మద్నూర్, ఏప్రిల్ 4: తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మన పక్క రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో ఎందుకు ఇస్తలేరో బీజేపీ నాయకులను ప్రశ్నించాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలకేంద్రంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో జుక్కల్ నియోజకవర్గాన్ని అప్పటి పాలకులు ఏనాడూ పట్టించుకోలేదని గుర్తుచేశారు. ప్రజల చెంతకు పాలనను తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా డోంగ్లిని కొత్త మండలంగా ఏర్పాటు చేసిందన్నారు. గతంలో ఇక్కడి ప్రజలు అన్ని పనుల కోసం మద్నూర్కు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు మండల కార్యాలయాలన్నీ డోంగ్లిలోనే ఏర్పాటయ్యాయని తెలిపారు.
తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. మండలంలోని ఇలేగావ్, వాడి గ్రామాలకు బీటీ రోడ్లు వేయాల్సిఉందని, త్వరలోనే వాటికి ప్రభుత్వం మంజూరు ఇవ్వనుందని తెలిపారు. మద్నూర్కు డిగ్రీ, డోంగ్లికి జూనియర్ కళాశాలలు మంజూరవుతాయని చెప్పారు. గత ప్రభుత్వాలు, ఇప్పుడు సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఉన్న తేడాను వివరిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ను రాబోయే ఎన్నికల్లోనూ ఆశీర్వదించాలని కోరారు.
సైనికుల్లా పనిచేయాలి..
కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని షిండే భరోసా ఇచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసిమెలిసి సైనికుల్లా పనిచేయాలని కోరారు. ప్రతి గడపకూ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించాలన్నారు. ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా తిప్పి కొట్టాలన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..
డోంగ్లి మండలంలోని పలువురికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే షిండే పంపిణీ చేశారు. స్థానిక తహసీల్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 31 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీబాయి, జడ్పీటీసీ అనిత, డీసీసీబీ డైరెక్టర్ రాంపటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శశాంక్పటేల్, సర్పంచ్ మాధవి, ఎంపీటీసీ దీన్దయాళ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ దిగంబర్రావు, వైస్ ఎంపీపీ జైపాల్రెడ్డి, నాయకులు బాబూపటేల్, అశోక్పటేల్, మోయిన్పటేల్ తదిరులు పాల్గొన్నారు.
మహారాష్ట్రలో ఇలాంటి పథకాలు లేవు
మన సీఎం కేసీఆర్ ఇస్తున్న సంక్షేమ పథకాలు పక్కనే ఉన్న మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. వెనుకబడి ఉన్న జుక్కల్ నియోజకవర్గానికి తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంతగా నిధులిచ్చింది. రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నది.
– శశాంక్పటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, డోంగ్లి
కేసీఆర్ ప్రధాని కావాలి..
అభివృద్ధి, సంక్షేమంలో మన రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నది. ఇది సీఎం కేసీఆర్ కృషి, దూరదృష్టితోనే సాధ్యమైంది. ఇలాంటి నాయకుడు దేశానికి ప్రధాని అయితే అన్ని రాష్ర్టాల ప్రజలకు మనలాగే సంక్షేమ పథకాలు అందుతాయి. దేశం కూడా బాగుపడుతుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది.
– రామ్పటేల్, డీసీసీబీ డైరెక్టర్