చిలిపిచెడ్, ఆగస్టు 17 : పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రుల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన నాటి సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఎంతో మంది కుటుంబాలకు అండగా నిలిచారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. పేదల సంక్షేమానికి ఉపయోగపడుతున్న ఈ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆమె ఆరోపించారు. సోమవారం మెదక్ జిల్లా చిలిపిచెడ్ తహసిల్దార్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో రాస్తారకో, ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సరైన అవగాహన లేకుండా ప్రజలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు.
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. ఈ పథకాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ హైకోర్టులో కేసు వేస్తే, ప్రభుత్వం తడిబట్ట వేసుకుని కూర్చున్నట్లుగా వ్యవహరిస్తూ సమస్యను పరిష్కరించకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. అదేవిధంగా రైతులకు యూరియా అందించడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు.
యాప్ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం మానుకుని, వారికి అవసరమైన ఎరువులను సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు పేద కుటుంబాలకు ఎంతో భరోసానిస్తున్నాయని, వాటిని రద్దు చేయాలని చూస్తే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని సునీత లక్ష్మారెడ్డి హెచ్చరించారు.
పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాలను స్పష్టం చేయాలని, సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ధర్మారెడ్డి, ఆయా గ్రామ సర్పంచులు అనిల్, బలవంత్ రెడ్డి, స్రవంతి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, విట్టల్, కిషన్ రెడ్డి, సంగా గౌడ్, మాణిక్య రెడ్డి పాటు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.