఈవో ప్రభాకర్, ఏపీవో సాయిబాబా, టీఏ జైల్ సింగ్, అభ్యుదయ రైతులు మల్లారెడ్డి, శ్రీకాంత్, చంద్రయ్య, రిలయన్స్ ఫౌండేషన్ మేనేజర్ పులగం రాజు, వీరేశం, వినాయక్, నాగేందర్ పంచాయతీ కార్యదర్శి స్వామి పాల్గొన్నారు.