Vemula Prashant reddy | హైదరాబాద్: సచివాలయం (Secretariat)లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సోమవారం ఆరోగ్య శాఖ సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఆరోగ్య శాఖకు సంబంధించిన సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా ఆరోగ్య సంబంధిత సమస్యలు, ప్రభుత్వ వైద్య సంస్థల పనితీరు, మౌలిక సదుపాయాల కల్పన, మందుల లభ్యత, వైద్యులు, సిబ్బంది అందుబాటు, ప్రజారోగ్య సేవల మెరుగుదల తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా బాల్కొండ నియోజకవర్గ ఆరోగ్య శాఖ కు సంబంధించి పలు ప్రతిపాదనలు మంత్రికి అందించి మంజూరు చేయాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ప్రతిపాదనలు
బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఏరియా ఆస్పత్రి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వెంటనే తేవాలని , పెండింగ్లో ఉన్న హాస్పిటల్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. భీమ్గల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) రాహత్ నగర్ గ్రామానికి తరలించేందుకు అనుమతి మంజూరు చేయడం, రాహత్ నగర్లో నూతన పీహెచ్సీ భవన నిర్మాణానికి పరిపాలనా అనుమతి మంజూరు చేయడం గురించి విన్నవించారు. భీమ్గల్లో కొత్త పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC) ఏర్పాటుకు పరిపాలనా అనుమతి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మోర్తాడ్ మండలంలోని పాలెం లేదా తిమ్మాపూర్ గ్రామంలో కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కోసం పరిపాలనా అనుమతి మంజూరు చేయాలని కోరారు.
బాల్కొండ మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) కొత్త భవన నిర్మాణానికి పరిపాలనా అనుమతి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాల్కొండ, మోర్తాడ్లో కొత్త పోస్టుమార్టం భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతి మంజూరు చేయాలని విన్నవించారు. బాల్కొండ నియోజకవర్గంలోని 24×7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది మంజూరు చేయడం, ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. బాల్కొండ నియోజకవర్గంలోని తొమ్మిది ఉపకేంద్ర భవనాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) నిధులను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 18 ఆరోగ్య ఉపకేంద్రాలు / ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల (AAM) నిర్మాణానికి పరిపాలనా అనుమతి మంజూరు చేసి, నిధులు విడుదల చేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో MRI మెషిన్ను మంజూరు చేయాలని, ఖాళీ పోస్టు లను భర్తీ చేయాలని, అత్యవసర అవసరాల కోసం నిధులు మంజూరు చేయాలని విన్నవించారు.