నిజామాబాద్ రూరల్, మార్చి 21: పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లలు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన బస్తీ-మన బడి, మన ఊరు – మన బడి కార్యక్రమం సత్ఫలితాన్నిస్తుంది. తొలి విడుతగా రూరల్ మండలంలో ఉన్న 16 స్కూళ్లల్లో ఈ కార్యక్రమం కింద వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందూరు నగర శివారులోని 3వ డివిజన్ పరిధిలో ఉన్న గూపన్పల్లి ప్రైమరీ స్కూల్కు మంజూరు చేసిన రూ.16.85 లక్షలతో వివిధ మౌలిక సదుపాయాలు కల్పించారు. మన బస్తీ-మన బడి కింద మంజూరైన ఈ నిధులతో అన్ని పనులను పూర్తి చేసుకొని రూరల్ మండలంలోనే ఈ పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచింది. రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, డీఈవో దుర్గాప్రసాద్తో కలిసి ఈ పాఠశాలలో కల్పించిన మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. మన బస్తీ – మన బడి కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను చూసి సంతృప్తి వ్యక్తంచేశారు.
మొన్నటి వరకు స్కూల్ దుస్థితి ఇలా…
ఈ పాఠశాలలో పేద, బడుగువర్గాలకు చెందిన 160 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. 1-5వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన జరుగుతున్నది. ఇంతకుముందు కనీస సౌకర్యాలు కొరవడిన కారణంగా సమస్యల వలయంలోనే విద్యార్థులు చదువుకొనే పరిస్థితి ఉండేది. తరగతి గదుల్లో కింద కూర్చునే వారు. టాయిలెట్ల వసతి సరిగ్గా లేక నీటి కొరత ఉండేది. గదులకు కిటికీలు కూడా సరిగ్గా లేవు. ఆశించినంతగా ఫర్నిచర్ కూడా కరువవ్వడంతో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. ఉమ్మడి రాష్ట్ర పాలనలో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి తగినన్ని నిధులు కేటాయించని కారణంగా సమస్యల వలయంలోనే విద్యార్థులు విద్యనభ్యసించే దుస్థితి నెలకొని ఉండేది. పాఠశాల చుట్టూ ప్రహరీ లేకపోవడంతో పందులు, పశువులు, విషపు కీటకాలు సంచరించడంతో అపరిశుభ్రత ఏర్పడి విద్యార్థులకు ప్రశాంత వాతావరణం కరువైంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపి మనబస్తీ – మన బడి, మన ఊరు – మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని ఫలితంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడి విద్యార్థులు ప్రశాంతంగా చదువుకొనేందుకు అవకాశం కల్పించినట్లయ్యింది.
మారిన స్కూల్ రూపురేఖలు..
రూ.16.85 లక్షలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టారు. స్కూల్ తరగతి గదుల మరమ్మతు చేశారు. స్కూల్ చుట్టూ ప్రహరీ నిర్మించారు. కిటికీలు, డోర్లు కొత్తగా అమర్చారు. స్కూల్ ఆవరణలో సీసీ ఫ్లోరింగ్ చేశారు. టాయిలెట్లు నిర్మించి వాటికి రన్నింగ్ వాటర్ వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించారు. వంటశాల, భోజనశాలను నిర్మించారు. విద్యార్థులు కూర్చుండేందుకు 75 డ్యుయల్ డెస్క్ బెంచీలు, టీచర్లకు అవసరమైన కుర్చీలు, టేబుళ్ల వంటి ఫర్నిచర్ సౌకర్యం కల్పించారు. ఏడు గ్రీన్ చార్ట్ బోర్డులను ఏర్పాటు చేశారు. విద్యార్థులు హ్యాండ్వాష్ చేసుకునేందుకు ప్రత్యేకంగా కుళాయిల వసతి కల్పించారు. తరగతి గదులు, తలుపులు, కిటికీలకు పెయింటింగ్ వేయడంతో ప్రస్తుతం పాఠశాల తళుక్కున మెరిసిపోతుంది. సర్వశిక్షా అభియాన్ రిటైర్డ్ సీఎంవో సుధాకర్రావు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి ఈ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సరస్వతి దేవి విగ్రహం కనువిందు చేస్తుంది. వీడీసీ మాజీ చైర్మన్ చిటికెల సంతోష్రెడ్డి సేవా దృక్పథంతో విద్యార్థులకు సరిపడేంతగా మినరల్ వాటర్ను నిరంతరం సరఫరా చేస్తున్నారు.
ప్రభుత్వ బడికి..కార్పొరేట్ హంగు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మనఊరు- మనబడి, మనబస్తీ- మనబడి కార్యక్రమంతో సర్కారు బడుల రూపురేఖలు మారాయి. మొదటి విడుతలో ఎంపిక చేసిన పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తవ్వగా, రెండో విడుత పాఠశాలల్లో మరమ్మతు పనులు చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. నాగిరెడ్డిపేట్ మండలంలో 49 పాఠశాలలకు 14 పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసింది. జలాల్పూర్లో ఎంపీయూపీఎస్, తాటిచెట్టు గడ్డతండాలో ఎంపీయూపీఎస్, జాన్కంపల్లిలో ఎంపీయూపీఎస్, బొల్లారంతండాలో యూపీఎస్, బొల్లారం ఎంపీపీఎస్, బొల్లారం జడ్పీహెచ్ఎస్, తాండూర్ ఎంపీపీఎస్, కిచ్చన్నపేట్ ఎంపీపీఎస్, తాండూర్ జడ్పీహెచ్ఎస్, గోపాల్పేట్ ఎంపీపీఎస్ (ఉర్దూ మీడియం), జడ్పీహెచ్ఎస్ గోపాల్పేట్, ఎంపీపీఎస్ గోపాల్పేట్, గోలిలింగాల్ ఎంపీపీఎస్, వదల్పర్తి ఎంపీపీఎస్ పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో విద్యుత్ మరమ్మతులు, తాగునీటి సౌకర్యం, డైనింగ్ హాల్, వంటశాల, ప్రహరీ, మరుగుదొడ్లు తదితర అభివృద్ధి పనులను పూర్తి చేశారు. కొన్ని చోట్ల 50శాతం, మరికొన్నిచోట్ల 75 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అన్నిరకాల వసతులు కల్పిస్తున్నారు. విద్యార్థులు చేతులు కడుక్కోవడానికి వాష్బెషన్ ఏర్పాటు చేయడంతోపాటు పాఠశాలకు రక్షణగా ప్రహరీ నిర్మిస్తున్నారు. గ్రీన్ బోర్డులు, ఫ్యాన్లు ఏర్పాటు చేసి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. మండలంలోని పల్లె బొగుడతండా పరిధిలో ఉన్న బొల్లారం తండా పాఠశాల మొదటి విడుతలో ఎంపికై, పనులు పూర్తి చేసుకోవడంతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, కలెక్టర్ జితేశ్ పాటిల్ ఇటీవల పాఠశాలను ప్రారంభించారు.
శిథిల భవనం నుంచి.. అధునాతనం వైపు..
వానకాలం వచ్చిందంటే మోకాలి లోతు బురద.. తరగతి గదుల పైకప్పు నుంచి కురుస్తున్న వర్షం.. తడుస్తున్న పుస్తకాలు.. బటల్లనీ బురదమయం.. ఉపాధ్యాయుల కొరత.. ఇలా ఎన్నెన్నో సమస్యలతో నిత్యం సావాసం చేస్తూ విద్యను అభ్యసించడం ఆ విద్యార్థినులకు అలవాటైపోయింది. దీంతో చదువు బుర్రకెక్కక ఉత్తీర్ణతా శాతం పడిపోవడం, తదితర సమస్యలతో వర్ని మండలంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొట్టుమిట్టాడింది. గత పాలకులకు ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కించుకోకపోవడంతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపడుతున్నారు. అదే సమయంలో సత్యనారాయణపురం విద్యార్థినులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాఠశాల దుస్థితిని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్ను ఒకరోజు పాఠశాలకు ఆహ్వానించి తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. దీంతో చలించిన స్పీకర్ పక్కా ప్రణాళికతో పాత పాఠశాల భవనం స్థానంలో కొత్త భవనాన్ని పూర్తిసౌకర్యాలతో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రూ.90లక్షల వ్యయంతో కొత్త భవన నిర్మాణానికి అంచనాలను సిద్ధం చేశారు.
వెంటనే నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేయడమే కాకుండా టెండరు ప్రక్రియ, ఇతర పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్పీకర్ ప్రత్యేక శ్రద్ధతో నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడమే కాకుండా, తరుచూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ పనులను వేగవంతం చేయించారు. దీంతో ఎనిమిది నెలల్లోనే కొత్త పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమయ్యింది. విద్యార్థినులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు మరో రూ.9లక్షలతో అంచనాలను సిద్ధం చేశారు. దీంతో సమస్యలు పరిష్కారమై ఆహ్లాదకరమైన వాతావరణంతోపాటు అన్ని సౌకర్యాలతో ఏ రందీ లేకుండా విద్యార్థినులు చదువుకొంటున్నారు. నూతన పాఠశాల భవనంలో అన్ని సౌకర్యాలు కల్పించడంతో విద్యార్థినులు ఆనందం వ్యక్తంచేస్తూ సౌకర్యాలు కల్పించిన స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, సీఎం కేసీఆర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
స్పీకర్ కృషితోనే సాధ్యమైంది.
స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కృషితోనే ఇంత అధునాతన భవన నిర్మాణం సాధ్యమయ్యింది. కొత్త భవనంలో విద్యార్థినులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దోహదపడుతుంది.
– మమత, ప్రధానోపాధ్యాయురాలు, ఎస్ఎన్పురం
మా పిల్లల అదృష్టం
తొలి విడుతలోనే మా స్కూల్ను మన బస్తీ – మన బడి కింద ఎంపిక చేసి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో స్కూల్లో ఏ లోటూ లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇక విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన ఇంగ్లీష్ మీడియంలో సక్రమంగా జరిగేలా ఉపాధ్యాయుల సమన్వయంతో కృషి చేస్తున్నాం. ప్రభుత్వంతోపాటు వీడీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పలువురు దాతలు పాఠశాల అభివృద్ధికి తగిన సహకారం అందిస్తున్నారు.
– రమ, హెడ్మాస్టర్, గూపన్పల్లి
బడిని మంచిగా చేసిండ్రు..
మా ఊరి బడిని కొత్తగా చేసిండ్రు. మా ఊరు పిల్లలకు మంచిగా చదువు చెప్పుతుండ్రు. మారుమూల గ్రామంలో ఉన్న పాఠశాలను గుర్తించి మనఊరు- మనబడి కార్యక్రమంలో అన్ని సౌలత్లు కల్పించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– బద్దీబాయి, సర్పంచ్, పల్లె బొగుడతండా