కలలను నిజం చేసుకొమని దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెబుతుండేవారు. ఆ మాటని నిజం చేసుకున్నాడు ఆ వాచ్ మెన్. ఉన్నత విద్యావంతుడవ్వాలన్న కలని నిజం చేసుకోవడమే కాదు ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలో ప్రొఫెసర్ గా ఎంపికయ్యాడు. ఇంతకీ ఎవరతను అంటే కేరళకు చెందిన రంజిత్ రామచంద్రన్. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈ 28ఏళ్ల కుర్రాడు ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ‘ఒక IIM ప్రొఫెసర్ ఇక్కడ జన్మించాడు’ అన్న ట్యాగ్ లైన్ తో తన ఇంటి ఫోటోని షేర్ చేశాడు. ఇంకేముంది వివరాలు సేకరిస్తే రంజిత్ రామచంద్రన్ గురించి ఆశ్చర్యకరమైన , ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో ఉన్న పనాతూరుకు చెందిన పేద కుటుంబం నుంచి వచ్చాడు రంజిత్. తండ్రి టైలర్, తల్లి రోజువారి కూలీ. ఇద్దరు తోబుట్టువులు కూడా ఉన్నారు. ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన రంజిత్ చదువుకోవాలన్న ఆశయాన్ని వదులుకోలేదు. వాచ్ మెన్ గా పనిచేస్తూనే తన చదువుని కొనసాగించాడు. అలా రాజాపురంలోని పీయస్ టెన్త్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ , కాసర్ గోడ్ లోని కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చదివాడు.
పీజీ పూర్తయ్యే వరకు కూడా నైట్ వాచ్మెన్ ఉద్యోగం మానలేదు. పీజీ తరువాత IIT-మద్రాస్ లో PhD పూర్తి చేశాడు. ఆతర్వాత బెంగళూరులోని క్రైస్ట్ కాలేజీలో రెండు నెలల పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఇటీవల జరిగిన నియామకాల్లో రాంచీ ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. తనలాంటి ఎంతోమంది యువకుల్లో స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో తన సక్సెస్ స్టోరీని ఫేస్బుక్ వేదికగా పంచుకున్నానని రంజిత్ తెలిపారు.