ఉమ్మడి జిల్లాలో ఓటర్లు చైతన్యాన్ని చాటారు. మహిళలు సైతం భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకొని శభాష్ అనిపించుకున్నారు. మగవారికి తామేమీ తక్కువ కాదు, వారికంటే తామే ఎక్కువని మహిళామణులు నిరూపించారు. సందర్భం ఏదైనా మహిళలు అన్నింటా తమ వంతు పాత్ర పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నాటి నుంచి నేటి వరకు అనేక అంశాల్లో.. అనేక సందర్భాల్లో నడుం బిగించి ముందుకు నడిచారు. తాజాగా ఎన్నికల వేళ మహిళా లోకం మరోమారు తమ సత్తాను చాటింది. తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వారు ఉత్సాహం కనబరిచారు. కామారెడ్డి జిల్లాలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం మహిళా ఓటర్లు 3,45,915 మంది ఉండగా 2,79,063 మంది ఓటు వేశారు. 2018లో 78.83 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 79.92 శాతం నమోదయ్యింది. నిజామాబాద్ జిల్లాలో 2018లో 73.81 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 74.68 శాతం నమోదైంది. రెండు జిల్లాల్లో గత ఎన్నికల కన్నా పోలింగ్ శాతం పెరిగింది.
కామారెడ్డి/ ఖలీల్వాడి, డిసెంబర్ 1 : కామారెడ్డి జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్లో ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు. ఉత్సాహంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం తక్కువ మంది ఓటర్లు రాగా మధ్యాహ్నం నుంచి పోలింగ్ ముగిసే వరకు తండోపతండాలుగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో గెలిపించాలని పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలారు. గతంలో ఎన్నడూలేని విధంగా కామారెడ్డిలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు ఉత్సాహం చూపడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 791 పోలింగ్ కేంద్రాల్లో 79.92 పోలింగ్ శాతం నమోదైంది.
ఉమ్మడి జిల్లాలో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. ఇందులో సింహభాగం ఓట్లు తమకే అనుకూలమని బీఆర్ఎస్ భావిస్తున్నది. గంపగుత్తగా ఇవన్నీ కారు గుర్తుకే పడ్డాయనే విశ్వాసాన్ని ఆ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు కొండంత అండగా నిలిచాయి. దీంతో తమ పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో 74.68శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో ఉదయం వేళ చిరుజల్లులు కురవడంతో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు ఆలస్యంగా చేరుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. సాయంత్రం ఐదు గంటల వరకు క్యూలో నిల్చొని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో 76.02 శాతం, బోధన్లో 77.92 శాతం, నిజామాబాద్ అర్బన్లో61.66, బాల్కొండలో 79.72 శాతం, బాన్సువాడలో 81.29 శాతం, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 76.43 శాతం పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లాలో ఓటర్లు చైతన్యాన్ని చాటారు. తమకు ఉన్న ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ఉత్సాహం కనబరిచారు. పల్లెపల్లెన ఉద్యమ స్ఫూర్తి రగిలించిన ఉమ్మడి జిల్లా ఇందూరు.. ఇప్పుడు ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ పోటాపోటీగా ఓటింగ్లో పాల్గొని తమ సత్తాచాటింది. ఓట్ల పండుగలో పాల్గొని స్ఫూర్తిగా నిలిచారు.
కామారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 791 పోలింగ్ కేంద్రాల్లో 79.92 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం 6,72,953 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 3,27,001, స్త్రీలు 3,45,915, ఇతరులు 37 మంది ఉన్నారు. ఇందులో 5,37,794 పురుషులు, 2,58,722 మంది స్త్రీలు 2,79,063,ఇతరులు 9 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో 2,52,460 మంది ఓటర్లకు పురుషులు 1,22,019, స్త్రీలు 1,30,417, ఇతరులు 24 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 89,936, స్త్రీలు 1,00,866, ఇతరులు 9 మంది మొత్తం 1,90,811 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.కామారెడ్డి నియోజకవర్గంలో 75.58 శాతం పోలింగ్ నమోదు అయింది.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 2,20,531 మంది ఓటర్ల ఉన్నారు.ఇందులో పురుషులు 1,06347,స్త్రీలు 1,14,181,ఇతరులు ముగ్గురు ఉన్నారు. పురుషులు 87,212, స్త్రీలు 96,202 మంది మొత్తం 1,83,414 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 83.17 పోలింగ్ శాతం నమోదైంది.
జుక్కల్ నియోజకవర్గంలో 1,99,962 మంది ఓటర్ల ఉన్నారు.ఇందులో పురుషులు 98,635,స్త్రీలు 1,01,317,ఇతరులు 10 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 81,574,స్త్రీలు 81,995 మంది మొత్తం 1,63,569 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.జుక్కల్ నియోజకవర్గంలో 81.87 పోలింగ్ శాతం నమోదుకావడం గమనార్హం. జిల్లాలో అత్యధికంగా ఎల్లారెడ్డిలో 83.17 పోలింగ్ శాతం నమోదైంది.