కామారెడ్డి, మే 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని పల్లెపల్లెనా ప్రజలకు వివరించాలని, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గపరిధిలో ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవతో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రభుత్వం సూచించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు. జూన్ 2న పతాకావిష్కరణ, దశాబ్ది ఉత్సవ సందేశంతో ఉత్సవాలు ప్రారంభమై జూన్ 22న అమరవీరుల సంస్మరణ సభ, అమరవీరుల స్తూపం ఆవిష్కరణతో ముగుస్తాయని తెలిపారు. 20 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలన్నారు. తెలంగాణ ప్రగతిని ప్రతిఒక్కరికీ తెలిసేలా ఎలుగెత్తి చాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. రైతువేదికల వద్ద ఎమ్మెల్యేలు రైతులతో కలిసి భోజనం చేయాలన్నారు.
రాష్ట్రం ఏర్పాటు లాగే కామారెడ్డి జిల్లా ఏర్పాటు అనేది ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అని, అది నెరవేరిందన్నారు. అలాగే కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత చేరువైందన్నారు. కొత్త జిల్లాగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంబురాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. కామారెడ్డికి మెడికల్ కళాశాల, బాన్సువాడలో నర్సింగ్ కళాశాల, వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలు, గురుకులాలు, ఇతర సంక్షేమ పాఠశాలల వివరాలను తెలియజేయాలన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధిని నాడు-నేడు ఫొటోలతో ప్రదర్శించాలన్నారు. పల్లె, పట్టణ ప్రగతితో గ్రామాలు జాతీయస్థాయి అవార్డులు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచాయని మంత్రి వేముల గుర్తు చేశారు.
సాగునీటి రంగానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను కేటాయించిందని, రైతులకు దీని గురించి వివరించాలని మంత్రి సూచించారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా సాగునీటి చెరువుల పునరుద్ధరణ, గ్రామాల్లో చెక్డ్యాములు, ఊట చెరువుల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే చీకటి అవుతుందని చెప్పిన చోట.. నేడు విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్న అంశాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారంతోపాటు గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు.
కులవృత్తుల వారికి ఒక లక్ష రూపాయలు ఇచ్చి అండగా నిలవాలని సీఎ కేసీఆర్ నిర్ణయించారని, ఈ మేరకు లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి.. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అందజేయాలని సూచించారు. 4,480 మంది రైతులకు 12,969 ఎకరాల పోడు పట్టాలు గిరిజనులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హత గల వారికి ఇంటి స్థలాల పట్టాలు అందజేయాలని అన్నారు. జూన్ 19న నిర్వహించే తెలంగాణ హరితోత్సవం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ నేతృత్వంలో జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భవించిందని, 2001లో పోచంపాడ్లో ఉద్యమానికి సంబంధించిన కార్యాచరణ కోసం సమావేశం నిర్వహించగా, అర్ధరాత్రి వేళ అప్పటి చంద్రబాబు సర్కార్, జలదృశ్యంలో ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేయించారని గుర్తుచేశారు. ఉద్యమ ఆనవాళ్లు లేకుండా చేయగా.. ప్రస్తుతం అదే చోట సీఎం కేసీఆర్ వందల కోట్లతో స్టెయిన్లెస్ స్టీల్తో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేయించారని తెలిపారు. ఇలాంటి స్తూపాలు చికాగో, దుబాయి నగరాల్లో ఉన్నాయని, మూడోది హైదరాబాద్లోనే ఉందని.. ఇది ఆ రెండు స్తూపాల కన్నా వైశాల్యంలో పెద్దదని వివరించారు. ఈ స్తూపాన్ని తమ ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించిన ఈ స్తూపం.. తెలంగాణ ఉద్యమానికి చిహ్నమని అన్నారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్షిండే, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, డీఎఫ్వో నిఖిత, మున్సిపల్ చైర్మన్లు జాహ్నవి, జంగం గంగాధర్, అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.