కంటేశ్వర్ సెప్టెంబర్ 13 : తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజు, ఉపేందర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని ఇచ్చిన హామీకి నేటికీ రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ సమస్యల పరిష్కారంలో సీఎం చొరవ చూపకపోవడం బాధాకరమన్నారు. హనుమకొండ ఏకశిలా పార్కు వేదికగా సెప్టెంబర్ 13, 2023 రోజున ముఖ్యమంత్రి అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో వంద రోజుల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగులను సగౌరవంగా పిలిచి సచివాలయం వేదికగా చాయ్ తాగే లోపు జీవో ఇచ్చి రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు.
సీఎం రెండేళ్ల తర్వాత సెప్టెంబర్ 13న ప్రామిస్ డేగా భావిస్తూ మరొక్క మారు గుర్తుచేస్తూ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యావ్యవస్థలో కష్టపడి పని చేస్తున్న సరైన వేతనాలు లేక ఉద్యోగ భద్రత లేక తీవ్రమైన ఇబ్బందుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం నిర్వహించిన సమ్మె విరమణ హామీలను ప్రభుత్వ పెద్దలు ఆర్థిక, ఆర్థికేతర అంశాలుగా విభజించి, ఆర్థిక అంశాలను మూడు నెలల్లో, ఆర్థికేతర అంశాలను 15 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చి సమ్మె విరమింప చేశారన్నారు. కేవలం రెండు మూడు అంశాలు మినహా అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు చూపలేదని.. తక్షణమే ప్రభుత్వ పెద్దలు స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆరోగ్య కార్డు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించాలని, సమ్మె విరమణ ఒప్పందాలను అమలుపరచాలని డిమాండ్ చేశారు.