బాన్సువాడ, అక్టోబర్ 5: అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని జయశంకర్ సార్ మినీ స్టేడియంలో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానను కలెక్టర్ జితేశ్ పాటిల్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. అక్కడే వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పట్టణంలో ప్రభుత్వ ఏరియా దవాఖాన ఉన్నప్పటికీ ప్రజలకు దూరభారం కాకుండా ఉండేందుకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 30 పడకల చిన్న వైద్యశాలను 1997లో వంద పడకల ఏరియా దవాఖానగా అప్గ్రేడ్ చేశామని చెప్పారు. అధునాతన వైద్య పరికరాలను అందుబాటులోకి తెస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. డయాలసిస్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశామన్నారు.
కేసీఆర్ కిట్ అమలు చేస్తున్నప్పటి నుంచి ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతుండడంతో మరో వంద పడకల మాతా శిశు దవాఖానను నిర్మించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్, చిన్న పిల్లల కోసం 20 బెడ్లతో ఎన్ఐసీయూ సెంటర్ను కూడా మంజూరు చేసిందన్నారు. జిల్లా కేంద్రం కామారెడ్డికి ఒక బస్తీ దవాఖాన మంజూరైతే, బాన్సువాడ పట్టణానికి సీఎం కేసీఆర్ దయతో రెండు దవాఖానలు ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజల తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రెండో బస్తీ దవాఖానను దీపావళికి పాత బాన్సువాడలోని చావిడీ వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యసేవలు, మందులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, బీ(టీ)ఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్లు ఏర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, నాయకులు దొడ్ల వెంకట్రామ్ రెడ్డి, డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్ప్రసాద్, పీహెచ్సీ వైద్యురాలు విజయలక్ష్మి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజు, గోపాల్రెడ్డి, ఎజాజ్, కౌన్సిలర్లు హకీం. రఫీక్, రహీం, అలీముద్దీన్ బాబా తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హైదరాబాద్కు హెలికాప్టర్లో వెళ్లారు. పార్టీ సర్వసభ్య సమావేశం ఉన్నందున ముఖ్యమంత్రి తన కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ను పంపించారని, కేసీఆర్ను దీవించేందుకు వెళ్తున్నానని చెప్పారు. భారత్ రాష్ట్ర సమితి ప్రకటన అనంతరం తిరిగి అదే హెలికాప్టర్లో బాన్సువాడకు చేరుకొని స్వగ్రామం పోచారంలో కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఉన్నారు.