డిచ్పల్లి, నవంబర్ 24 : ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం ఎంతో ఆసరాగా నిలుస్తున్నదని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జక్రాన్పల్లి మండలకేంద్రంలో 70 మంది లబ్ధిదారులకు రూ. 70 లక్షల 8వేల 120 విలువైన చెక్కులను ఎంపీపీ కుంచాల విమలారాజుతో కలిసి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ నాయకులు.. సీఎం కేసీఆర్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పసుపు బోర్డు పేరిట రైతులను మోసం చేసి గెలిచిన అరవింద్.. అభివృద్ధి కోసం రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. తక్షణమే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేజీబీవీ భవనం ప్రారంభం..
జక్రాన్పల్లి మండలకేంద్రంలో రూ. 2కోట్ల 5 లక్షలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాల భవనాన్ని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ఎంపీపీ విమలారాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నదని అన్నారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ కోట్లాది నిధులు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. గత పాలకులు విద్యారంగాన్ని పట్టించుకునేవారు కాదని, ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక గురుకులాలను ఏర్పాటు చేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా సర్కారు బడుల్లో సౌకర్యాలు, నాణ్యమైన విద్యను అందించేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత అయనకే దక్కిందన్నారు.
విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, వైస్ ఎంపీపీ ముస్కు తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఢీకొండ శ్రీనివాస్, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఏకే ఖాన్, డీఈవో దుర్గాప్రసాద్, ఎంపీడీవో లక్ష్మణ్, తహసీల్దార్ మల్లేశ్, కేజీబీవీ ఎంఈవో శ్రీనివాస్, ప్రిన్సిపాల్ స్వప్న, సర్పంచులు, ఎంపీటీసీలు, విండో చైర్మన్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
వినతుల స్వీకరణ.. బాజిరెడ్డి నివాసం వద్ద సందడి
నిజామాబాద్ రూరల్, నవంబర్ 24 : నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజల నుంచి ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఆయన నివాస ప్రాంగణం సందడిగా మారింది. ట్రైబల్ వెల్ఫేర్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీ సభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వసంత్రావు నేతృత్వంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మండలంలోని పాంగ్రా, బ్యాంకు కాలనీకి చెందిన అన్నపూర్ణకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే బాజిరెడ్డి పంపిణీ అందజేశారు.