ధర్పల్లి, డిసెంబర్ 26 : నిలువ నీడలేక.. తలదాచుకునే చోటులేక నానా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మండలంలోని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందించాలన్న దృఢ సంకల్పంతో ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇండ్ల నిర్మాణం ప్రారంభించారు. పనులు సైతం పూర్తి కావస్తుండడంతో సొంతింటి కల త్వరలోనే నెరవేరబోతున్నదని మండల కేంద్రంలోని నిరుపేదలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
తుది దశకు పనులు..
మండల కేంద్రంలో 50 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే బాజిరెడ్డి నాలుగేండ్ల క్రితం నిధులు మంజూరు చేయించారు. కానీ సరైన స్థలం లేక కొంతమేర కాలయాపన జరిగింది. పేదలకు ఎలాగైన ఇండ్లు కట్టించి ఇవ్వాలన్న తపనతో ఉన్న ఎమ్మెల్యే.. రెవెన్యూ అధికారులను ఆదేశించి డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం స్థలం కేటాయించేలా చూశారు.
మండల కేంద్రంలోని భీంగల్ రోడ్డులో ఉన్న మాలగుట్ట శ్రీ జగన్నాథ ఆలయానికి వెళ్లే దారి పక్కన సర్వే నంబర్ 195లో 1.08ఎకరాల భూమిని డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం కేటాయించారు. దీంతో రెండేండ్ల క్రితం జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో కొంతకాలం పనులు నిలిచిపోవడంతో నిర్మాణంలో జాప్యం చోటు చేసుకున్నది. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులను మళ్లీ ప్రారంభించి తుది దశకు చేరుకోవడంతో పేదలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
48 ఇండ్ల నిర్మాణం..
మండల కేంద్రంలో 50ఇండ్లు, దుబ్బాకలో ఇండ్లను నిర్మించేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. కాగా మండల కేంద్రంలో జీ ప్లస్ వన్ పద్ధతిలో 50 ఇండ్ల నిర్మాణం చేపట్టాలని అనుకోగా స్థలం ప్రభావంతో ప్రస్తుతం 48 ఇండ్లు మాత్రమే నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సంక్రాంతికి సిద్ధం..
డబుల్ బెడ్ రూం ఇండ్ల మధ్యలో సీసీ రోడ్డు, మురికి కాలువలు, కిటికీలకు అద్దాలు, విద్యుత్ సౌకర్యం తదితర చిన్నచిన్న పనులను త్వరితగతిన పూర్తిచేసి సంక్రాంతికి అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేస్తున్నారు. దీంట్లో భాగంగానే పనులు పురోగతిని పరిశీలించి, పూర్తి చేయించేందుకు ఇటీవల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సైతం వచ్చి పనులను పరిశీలించి కాంట్రాక్టర్, అధికారులకు సూచనలు జారీ చేశారు.
ఎమ్మెల్యే బాజిరెడ్డి కృషితోనే..
ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషితోనే మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తికావొచ్చింది. ఇండ్ల నిర్మాణానికి ఎవరూ ముందుకు రాకున్నా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని నిరుపేదలకు ఇండ్లు అందించాలన్న కృషి, పట్టుదలతో కాంట్రాక్టర్ను ఒప్పించి పనులు ప్రారంభమయ్యేలా చూశారు. వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతికి అందించేందుకు కృషి చేస్తున్నారు.
-ఆర్మూర్ పెద్ద బాల్రాజ్, సర్పంచ్, ధర్పల్లి
ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం..
ధర్పల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తికావడం చాలా సంతోషకరం. మాలాంటి ఇండ్లు లేని గరీబోళ్లకు ఎప్పుడు ఇల్లు ఇస్తరా అని ఆశగా ఎదురుచూస్తున్నాం. జల్ది పనులు పూర్తిచేసి సంక్రాంతికి ఇస్తమంటున్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించిన ఎమ్మెల్యే సార్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– పోశెట్టి, నిరుపేద, ధర్పల్లి