ఖలీల్వాడి, జూన్13: కాంగ్రెస్ ప్రభుత్వం కాసుల కోసం జేసీబీని, ప్రత్యర్థులను అణచివేసేందుకు కేసుల కోసం ఏసీబీని ప్రయోగిస్తున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆరోపించారు. కుట్రపూరితంగా కేటీఆర్కు ఏసీబీ ద్వారా నోటీసులు జారీ చేయించి కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షసానందం పొందుతున్నదని ఓ ప్రకటనలో మండిపడ్డారు. అసలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే అంతులేని అవినీతిపరుడని ఆరోపించారు. ’కాంగ్రెస్ అంటేనే ఫాదర్ ఆఫ్ కరప్షన్ అని, ఏఐసీసీ అంటే అల్ ఇండియా ‘కరప్షన్” సెంటర్, పీసీసీ అంటే ప్రదేశ్ ‘కరప్షన్” సెంటర్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చరిత్రంతా ఏ టూ జడ్ స్కామ్లేనని గుర్తు చేశారు.
నేషనల్ హెరాల్ పేరుతో రేవంత్రెడ్డి బుక్కిందెంత? హైడ్రా పేరుతో మెక్కిందెంత? అని నిప్పులు చెరిగారు. ఎలాంటి అవినీతి జరగని కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ వేశారని, విచారణ పేరుతో కేసీఆర్ను పేరుతో వేధిస్తున్నారని జీవన్రెడ్డి మండిపడ్డారు. ఈ-ఫార్ములా కారు రేసింగ్లోనూ తప్పు జరిగినట్టు ఆధారాలు లేకున్నా ప్రజల పక్షాన పోరాడకుండా అడ్డుకోవాలనన్న దుష్టతలంపుతో ఏసీబీ చేత కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. స్కామ్లు, పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే కేటీఆర్కు నోటీసులు జారీ చేశారని తెలిపారు. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని జీవన్ రెడ్డి హెచ్చరించారు.