తాడ్వాయి : రైతులు ఆర్థికంగా తక్కువ సమయంలో అభివృద్ధి చెందాలంటే పశువుల పెంపకం, ఆయిల్ఫామ్ పంట సాగుపై దృష్టి సారించాలని జిల్లా పశువైద్యాధికారి జగన్నాథచారి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చందాపూర్ గ్రామంలో రిలయన్స్ఫౌండేషన్, ఉద్యానవనశాఖ, వెటర్నరీ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో పలువురు అధికారులు మాట్లాడారు. రైతులు ఆయిల్ ఫామ్ పంట సాగు వైపు దృష్టిని సారించాలని అంతర్ పంటగా కూరగాయల సాగు చేయవచ్చని ఉద్యానవన శాఖ జిల్లా అధికారి సంజీవరావు సూచించారు.
ఆయిల్ ఫామ్ పంటను ఏ విధంగా సాగు చేయాలి. రైతులకు లాభం ఏ విధంగా వస్తుంది. ప్రభుత్వ సబ్సిడీ ఎకరాకు ఎంత ఇస్తుందని వివరాలను విశ్వతేజ కంపని ప్రతినిధులు వివరించారు. రైతులు కొత్తగా బోర్లు వేయాలని అనుకుంటే తమను సంప్రదించాలని వాల్టా చట్టం, బోర్వెల్ పాయింట్ గురించి వివరిస్తామని జిల్లా భూగర్భజల శాఖ అధికారి సతీశ్ యాదవ్ అన్నారు.
పట్టు పరిశ్రమ, కూరగాయల సాగు చేయడం వలన రైతులకు లాభాలు, పంటలకు వచ్చే తెగుళ్ల గురించి జిల్లా ఉద్యానవన శాఖ పట్టుపరిశ్రమ అధికారి సంజీవరావు వివరించారు.యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటల సాగుతోనే రైతులకు మంచి ఉపయోగం ఉందని ఏవో శ్రీకాంత్ రైతులకు తెలిపారు. సమావేశంలో ఉపసర్పంచి లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ సునిత, రైతు సమితి అధ్యక్షుడు కిష్టారెడ్డి, రిలయన్స్ ఫౌండేషన్ మేనేజర్ రాజు, లక్ష్మణ్, ప్రతినిధి స్వామి రైతులు పాల్గొన్నారు.