రాజంపేట్, ఆగస్టు 8 : నియోజకవర్గంలో అభివృ ద్ధి జరగని గ్రామం లేదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని ఆరేపల్లి గ్రామంలో పంచాయతీ భవనం, యాదవ సంఘం, సేవాలాల్ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా 24 గంటల విద్యుత్ సరఫరా లేదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో పింఛ న్లు రూ.2 వేలు కూడా ఇవ్వడం లేదని.. అలాంటిది రాష్ట్రంలో రూ.4 వేలు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రధాని మోదీ సొంత రాష్టంలోనూ బీడీ, ఒంటరి మహిళ పింఛన్లు లేవని ఎద్దేవా చేశారు. చిన్న, పెద్ద గ్రామం అనే తేడా లేకుండా అన్నింటి సమాన దృష్టితో అభివృద్ధి చేశామన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని.. బహిరంగ చర్చకు రావాలని షబ్బీర్ అలీకి సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ పూర్వీకుల గ్రామం కామారెడ్డి నియోజకవర్గంలో ఉందని, అందుకే ఇక్కడి నుంచి పోటీ చేయాలని కేసీఆర్ను తాను ఆహ్వానించానని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే సామాన్య కార్యకర్తగా పని చేస్తానని, తన గురించి సీఎం కేసీఆర్ చూసుకుంటారని అన్నారు. తాను ఓడిపోతున్నాననే భయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ను కామారెడ్డికి తీసుకువస్తున్నానని ప్రతిపక్షాలు చేస్తున్న అసత్యపు ఆరోపణలను ఆయన ఖండించారు. తాను ఇప్పటికే మాజీ మంత్రి షబ్బీర్అలీపై నాలుగు సార్లు గెలుపొందానని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల స్వరూపా కృష్ణమూర్తి, జడ్పీటీసీ కొండా హన్మాండ్లు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బిక్కాజి బల్వంత్రావు, సర్పంచ్ యాదగిరి, ఎంపీటీసీ రాజు, సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు కమలాకర్రావు, జూకంటి మోహన్రెడ్డి, నల్లవెల్లి అశోక్, నీరడి శంకర్, ప్రజలు పాల్గొన్నారు.