ఖలీల్వాడి, డిసెంబర్ 11: ఇందూరు.. రియల్ రంగంలో దూసుకెళ్తున్నది. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరం కూడా విస్తరిస్తోంది. దీంతో నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతున్నది. ఓ వైపు వెంచర్లలో ఖాళీ స్థలాలు, మరోవైపు అపార్ట్మెంట్లలో నివాస గృహాలు, వ్యక్తిగత గృహ సముదాయాల నిర్మాణం జోరుగా కొనసాగుతున్నది.దశాబ్ద కాలంలో ఇందూరు నగరం నలుదిశలా విస్తరించడంతోపాటు రాకెట్ వేగంతో పయనిస్తోంది. నిజామాబాద్ నగరమంటే మొన్నటి వరకు మూడు, నాలుగు ప్రాంతాలు మాత్రమే గుర్తుకు వచ్చేది. ఇప్పుడు స్తిరాస్థి రంగం వృద్ధితో అనేక చోట్ల డిమాండ్ భారీగా పెరిగింది. తద్వారా ఎటు చూసినా నిర్మాణ రంగం అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతోంది.
ముబారక్ నగర్ నుంచి మొదలు వినాయక్ నగర్ వరకు ఆకాశాన్ని తాకే బంగళాలు, బంజారాహిల్స్ను తలదన్నే రీతిలో భవంతులు మైమరిపిస్తున్నాయి. నిజామాబాద్ రియల్ రంగం జోరు వెనుక రాష్ట్ర ప్రభుత్వం చొరవ కూడా ఉంది. నిర్మాణాలకు గతంలో పురపాలక శాఖ అనుమతుల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకునేవి. ఇప్పుడు పారదర్శకతతో ఇదంతా తగ్గుముఖం పట్టింది. నగరం నలువైపులా విస్తరిస్తుండడంతో ఎటు చూసినా అభివృద్ధి కనిపిస్తున్నది. జిల్లా కేంద్రానికి వచ్చే ఏ దారిలో చూసినా జోష్ కొనసాగుతున్నది. జిల్లా యంత్రాంగం చేపట్టిన టౌన్ వెంచర్లకు వచ్చిన ఆదరణ చూస్తే రియల్ రంగం ఎంతలా పుంజుకున్నదో అర్థమవుతుంది.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో రియల్ వ్యాపారానికి భారీగానే డిమాండ్ ఉన్నది. నగర శివార్లతో పాటు (నుడా) పరిధిలోని గ్రామాల్లోనూ ఏర్పాటు చేస్తున్న వెంచర్ల వైపు ప్రజలు ఆసక్తి చూపుతుండడం విశేషం. ఇటీవల కాలంలో పెద్దసంఖ్యలో వెంచర్లు ఏర్పాటవుతున్నాయి. ఇక్కడున్న డిమాండ్ను చూసి జిల్లాలోని రియల్ వ్యాపారులతోపాటు హైదరాబాద్కు చెందిన పలు కార్పొరేట్ సంస్థలు కూడా నగరశివారుల్లో నూతన వెంచర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్, ఆర్మూర్ రోడ్డుతోపాటు నగరానికి ఆనుకొని ఉన్న డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ ఉండడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని నలుమూలలా రేట్లు పెరిగిపోయాయి.
కేంద్ర ప్రభుత్వం 2019లో దేశవ్యాప్తంగా పట్టణ, నగరాల్లో జీవన ప్రమాణాల సూచిక సర్వే నిర్వహించింది. పాలనా వ్యవహారం, పౌరులకు అందుతున్న సేవలు, ప్రజల గుర్తింపు, వారి జీవన విధానాలు, సంస్కృతులు, విద్యావిధానం, వైద్యం, పరిశుభ్రత, పారిశుధ్యం, భద్రత, రక్షణ, ఉద్యోగకల్పన, నివాస స్థితిగతులు, విద్యుత్ సరఫరా, ట్రాన్స్పోర్ట్, వృథా నీటి వినియోగం, కాలుష్య నివారణ ఇలా 79 అంశాలను పరిగణలోకి తీసుకున్నది. అదే ఏడాది ఆగస్టులో సర్వే వివరాలను ప్రకటించగా అందులో నిజామాబాద్ సత్తా చాటడం గమనార్హం.
పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు తీసుకురాగా, ఇందుకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. నూతన కలెక్టరేట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా.. ఐటీ టవర్లో త్వరలో పలు కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఇందూరు నగరంలోని మినీ ట్యాంక్ బండ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రఘునాథ ఆలయ చెరువు మినీ ట్యాంకు బండ్ పూర్తయ్యింది. మాధవనగర్ వద్ద ఆర్వోబీ పనులు ప్రారంభం కావడంతో పరిసర ప్రాంతాల భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నగరంలో ఇప్పటికే ఆర్యూబీ పనులు పూర్తికావడంతో విజయ్ థియేటర్ వద్ద వాహనాల రాకపోకలు మొదలయ్యాయి.
నగరంలో ఎటు చూసినా పచ్చదనం దర్శనిమిస్తోంది. నగరం చుట్టూ సెంటర్ మిడియన్లు, మధ్యలో హరితహారం మొక్కలు కనువిందు చేస్తున్నాయి. మాధవనగర్ నుంచి నిజామాబాద్, దాస్నగర్నుంచి నిజామాబాద్, అర్సపల్లి నుంచి నిజామాబాద్ రోడ్లు అద్దంలా మారాయి. ఎల్ఈడీ లైట్స్, పచ్చదనంతో ప్రజలకు ఆహ్లాద వాతావరణం నెలకొన్నది.
అపార్ట్మెంట్స్ , వెంచర్స్లో నగరం దినదినాభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ తరహాలో ఎక్కువగా అపార్ట్మెంట్స్ దర్శనమిస్తున్నాయి. అశోక టవర్స్, అవనీ ఇందూరీ టౌన్షిఫ్ , అటల్ గ్రూప్స్ , లవకుశ అపార్ట్మెంట్స్, శతమానం, రాజా అవతార్, అమ్మవెంచర్, జీవని బిల్డర్స్, గండ్రారివర్ ఎర్జ్, మహదేవ్ డెవలపర్స్తోపాటు హైదరాబాద్ నుంచి ఓం శ్రీ గెలాక్సీ, మంగత్రీ, అపర్ణ, మోదీ ప్రాపర్ట్సీ, సన్యుగ తదితర సంస్థలు నిర్మాణ రంగంలో ఉన్నాయి.
నగరంలో అపార్ట్మెంట్లు మెట్రో సిటీని తలదన్నేలా నిర్మాణాలు జరుగుతున్నాయి.ఇందూరు రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నది. అపార్ట్మెంట్లు సామాన్యుడికి అందుబాటు ధరలో దొరుకుతున్నాయి. జీఎస్టీతో కొద్దిమేర ధరలు పెరిగాయి. కార్పొరేషన్ పరిధిలో లే అవుట్ అనుమతితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీప్లస్ అపార్ట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లాతోపాటు హైదారాబాద్ వ్యాపారులు, ఎన్ఆర్ఐలు సైతం రియల్పై ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.
-ఎం.తిరుపతిరెడ్డి, నిజామాబాద్ క్రెడాయ్ అధ్యక్షుడు