నిజామాబాద్ క్రైం/నిజామాబాద్ రూరల్, జనవరి 26: పశుగణాభివృద్ధి సంస్థ సహాయ సంచాలకుడు, డీఎల్డీఏ కార్యనిర్వహణాధికారి డాక్టర్ పెద్దకాసుల శ్రీశైలం (52) ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం రాత్రి తన కార్యాలయంలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడగా, గణతంత్ర దినోత్సవం రోజున శుక్రవారం వెలుగుచూడడం జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
హన్మకొండ జిల్లాకు చెందిన శ్రీశైలం.. ఏడాది క్రితం బదిలీపై నిజామాబాద్ జిల్లాకు వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులకు ఫోన్చేసి అందరూ బాగుండండి అంటూ మాట్లాడడంతో అనుమానం కలిగింది. తండ్రి మాటల్లో బాధను గుర్తించిన కుమారుడు రవితేజ.. శ్రీశైలం కార్యాలయంలోనే ఉన్నట్లు తెలుసుకున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి హుటాహుటిన వరంగల్ నుంచి బయల్దేరి సారంగాపూర్ పరిధిలోని ఆయన ఆఫీస్కు అర్ధరాత్రి 1.40 గంటలకు చేరుకున్నారు. బయటి నుంచి ఎంత పిలిచినా సమాధానం రాలేదు. దీంతో కార్యాలయం డోర్ ధ్వంసంచేసి లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్కు శ్రీశైలం వేలాడుతూ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి దవాఖానకు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఆరో టౌన్ ఎస్సై సాయికుమార్ తెలిపారు.
‘నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు..’
శ్రీశైలం ఆత్మహత్యకు ముందు కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడారు. అందరూ బాగుండాలని సూచించాడు. ఈ విషయాన్ని సూసైడ్ నోట్లోనూ రాశారు. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని, తనకు జీవితంపై విరక్తి చెందిందని, చిన్ననాటి మిత్రులు, తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు అంటూ నోట్లో పేర్కొన్నారు.
కలచివేసిన ఘటన..
అందరితో కలుపుగోలుగా ఉండే ఏడీ శ్రీశైలం ఆత్మహత్యకు పాల్పడడం అందరి హృదయాలను కలిచివేసింది. సిబ్బందితో అన్ని విషయాల్లోనూ సన్నిహతంగా ఉండేవారు. తమ శాఖ లక్ష్యం కోసం సిబ్బంది, గోపాలమిత్రల సమన్వయంతో కృషి చేశారు. శ్రీశైలం మృతివిషయం తెలుసుకున్న జిల్లా పశు సంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్ జగన్నాథాచారి, ఏడీలు బాలిక్ అహ్మద్, బస్వారెడ్డి, వెటర్నరీ వైద్యులు ప్రమోద్కుమార్, గోపీకృష్ణ, డీఎల్డీఏ చైర్మన్ రాజలింగం తదితరులు ఆయన పార్ధివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతదేహాన్ని హన్మకొండలోని స్వగృహానికి తరలించారు.