బిచ్కుంద, జూలై 31: భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కామారెడ్డి జిల్లా సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు. బిచ్కుందలోని తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దరఖాస్తుదారునికి నోటీసు జారీ చేసిన తర్వాత విచారణ చేపట్టి సమస్యను పరిష్కరించాలన్నారు. దరఖాస్తుదారునికి సంబంధించిన పాత పహాని, కాసర పహానీతోపాటు లింక్ డాక్యుమెంట్ జిరాక్స్లను తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, భూభారతి నిబంధనలపై అధికారులు పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నప్పుడే తప్పిదాలకు తావులేకుండా సమస్యలు పరిష్కారమవు తాయని చెప్పారు. రెవెన్యూ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు.
కుక్కల బెడదను నివారించాలి
గ్రామానికి చెందిన పిట్ల సాయి కుమార్, అనిల్ స్వచ్ఛంద సంస్థ యువకులు బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని వాటిని నివారించాలని వినతిపత్రం అందజేశారు. సుముఖంగా స్పందించిన సబ్ కలెక్టర్ మున్సిపల్ అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో తహసిల్దార్ వేణుగోపాల్, కార్యాలయ సిబ్బంది కుశాల్, రాజగౌడ్, రాజు, మహేందర్, సుమలత తదితరులు పాల్గొన్నారు.