మహారాష్ట్ర సరిహద్దులో గట్టి నిఘాఏర్పాటు చేయాలి
ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలి
వివిధ శాఖల అధికారులతో బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ సమీక్ష
శక్కర్నగర్, ఏప్రిల్ 12: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామాల్లో కరోనా కట్టడికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ సూచించారు. సోమవారం ఆయన పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఎక్సైజ్, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఐదు గ్రామాలను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. సదరు గ్రామాల్లో పూర్తి స్థాయిలో కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా వర్ని మండలం సిద్ధాపూర్, బోధన్ మండలం సాలూరా క్యాంప్, రెంజల్ మండలం వీరన్న గుట్ట, నీలాపేపర్ మిల్, కోటగిరి మండలంలోని సుంకిని గ్రామాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ గ్రామాల్లో పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించే దిశగా గ్రామస్తులే చర్యలు తీసుకున్నారని తెలిపారు. చెక్పోస్ట్ల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రతి చెక్పోస్ట్ వద్ద నిత్యం రాకపోకలు సాగించే వారికి పరీక్షలు నిర్వహించాలన్నారు. ముందుగా ప్రవేశాలు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు.
కల్లు విక్రయాల విషయంలో కఠిన చర్యలు చేపట్టాలి
కల్లు విక్రయ కేంద్రాల విషయంలో ఎక్సైజ్శాఖ అధికారులు కఠినంగానే వ్యవహరించాలని బోధన్ ఎక్సైజ్ సీఐ బాల్రాజ్కు ఆర్డీవో రాజేశ్వర్ ఆదేశించారు. కల్లు విక్రయ కేంద్రాలపై మహిళలు ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. తన భర్త అక్కడ కూర్చుని కరోనా బారిన పడ్డారని, దీంతో కుటుంబమంతా ఇబ్బంది పడాల్సి వస్తోందని ఒక ఫిర్యాదు వచ్చినట్లు చెప్పారు. ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. సమావేశంలో బోధన్ ఏసీపీ ఎన్. రామారావు, పట్టణ సీఐ రమన్, బోధన్, ఎడపల్లి తహసీల్దార్లు గఫార్మియా, ప్రవీణ్కుమార్, వైద్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రొఫెసర్ గా మారిన వాచ్ మెన్