నిజాంసాగర్,ఏప్రిల్ 2: సీఎం కేసీఆర్ పాలన ప్రపంచానికే రోల్ మాడల్ అని, తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే పిలుపునిచ్చారు. ఇప్పటికే మూడుసార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించారని, కలిసికట్టుగా ఉంటూ మరోమారు గెలిపించి సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు. నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్రావ్పల్లి చౌరస్తా వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అత్మీయ సమ్మేళనంలో ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజుతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. పక్క రాష్ర్టాలతో తెలంగాణను పోల్చి చూస్తే ప్రతిపక్షాలకు అభివృద్ధి అంటే ఏమిటో తెలుస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో సభలు ఏర్పాటు చేసి తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించినప్పటి నుంచి మహారాష్ట్ర ప్రజలు అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. తెలంగాణలో ఉన్న పథకాలు మాకు కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని వివరించారు. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి పథకాలను బీఆర్ఎస్ అమలు చేస్తున్నదని, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సింగ్రావ్పల్లి నుంచి నిజాంసాగర్ వరకు రోడ్డు వేసుకున్నామని, రూ.25 కోట్లతో మంజీరా వంతెన, రూ.7.50 కోట్లతో వెల్గనూర్ వంతెన, రూ.476 కోట్లతో నాగమడుగు మత్తడి పనులు మంజూరు చేసుకున్నామని అన్నారు.
మల్లూర్ రోడ్డును రోడ్లు భవనాల శాఖలోకి మార్చి డబుల్ రోడ్డుగా వేసుకోవాల్సి ఉందని, పిప్పిరేగడి తండా, మర్పల్లి, లింగంపల్లి రహదారులు బీటీ రోడ్లుగా మార్చేందుకు నిధుల కోసం సీఎం కేసీఆర్కు నివేదించానని, త్వరలో అవి కూడా పూర్తిచేస్తామన్నారు. సీఎం కేసీఆర్కు నిజాంసాగర్ మండలంపై ఎంతో ప్రేమ ఉందని అందుకే దఫేదార్ రాజును జడ్పీ చైర్మన్గా నియమించారని, రెండోసారి కామారెడ్డి జిల్లాకు మొదటి జడ్పీ చైర్పర్సన్గా రాజు సతీమణి దఫేదార్ శోభకు అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. దళితబంధు పథకం పైలెట్ మండలంగా ఎంపిక చేసి 1300 కుటుంబాలకు యూనిట్లు అందజేశారని వెల్లడించారు.
బీజేపీ నేతల అసత్య ప్రచారాలు, అబద్ధపు మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని, బీజేపీ ఆగడాలకు భయపడేది లేదని అన్నారు. అనంతరం గ్రామాల వారీగా సమస్యలు తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులు, ఇంకా చేయాల్సిన పనులపై చర్చించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విఠల్రెడ్డి, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేశ్ గౌడ్, సొసైటీ చైర్మన్లు వాజిద్అలీ, నర్సింహారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ మోహన్రెడ్డి, 14 గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతులు చల్లగా ఉండాలని నిత్యం కోరుకుంటున్నారని ఉమ్మడి జిల్లాల జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు అన్నారు. 70 సంవత్సరాల పాటు ఎందరో నాయకులు, ఎన్నో పార్టీలు పాలించాయని వారితో రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నివర్గాల ప్రజలను సంతోషంగా ఉంచేలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. రానున్న ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి సీఎం కేసీఆర్ను మరోసారి గెలిపించాలని కోరారు.