డిచ్పల్లి, ఏప్రిల్ 3 :అటు పల్లెలు, ఇటు నగరంతో ముడిపడి ఉన్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ప్రగతి పథంలో దూసుకు పోతున్నది. విద్యుత్, విద్య, వైద్యం.. ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధికి చిరునామాగా మారింది. తెలంగాణ యూనివర్సిటీ, పవర్గ్రిడ్, బెటాలియన్, మంచిప్ప రిజర్వాయర్, ఎయిర్పోర్టు ఇలా ఎన్నో విశిష్టతలకు కేంద్రబిందువుగా నిలిచింది. ఇజ్రాయిల్ టెక్నాలజీతో నిర్మితమవుతున్న మంచిప్ప రిజర్వాయర్ పూర్తయితే బీడు భూములు జీవం పోసుకోనున్నాయి. ఎలాంటి కాలువలు లేకుండా పైపులైన్ల ద్వారా నేరుగా పంట పొలాలకు నీరందనున్నది. కేసీఆర్ సర్కారు సహకారంతో స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నేతృత్వంలో రూరల్ ప్రాంతం పట్టణాలకు తీసిపోని తరహాలో అభివృద్ధి చెందింది.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేకమనే చెప్పాలి. మిగితా వాటితో పోల్చితే అభివృద్ధిలో ముందంజలో ఉంది. తెలంగాణ విశ్వవిద్యాలయం, తెలంగాణ పవర్ గ్రిడ్, 400 కేవీ సబ్ స్టేషన్, 7వ పోలీస్ బెటాలియన్, టీటీడీసీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు.. వీటన్నింటికీ తోడు మరో నవ రత్నాలుగా చెప్పుకునే అభివృద్ధి పనులు రూరల్ నియోజకవర్గానికి వచ్చాయి. దీంతో అభివృద్ధిలో మరింత పరుగులు పెట్టనున్నది. వాటిలో ప్రధానంగా జక్రాన్పల్లి ఎయిర్పోర్టు, మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి, మంచిప్ప రిజర్వాయర్, డిచ్పల్లి నుంచి నిజామాబాద్ నగరం వరకు సెంట్రల్ లైటింగ్, ధర్పల్లిలో డిగ్రీ కళాశాల, సుద్దులం చెక్డ్యాం, మల్లాపూర్ లోలం వంతెన వంటి అభివృద్ధి పనులు రూరల్ నియోజకవర్గానికి మరింత వన్నె తెస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇందూరు జిల్లా అభివృద్ధి పథంలో మరింత ముందుకు వెళ్తుందనేందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకతను చాటుతూ ముందుకు సాగుతున్నది. అందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ కారణమని చెప్పాలి.
బీడు భూములకు జీవం..
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మన జిల్లాలో 21వ ప్యాకేజీలో భాగంగా మంచిప్ప రిజర్వాయర్ను నిర్మిస్తున్నారు. ఇది కూడా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే ఉండడం విశేషం. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,700 కోట్లు కేటాయించింది. 3.5 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇది పూర్తయితే నియోజకవర్గంలో ఇప్పటి వరకు పడావుగా ఉన్న భూములు సాగులోకి రానున్నాయి. ఫలితంగా రూరల్ నియోజకవర్గం మరింత సస్యశామలంగా విలసిల్లనున్నది. ఇజ్రాయిల్ సాంకేతిక విధానంలో ప్రతి మూడు ఎకరాలకు పైపులైన్ ద్వారా నీటి సరఫరా చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలోని రైతన్నకు తిరుగుండదు. వేలాది ఎకరాల భూములకు సాగునీరు అందనున్నది. ఇప్పటికే నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో సాగునీరు అందుతున్నది. మంచిప్ప రిజర్వాయర్ పూర్తయితే నియోజకవర్గంలోని భూములన్నీ పచ్చగా కళకళలాడనున్నాయి.
ఎయిర్పోర్టుకు ముందడుగు..
చాలా ఏండ్ల క్రితమే ఇందూరు జిల్లాకు మంజూరైన విమానాశ్రయం నిర్మాణం వాయిదా పడుతూ వస్తున్నది. భూసేకరణ ఎప్పుడో పూర్తయినా నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగలేదు. ప్రభుత్వాలు మారినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. అయితే ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాల ప్రారంభానికి చర్యలు చేపట్టింది. దానిలో భాగంగానే వరంగల్, ఆదిలాబాద్, జక్రాన్పల్లి ఎయిర్పోర్టులను ఏకకాలంలో పూర్తి చేసేందుకు ముందడుగు పడింది. సుమారు 3వేల ఎకరాల భూ విస్తీర్ణంలో ఈ విమానాశ్రయం ఏర్పాటు కానున్నది. ఎన్నో ఏండ్లుగా ఇందూరు జిల్లా వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గాలిమోటర్ చప్పుళ్ల నిరీక్షణకు త్వరలో తెరపడనున్నది. ఇటీవలే కేంద్ర విమానయాన సంస్థ ఉన్నతాధికారుల బృందం రాష్ట్రంలోని కొత్తగా ఏర్పాటయ్యే ఎయిర్పోర్టులపై పూర్తిస్థాయిలో సమాచారాన్ని తీసుకున్నారని, వాటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది.
సెంట్రల్ లైటింగ్తో మిరుమిట్లు..
44వ నంబర్ జాతీయ రహదారి నుంచి ఇందూరు నగరం వరకు రహదారి విస్తరణ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు అనేది చాలా ఏండ్లుగా సాగుతున్న విషయం. అయితే రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవతో ఈ పనులు పూర్తయ్యాయి. సుమారు 15 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణతో పాటు సెంట్రల్ లైటింగ్ పూర్తి కావడంతో ఇందూరు జిల్లాకే ఓ మణిహారంగా దీనిని చెప్పుకుంటున్నారు. ఈ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.4.5కోట్ల నిధులు వెచ్చించింది. రహదారి వెంట సెంట్రల్ లైటింగ్తోపాటు డివైడర్ మధ్యలో రకరకాల మొక్కల పెంపకం అందరినీ ఆకట్టుకుంటున్నది. అంతేకాకుండా హరితహారానికి ఇదో మంచి నిదర్శనంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు
పర్యాటక కేంద్రంగా ఖిల్లా రామాలయం..
చారిత్రాక డిచ్పల్లి ఖిల్లా రామాలయం ఉమ్మడి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన కట్టడంగా అందరికీ తెలిసిందే. అయితే ఉమ్మడి పాలనలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దలేకపోయాయి అప్పటి ప్రభుత్వాలు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాక ఎన్నో ప్రాంతాలు వెలుగులోకి వచ్చాయి. పురాతన ఖిల్లా రామాలయం కూడా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తి చూపడం ఇక్కడ మరింత అభివృద్ధితోపాటు పర్యాటకంగా వన్నె చేకూరనున్నది. సుమారు రూ.2.5కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభ్వుత్వం. ఆ నిధులతో ప్రస్తుతం ఖిల్లా డిచ్పల్లి రామాలయాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. పర్యాటక ప్రాంతంగా మరింత విలసిల్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటకులకు సకల సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
వృథా నీటికి ‘చెక్’
వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు, భూగర్భ జల మట్టాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెక్డ్యామ్ల నిర్మాణానికి గతంలోనే పూనుకున్నది. దీనిలో భాగంగానే రూరల్ నియోజకవర్గంలో చెక్డ్యామ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. వీటి ద్వారా రూరల్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లో కూడా ఈ చెక్డ్యామ్ల నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ప్రధానంగా సుద్దులం, రాంపూర్, మల్లాపూర్తోపాటు వాగులు పారుతున్న ప్రాంతాల్లో వీటిని నిర్మాణాలు సాగాయి. వీటి నిర్మాణానికి రూ.కోట్లాదిగా నిధులు కేటాయించింది.
మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంతో తప్పనున్న తిప్పలు
నిజామాబాద్ నగరంతోపాటు మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్కు పెద్ద సంఖ్యలో వెళ్తుంటాయి. దీంతో నగర సమీపంలోని మాధవనగర్ రైల్వే గేట్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతున్నది. ఇది ఎందరికో ఇబ్బందులను తెచ్చిపెడుతున్నది. దీనికి చెక్ పెట్టేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.63 కోట్ల నిధులు మంజూరు చేయడంతో దీని పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిజామాబాద్-సికింద్రాబాద్ మార్గంలో ఇటు ముంబై వరకు, అటు ఏపీ ఇతర ప్రాంతాలకు రోజుకు సుమారు వంద వరకు రైళ్లు పరుగులు పెడుతుంటాయి. ఈ కారణంగా ఇక్కడ విపరీతమైన ట్రాఫిక్ ఏర్పడుతున్నది. ఈ తిప్పలకు చెక్ పెట్టేందుకే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, నిర్మాణ కాంట్రక్టర్ను ఆదేశించారు. దీంతో నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ బ్రిడ్జి వినియోగంలోకి వస్తే నిత్యం ప్రయాణికులు పడే తిప్పలకు పుల్స్టాప్ పడనున్నది.