నిజామాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);కలల కొలువులు ఊరిస్తున్నాయి. వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఉద్యోగ ప్రకటనల జడివానలో నిరుద్యోగులు తడిసి ముద్దవుతున్నారు. అందివచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయి. సీఎం కేసీఆర్ దార్శనికతతో ఇప్పటికే నీళ్లు, నిధుల సమస్య తీరిపోయింది. అధికారం చేపట్టిన నాటి నుంచే నియామకాలపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. గతంలోనే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన కేసీఆర్ సర్కారు.. ఏటేటా ఏర్పడుతున్న ఖాళీలకు అనుగుణంగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది. గ్రూప్-1, 2, 3, 4 సహా వివిధ విభాగాల్లో వేలాది పోస్టుల నియామకానికి ఇటీవలే 30 వరకు నోటిఫికేషన్లు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన వరుస ఉద్యోగ ప్రకటనలతో యువత సంబురపడుతున్నది. వేలాది సంఖ్యలో ఊరిస్తున్న ఉద్యోగాలను దక్కించుకునేందుకు పుస్తకాలతో కుస్తీ పడుతున్నది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత కొలువుల భర్తీ ఊసే ఉండేది కాదు. ఆయా ప్రభుత్వ శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడినా గుట్టుచప్పుడు కాకుండానే ఖతం పట్టించేది. దొడ్డిదారిన, అక్రమంగా నియామకాలు జరిగేవి. ఏపీపీఎస్సీ ద్వారా జరిగే నియామకాలు సైతం డబ్బులు ఇచ్చినోడికే పెద్దపీట దక్కేది. ఉద్యోగ ప్రకటనలు వచ్చినా తెలంగాణలో చూపించే ఖాళీల వివరాలు అత్యంత స్వల్పం. సీమాంధ్ర ప్రాంతంలో దండిగా నియామకాలు చేపట్టి మన ప్రాంతానికి ఆంధ్రా పాలకులు దశాబ్దాలుగా చేసిన అన్యాయాలకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో చరమగీతం పడింది. ఏపీపీఎస్సీ స్థానంలో పురుడు పోసుకున్న టీఎస్పీఎస్సీ ద్వారా అనేక ఉద్యోగ ప్రకటనలు గడిచిన ఎనిమిదేండ్లలో వెలువడ్డాయి. 2014 తర్వాత అనేక నోటిఫికేషన్ల ద్వారా పోలీసు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లతోపాటుగా ప్రభుత్వ శాఖల్లో నియామకాలు జరిగాయి. తాజాగా ఏకధాటిగా వెలువడిన అనేక నోటిఫికేషన్ల ద్వారా వేలాది ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. గ్రూప్ -1 నుంచి మొదలుపెడితే వరుసగా గ్రూప్-2, గ్రూప్ -3, గ్రూప్ -4 నోటిఫికేషన్లు ఇప్పటికే వెలువడి ఉన్నాయి. మరోవైపు ఆయా శాఖల్లో ప్రత్యేక కేటగిరీల్లో నియామకాలకు ప్రకటనలు వెలువడ్డాయి. వేలాది ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండడంతో నిరుద్యోగులంతా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
ఇప్పటికే జోరుగా నియామకాలు..
స్వరాష్ట్రం సిద్ధించిన అనంతరం అనేకమంది యువతకు వేలాది ఉద్యోగవకాశాలు దక్కాయి. వ్యవసాయ శాఖలోనే ఉమ్మడి జ్లిలాలో సుమారుగా వందలాది మందికి స్థానం దక్కింది. ఏఈవో పోస్టులను మూకుమ్మడిగా ప్రభుత్వం భర్తీ చేయడంతో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన పట్టభద్రులకు అవకాశాలు ఇట్టే వచ్చాయి. ఆయా ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీరింగ్ పోస్టులు సైతం భారీగా భర్తీ అయ్యాయి. ఎన్పీడీసీఎల్లో జూనియర్ లైన్మన్ ఉద్యోగాలు సైతం వందలాది ఖాళీలను యాజమాన్యం భర్తీ చేసింది. పోలీస్ శాఖలో పలు దఫాలుగా కానిస్టేబుళ్ల భర్తీ జరిగింది. గ్రూప్ -2తోనూ గెజిటెడ్ ఉద్యోగాలు పొందిన వారు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అనేక మంది ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8వేల మందికి ప్రభుత్వ ఉద్యోగం లభించినట్లుగా ఉద్యోగ సంఘాల అంచనాలు చెబుతున్నాయి. మన ఉద్యోగాలు… మనకే అనే నినాదంతో సాగిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఎనిమిదేండ్ల స్వరాష్ట్రంలో దిగ్విజయంగా అమలవుతూ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగ భర్తీలో జరిగిన అన్యాయం కాస్తా 2014, జూన్ 2 నాటికే భూ స్థాపితమైంది. స్వరాష్ట్రంలో ఉద్యమ సారథియే ముఖ్యమంత్రి కావడంతో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ ట్యాగ్లైన్ ప్రధాన ఉద్దేశం కార్యరూపం దాల్చింది.
మొదలైన హడావిడి…
గ్రూప్-4 దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. జనవరి 30 చివరి తేదీగా ఉన్నది. గ్రూప్-3 నోటిఫికేషన్కు దరఖాస్తుల స్వీకరణ జనవరి 24న మొదలైన ఫిబ్రవరి 10న ముగుస్తుంది. గ్రూప్-2కు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు కొనసాగుతుంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్కు దరఖాస్తుల స్వీకరణ జనవరి 27న ముగుస్తుంది. జూనియర్ లెక్చరర్కు జనవరి 10వ తేదీకి ముగియనున్నది. మున్సిపల్ శాఖలో అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు జనవరి 20నుంచి ఫిబ్రవరి 11వరకు, రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్కు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 1వరకు, ఇంటర్మీడియెట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖలో లైబ్రేరియన్ పోస్టులకు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు, ఏవో(వ్యవసాయాధికారులు) పోస్టులకు జనవరి 10 నుంచి జనవరి 30, ఇంటర్మీడియెట్, టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఫిబ్రవరి 27 చివరి తేదీగా ఉంది. ఉద్యానవన అధికారుల పోస్టులకు జనవరి 24తో ముగియనున్నది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్కు జనవరి 19తేదీతో ఆఖరు కాగా పాలిటెక్నిక్ కళాశాలల్లో అధ్యాపక, డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఇప్పటికే ముగిసింది.
స్థానికులకే ఉద్యోగవకాశాలు…
ఉమ్మడి రాష్ట్రంలో మన ఉద్యోగాలను యథేచ్ఛగా ఆంధ్రాప్రాంత వ్యక్తులు దోచుకెళ్లారు. అక్రమంగా వచ్చి మనస్థానాల్లో తిష్ట వేశారు. ఇష్టానుసారంగా జోనల్ వ్యవస్థ ఉండడమే ఇందుకు కారణం. స్వరాష్ట్రం సిద్ధించిన అనంతరం సీఎం కేసీఆర్ ఈ వ్యవస్థను సమూలంగా మార్చివేశారు. గతంలో జరిగిన నష్టాన్ని సవరించి స్థానికులకే ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించారు. నూతన జోనల్ విధానానికి 2018లోనే రాష్ట్రపతి ఆమోదం తెలుపడంతో ఇందుకు అనుగుణంగానే నియామక ప్రక్రియ కొనసాగుతున్నది. 95శాతం ఉద్యోగాలన్ని స్థానికులకు పెద్దపీట వేయగా 5శాతం నాన్ లోకల్ కోటాను నిర్ధేశించారు. తెలంగాణ ప్రజలకు తీవ్రనష్టాన్ని చేకూర్చిన పాత జోనల్ వ్యవస్థ కాలగర్భంలో కలిసి పోయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డి లోని (1) (2) క్లాజ్లను అనుసరించి తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్టర్ రిక్రూట్మెంట్) ఆర్డర్ 2018 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లు, ఏడు జోన్లు ఆవిర్భవించాయి. మల్టీజోన్-1 లో నాలుగు జోన్లను విభజించారు. మల్టీ-జోన్ 2లో మూడు జోన్లున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధి మొత్తం మల్టీజోన్ -1లో చేరింది. కాకపోతే జోన్ల వారీగా విభజించినప్పుడు రెండు జిల్లాలు వేర్వేరు జోన్లలో చేరిపోయాయి. నిజామాబాద్ను బాసర జోన్లో, కామారెడ్డిని రాజన్నసిరిసిల్ల జోన్లో కలిపారు.
సన్నద్ధమవుతున్న యువత…
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ప్రకారం వరుస నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతున్నది. టీఎస్పీఎస్సీ నుంచి పదుల సంఖ్యలో ప్రకటనలు వెలువడగా ప్రక్రియ సజావుగా సాగుతున్నది. ఏకంగా 80వేల 39 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇందుకు వెంటనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం చెప్పినట్లుగానే నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. కేసీఆర్ ప్రకటన మూలంగా రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. వాస్తవానికి ఇది కొత్తగా, ఇప్పుడే ప్రారంభమైంది కూడా కాదు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నుంచి ఖాళీల భర్తీ, క్రమం తప్పకుండా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 56వేలకు పైగా ఖాళీలను గుర్తించి లక్షా 33వేల నియామకాలను పూర్తి చేసింది. వీటికి అదనంగా 80వేల రిక్రూట్మెంట్ జత కలవనున్నది. ప్రభుత్వం ఖాళీల భర్తీపై సీరియస్గా ముందుకెళ్తున్న నేపథ్యంలో నిరుద్యోగ యువత ప్రిపరేషన్పై దృష్టి సారించింది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ భారీ పోటీని చేధించుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేందుకు యువతీ యువకులు పోటీ పడుతున్నారు. స్వగృహాలు, గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్న వనరులను అనుకూలంగా మార్చుకుంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు..
ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లు మాలో సంతోషాన్ని నింపాయి. ప్రభుత్వం గ్రూపుల వారీగా పరీక్షలను సకాలంలో నిర్వహించి, ఉద్యోగాలను భర్తీ చేయాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ శాఖల్లో ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్లు జారీ చేయడం సంతోషం. ఏండ్లకాలంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మాకు ఈ నోటిఫికేషన్ల జారీ ఉత్సాహాన్నిచ్చింది. 2020లో బీటెక్ పూర్తి చేశా.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కృషి చేస్తున్నా. ఉద్యోగాల భర్తీ ప్రకటన విడుదల చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– బి. రజిత, నిజామాబాద్.
కోచింగ్ తీసుకుంటున్నా..
ప్రభుత్వ ఉద్యోగ సాధన కోసం కష్టపడుతూ కోచింగ్ తీసుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు జారీ చేయడంతో మాలో ఆశలు చిగురించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో కష్టపడుతున్నా. 2020లో డిగ్రీ పూర్తి చేసుకుని, ఉద్యోగం సాధించాలనుకున్న సమయంలో ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయడం వరంగా మారింది. చందూర్ నుంచి బోధన్కు వచ్చి కోచింగ్ తీసుకుంటున్నా. నోటిఫికేషన్లు జారీ చేసిన సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– కె. గణేశ్, చందూర్.
గ్రూప్-2కి ప్రిపేర్ అవుతున్నా..
ఖలీల్వాడి, జనవరి 9: రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో గ్రూప్-2కి ప్రిపేర్ అవుతున్నా. గవర్నమెంట్ జాబ్ సాధించాలనే పట్టుదలతో లైబ్రరీలో చదువుకుంటున్న. ప్రభుత్వం కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకొని ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉన్నది.
– జయరాం, కొండాపూర్, సిరికొండ మండలం
నిరుద్యోగులకు వరంలాంటిది
ఎన్నో రోజులుగా ఉద్యోగ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురును అందించింది. వివిధ గ్రూపుల్లో ఉద్యోగ ప్రకటన చేయడంతో ఉద్యోగాల సాధన కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం. ఎలాగైనా ఉద్యోగం సాధించేందుకు కృషి చేస్తున్నాం. సీఎం కేసీఆర్కు తామంతా ఎంతో రుణపడి ఉంటాం.
– మోస్రం సోన్దేవి, ఎంఏ తెలుగు, టీయూ
జేఎల్ జాబ్ సాధిస్తా..
జూనియర్ లెక్చరర్ పోస్టు కోసం చదువుతున్నాను. ప్రతి రోజూ నవీపేట మండలం తుంగిని గ్రామం నుంచి వస్తున్నాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే చదువుకుంటున్నాను. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో పరీక్షకు సన్నద్ధమవుతున్నా. జేఎల్ పోస్టు సాధిస్తాననే నమ్మకం ఉన్నది.
– సంధ్యా, తుంగిని, నవీపేట
పట్టుదలతో ఉన్నాం…
రాష్ట్రం ఏర్పాటు తర్వాత నిధులు, నీళ్లు, నియామకాల కోసం సీఎం కేసీఆర్ కంకణబద్ధులై పని చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున నోటిఫికేషన్ విడుదల చేయడం శుభపరిణామం. ఎలాగైన గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలు సాధించేందుకు పట్టుదలతో చదువుతున్నాం. ఉద్యోగం సాధిస్తామన్న పూర్తివిశ్వాసం కలిగింది.
– ఎస్.రమేశ్, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్, టీయూ