బోధన్, డిసెంబర్ 17: బోధన్ మండలం తగ్గెల్లి గ్రామంలోని తన రైస్మిల్లుల్లో సీఎంఆర్కు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరుగలేదని స్థానిక మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ స్పష్టం చేశారు. రాజకీయ కక్షతోనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎంఆర్ కింద ప్రభుత్వం కేటాయించిన ధాన్యం లెక్కల్లో అక్రమాలు జరిగాయంటూ కుట్రపూరితంగా కొన్ని టీవీ ఛానళ్లు, పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో సెల్ఫోన్లో మాట్లాడారు. తన రైస్మిల్లుల్లో ఎలాంటి అక్రమాలు జరుగలేదని, ఈ విషయమై గతంలో కొందరు ఆరోపణలు చేయగా పౌరసరఫరాలశాఖ క్లీన్చిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. తన రెండు రైస్మిల్లులకు కస్టమ్ మిల్లింగ్ ధాన్యం తీసుకోలేదని, అలాంటప్పుడు అక్రమాలకు అవకాశం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ప్రజల్లో తనకున్న ఆదరణను చూసి కొందరు కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ప్రస్తుతం కూడా తన రైస్మిల్లులకు కస్టమ్ మిల్లింగ్ ధాన్యం కేటాయింపు జరుగలేదని, కిలో బియ్యం కూడా దుర్వినియోగం కాలేదని షకీల్ స్పష్టం చేశారు.
ఒకవేళ తన రైస్మిల్లుల్లో ఏవైనా అక్రమాలు జరిగితే పౌరసరఫరాలశాఖ అధికారులు నోటీసులు ఇస్తారు కదా అని ప్రశ్నించారు. ఎలాంటి తప్పు జరుగనందునే ఒక్క నోటీసు కూడా రాలేదని షకీల్ తెలిపారు. తన రైస్మిల్లులపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని తానే అధికార యంత్రాగాన్ని గతంలో డిమాండ్ చేశానన్నారు. దీంతో జిల్లా అధికారులు విచారణ చేపట్టి తనకు క్లీన్చిట్ ఇచ్చారన్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కూడా తనవద్ద ఉన్నాయన్నాని తెలిపారు. తన రైస్మిల్లుల్లో ఒక్క గింజ కూడా సీఎంఆర్ లేదంటూ అధికారులు ‘ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్’ ఇచ్చారని వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు ఉన్నప్పటికీ తనను ఎవరూ ఇబ్బంది పెట్టలేదని ఈ సందర్భంగా షకీల్ అన్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా బతికే కొంతమంది తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
తన రైస్మిల్లులకు సంబంధించి తప్పుడు ప్రచారం చేసిన టీవీ ఛానళ్లు, పత్రికలపై పరువునష్టం దావా వేస్తానని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ హెచ్చరించారు. సోమవారం నోటీసులను పంపుతామన్నారు. అసత్య ప్రచారాలు చేసే వ్యక్తులను కూడా తాను వదలబోనని షకీల్ తెలిపారు.