మార్చి నెలాఖరులోగా పూర్తి స్థాయిలో గ్రౌండింగ్
లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసిన స్థానిక ఎమ్మెల్యేలు
పారదర్శకంగా అర్హుల గుర్తింపు
జాబితా ప్రకారం గ్రామాలు, పట్టణాల్లో మొదలైన సర్వే
ప్రతి నియోజకవర్గానికి వంద యూనిట్ల చొప్పున మంజూరు
రూ.10లక్షలతో అందుబాటులో ఉన్న యూనిట్లపై అవగాహన
నిజామాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దళితుల ఆర్థికస్వావలంబన కోసం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం ఉమ్మడి జిల్లాలో అమలుచేయనున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఈ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో మొదటి విడుత కింద నియోజకవర్గానికి వంద మంది చొప్పున 900 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇటీవల దళితబంధు పథకంపై ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు లబ్ధిదారుల ధ్రువపత్రాల పరిశీలన, విద్యాభ్యాసం తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. వారి జీవన స్థితిగతులు, ఆర్థిక పరిస్థితుల మేరకు ఎలాంటి యూనిట్లతో ప్రయోజనం ఉంటుందో వారికి వివరించనున్నారు. మార్చి నెలాఖరులోగా గ్రౌండింగ్ పూర్తికానుండగా, రూ.10లక్షలతో ఏర్పాటు చేయబోయే యూనిట్ల విషయంలో లబ్ధిదారుడి ఇష్టానికే తొలిప్రాధాన్యం ఇవ్వనున్నారు. వ్యక్తిగత యూనిట్లతోపాటు సామూహికంగా యూనిట్లు ఏర్పాటు చేయాలనుకునే వారిని కూడా ప్రోత్సహించనున్నారు.
గ్రామాల్లో దళిత కుటుంబాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్లతో దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే విజయవంతమైన పథకాన్ని నియోజకవర్గానికి వంద యూనిట్లు చొప్పున సీఎం మంజూరు చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలోపు మంజూ రు చేసిన తర్వాత వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు సంఖ్యలో లబ్ధిదారులను జోడించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన 100 యూనిట్లు ప్రక్రియ చకచకా సాగుతున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఈ పథకం అమలుపై ప్రత్యేక శ్రద్ధతో ముందుకెళ్తున్నారు. మొత్తం 15 శాఖలకు చెందిన అధికారులను దళితబంధులో భాగస్వామ్యం కల్పించి లబ్ధిదారులకు అండగా ఉండేలా చూస్తున్నారు.
తొమ్మిది వందల మంది ఎంపిక
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దళితబంధు పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9 నియోజకవర్గాల్లో 900 మందిని ఎంపిక చేశారు. వీరికి సంబంధించిన ధ్రువ పత్రాల సేకరణ, విద్యాభ్యాసం తదితర వివరాలను సేకరిస్తున్నారు. వారి జీవన స్థితిగతులు, ఆర్థిక పరిస్థితుల మేరకు… వారికి ఎలాంటి యూనిట్లు అందిస్తే ప్రయోజనం ఉంటుందనే అవకాశాలపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వంద శాతం రాయితీ నగదుతో మంచి ఫలాలు అందాలనే ఉద్దేశంతో లబ్ధిదారులకు ఇరు జిల్లాలకు చెందిన అధికారులు పకడ్బందీగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. వారికున్న అనుభవం, నైపుణ్యతను అనుసరించి యూనిట్లు కేటాయించడం ద్వారా పథకం సఫలీకృతం అవుతుందని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా రూ.10లక్షలతో కొనుగోలు చేయనున్న యూనిట్ల విషయంలో లబ్ధిదారుడి ఇష్టానికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. వారికి సరైన అవగాహన లేకపోతే దళిత మేధావులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు అండగా నిలి చి వారికి బతుకు బాటను చూపనున్నారు.
చకచకా ప్రక్రియ
జిల్లాల్లో దళితబంధు పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో మొదటి విడుత కింద 100 మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యింది. ఇటీవల దళితబంధు పథకంపై ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేలా చూడాలని, ఎవరూ చేతివాటం ప్రదర్శించవద్దని, అవినీతికి తావులేకుండా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. గ్రామానికి ఒకరిని ఎంపిక చేయ డం కాకుండా, ఒక గ్రామంలో మొత్తం దళిత కుటుంబాలకు పథకాన్ని వర్తించేలా ఎమ్మెల్యేలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో ఎంపీడీవోలు, నగర పాలక సంస్థ, పురపాలికల్లో కమిషనర్లు జాబితా ప్రకారం సర్వే ప్రారంభించారు. పథకం కింద ఒక్కొక్కరికీ రూ.10లక్షలు అందనున్నాయి. త్వరగా సర్వే పూర్తి చేసి లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లకు మార్చి మొదటి వారంలోగా పూర్తి స్థాయి గ్రౌండింగ్ చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వచ్చా యి. లబ్ధిదారులు ఒకే రకమైన యూనిట్లు కాకుండా ఇతర యూనిట్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు సంబంధించిన ధ్రువపత్రాలను సేకరించి బ్యాంకుల్లో అకౌంట్లు తెరుస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నారు.
కొండంత అండగా కేసీఆర్
అభివృద్ధికి దూరంగా ఉన్న దళిత కుటుంబాలను పైకి తీసుకురావడం కోసం సీఎం కేసీఆర్ మొదట్నుంచి కొండంత అండగా నిలుస్తున్నారు. బ్యాంకు లింకేజీ, రాయితీ రుణాలతో యువతకు ఉపాధి మార్గాలు చూపించారు. భారీ రాయితీలతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు సైతం అందించారు. అంతేగాకుండా దళితులను ఉన్నతీకరించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ గతంలోనే మూడెకరాల సేద్యపు భూమిని ఉచితంగా అందించారు. కూలీలను వ్యవసాయదారులుగా మలిచారు. దాదాపుగా ఎనిమిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ తనదైన రీతిలో దళితులకు మేలు చేసేందుకు కృషి చేశారు. తాజాగా యావత్ దేశమే ఆశ్చర్యపోయే విధంగా తీసుకువచ్చిన దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రక్రియ వేగంగా జరుగుతోంది. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బా ల్కొండ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో 100 మంది చొప్పున 900 మంది లబ్ధిదారుల ఎంపికను అధికారులు పూర్తి చేశారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎంపిక చేసిన దళిత కుటుంబాలకు అతి త్వరలో రూ.10లక్షలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కాబోతున్నాయి. ఈ మొత్తంతో తమకు ఇష్టమైన యూనిట్ను కొనుగోలు చేసుకుని స్వయం ఉపాధికి మార్గం సుగమం చేసుకునేందుకు లబ్ధిదారులు ఉత్సాహంగా ఉన్నారు.