డిచ్పల్లి, డిసెంబర్ 26::గురుకులాలు అంటే చదువుతోపాటు విద్యేతర అంశాల్లోనూ ప్రత్యేకమంటూ వాటిల్లో చదువులు కొనసాగిస్తున్న విద్యార్థులు సత్తాను చాటుతున్నారు. గురుకులంలో తరగతుల బోధన.. క్రీడలతోపాటు నూతన పద్ధతులు ఆచరించడం ద్వారా విభిన్న అంశాల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. గురుకుల అధ్యాపకులు, సిబ్బంది ప్రత్యేక కృషితో ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థుల్లోని సృజనను తట్టిలేపుతున్నారు. కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలకు దీటుగా వసతులు కల్పిస్తున్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు నూతనోత్సాహంతో దూసుకుపోతున్నారు. కొత్తకొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక్కడి విద్యార్థులను క్రీడల్లోనూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు.
వారంతా గ్రామీణ ప్రాంత పేద, మధ్యతరగతి విద్యార్థులే. అందరిలాగే ఇక్కడ చేరారు. కరోనాతో విద్యావ్యవస్థ గాడితప్పినా, అధ్యాపకుల దిశానిర్దేశంతో ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకున్నారు. వారి శ్రమకు అధ్యాపకుల బోధన, అంకితభావం తోడయ్యింది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించేలా చేసింది. పేద విద్యార్థుల విజయానికి చిరునామాగా నిలిచిన డిచ్పల్లి మండలం ధర్మారం(బీ) గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల ప్రతిభ (సీవోఈ) కళాశాలపై ప్రత్యేక కథనం..
జాతీయస్థాయిలో సత్తా..
ఇటీవల వెలువడిన జాతీయ స్థాయి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ధర్మారం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ(సీవోఈ)కి చెందిన పేదింటి బిడ్డలు తమదైన సత్తా చాటారు. ఈ ఏడాది కళాశాల నుంచి 25మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 20మంది అత్యధిక పర్సంటైల్ సాధించి రీజియన్లో ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఏటా ఎంసెట్తోపాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్, ఐఐటీ, ఐసర్, నైసర్, సీయూసెట్ లాంటి జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేకశిక్షణ ఇచ్చి మట్టిలోని మాణిక్యాలను వెలికితీస్తున్నదీ ధర్మారం సీవోఈ. ఇక్కడి విద్యార్థుల ప్రతిభ జాతీయస్థాయిలో కళాశాలకు గుర్తింపు తీసుకొస్తున్నది. కళాశాలలో ప్రత్యేక ప్రణాళిక, నాణ్యమైన బోధనతో అత్యంత మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేదింటి బిడ్డలు పోటీపరీక్షల్లో కార్పొరేట్కు దీటుగా అద్భుతాలు సాధిస్తున్నారు. పరీక్ష ఏదైనా ర్యాంకుల పంట పండిస్తున్నారు. అరుదైన రికార్డులు నెలకొల్పుతూ సీవోఈని విజయాలకు చిరునామాగా నిలుపుతున్నారు. 1984సంవత్సరంలో ఏర్పాటు అయిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల,కళాశాల ఎంతో మంది గ్రామీణ పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందిస్తున్నది. జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు ప్రిన్సిపాల్ సంగీత అధ్యాపకులతో ప్రత్యేక తర్ఫీదు అందించడంతో చాలా మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షలకు ఎంపికయ్యారు. ఇక్కడ చదివిన ఎంతో మంది విద్యార్థినులు ఉద్యోగాల్లో సైతం స్థిరపడడం విశేషం.
వివిధ ప్రాంతాల్లో సీట్లు..
ధర్మారం(బీ) తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇటీవల ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దేశం, రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు సాధించారు. ఇక్కడ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థినులు ఎ.వసుంధర (ఎంబీబీఎస్, ప్రతిమ కాలేజీ), జి.శీతల్ (ఎన్ఐటీ, ఆంధ్రప్రదేశ్), జె.కృష్ణలీల (ఎన్ఐటీ, ఆంధ్రప్రదేశ్), కె.అన్మిష (ఎన్ఐటీ, నాగపూర్), ఎం.పల్లవి (ఎన్ఐటీ, రాయ్పూర్), ఎల్.నిఖిత(ఎన్ఐఎఫ్టీ, హర్యానా), ఇ.నవ్య(ఎన్ఐటీ, వరంగల్), జి.మౌనిక (వెటర్నరీ సైన్స్, రాజేంద్రనగర్), బి.సాయిప్రియ (అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్రనగర్), జయశ్రీ అక్షిత (హార్టికల్చర్, రాజేంద్రనగర్)లో ప్రవేశాలు సాధించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రిలో మనీషా, ప్రణతి, ఆకాంక్ష సీటు సాధించారు. టి.కావ్య (జేఎన్టీయూహెచ్, కూకట్పల్లి)లో సీటు సాధించింది. అలాగే ఇద్దరు విద్యార్థినులు ఎస్.పెరిషా, పి.కమల హెచ్సీఎల్లో ఉద్యోగం సాధించారు.
ప్రోత్సాహక నగదును అందజేసిన సర్కారు..
భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కళాశాలల విద్యార్థులకు క్యాష్ ఇన్సెంటీవ్ చెక్కులను మంజూరు చేసింది. 2020-21లో ఇంటర్ పూర్తి చేసి ఎంబీబీఎస్లో సీటు పొందిన పి.శృతికి రూ.50వేలు, జేఈఈలో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కంప్యూటర్లో సీటు పొందిన బి.ఇందు రూ.40వేలు , బీఎస్సీ అగ్రికల్చర్లో సీటు పొందిన బి.శిరీషకు రూ.30వేల చెక్కులను విద్యార్థి, వారి తల్లిదండ్రులకు ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇటీవల అందజేశారు.
నా కల సాకారం చేశారు
ఎంసెట్లో అత్యుత్తమ ర్యాంకే లక్ష్యంగా చదివాను. ప్రతిరోజూ అధ్యాపకులు చె ప్పే పాఠాలను శ్రద్ధగా విని అర్థం చేసుకొని వారి సలహాలు, సూచనలు పాటించాను. దీంతో హైదరాబాద్ జేఎన్టీయూ లో సీటు వచ్చింది. నా కలను సాకారం చేసిన అధ్యాపకులకు రుణపడి ఉంటాను.
– టి.కావ్య, విద్యార్థిని
ఉదయం 6 నుంచే తరగతులు
ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచే శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. సరైన క్రమశిక్షణ, సమయపాలన ద్వారా తరగతులు నిర్వహిస్తారు. సందేహాల నివృత్తికి అధ్యాపకులు ప్రత్యేక తరగతులు తీసుకుంటారు. జేఈఈ మెయిన్స్లో 94 పర్సంటైల్ సాధించి ఆంధ్రప్రదేశ్లోని ఐఐటీలో
సీటు పొందాను.
– జి.శీతల్, విద్యార్థిని
కంప్యూటర్ ల్యాబ్ ఉపయోగపడింది
ధర్మారం(బీ) గురుకుల ప్రతిభ కళాశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ వివిధ పోటీ పరీక్షల ప్రాక్టీసుకు ఎంతగానో ఉపయోగపడింది. అధ్యాపకుల సూచనలను పాటించి చక్కగా పరీక్షలు రాశాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించాను.
– టి.ప్రణతి, విద్యార్థిని
సరైన ప్రణాళిక ముఖ్యం
ప్రతిరోజూ రాత్రి 10 గంటల వరకు అధ్యాపకులు అందుబాటులో ఉంటూ శిక్షణనిచ్చేవారు. ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకుంటూ సరైన ప్రణాళిక ప్రకారం సిద్ధమయ్యాను. ఎంసెట్ ద్వారా రాజేంద్రనగర్లోని వెటర్నరీ సైన్స్లో సీటు సాధించాను.
– జి.మౌనిక, విద్యార్థిని
అడ్మిషన్ వరకు బాధ్యత మాదే..
ప్రతి సంవత్సరం నిర్వహించే పోటీపరీక్షలకు కళాశాల నుంచే దరఖాస్తు చేస్తాం. అధ్యాపకుల సహాయంతో వివిధ పరీక్షల సమాచారం విద్యార్థులకు చేరవేస్తూ వారు ఎక్కువగా పోటీపరీక్షలకు హాజరయ్యేలా చూస్తాం. మెరిట్ విద్యార్థులకు పరీక్ష ఫీజు సొసైటీ చెల్లిస్తుంది. అడ్మిషన్ తీసుకునే వరకు మేమే చూసుకుంటాం.
– కె.ప్రవీన్, డాటా ఎంట్రీ ఆపరేటర్
సమష్టి కృషితో…
సరైన ప్రణాళిక, బోధనతోపాటు విద్యార్థుల్లో పోటీ పరీక్షలపై భయాన్ని పోగొట్టి విజయం సాధించేలా లక్ష్యాన్ని పెంపొందిస్తున్నాము. సంస్థ కార్యదర్శి సలహాలు, సూచనలు పాటిస్తూ వారాంతపు పరీక్షల్లో విద్యార్థుల మార్కులపై సమీక్ష నిర్వహిస్తాం. విద్యార్థుల క్రమశిక్షణ, తల్లిదండ్రుల సహకారం, అధ్యాపకుల సమష్టి కృషితోనే ఈ విజయాలు సాధించగలిగాం.
– బి.సంగీత, ప్రిన్సిపాల్, గురుకుల బాలికల ప్రతిభ కళాశాల, ధర్మారం(బీ)