YS Jagan | నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు జతకట్టారని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఒకవైపు ఎన్డీయేలో కొనసాగుతూనే.. మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తూ డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు. ఇంతకంటే ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా? అని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు నగరంలో నిర్వహించిన సిద్ధం సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు.
తాము ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు. దీనికోసం ఎంతవరకైనా పోరాడతానని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లపై మోదీ సభలో చంద్రబాబు మాట్లాడగలరా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్ల కోసం ఎన్డీయే నుంచి బయటకు రాగలరా? అని నిలదీశారు.