Indiramma House | కామారెడ్డి : ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని నమ్మబలికి, దానికి ప్రతిఫలంగా తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళను వేధించిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు రాజంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం రాజంపేట మండల కేంద్రం చెందిన ఒక మహిళకు ఇందిరమ్మ ఇండ్లు కావాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన సదరు నాయకుడిని సంప్రదించింది. అయితే ఇల్లు మంజూరు చేయాలంటే తన కోరిక తీర్చాలని, తనకు లొంగిపోవాలని అతడు ఆమెను తీవ్రంగా వేధించడం ప్రారంభించాడు. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు చివరికి రాజంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి రాతపూర్వక ఫిర్యాదు మేరకు సదరు కాంగ్రెస్ నాయకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశాం
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మహిళపై అసభ్యంగా ప్రవర్తించినందుకు, పలువురిని డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణ రావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన బెస్ట్ చంద్రంను పార్టీ అధిష్టానం మేరకు వాటి నుండి సస్పెండ్ చేశామని రాజంపేట మండల అధ్యక్షుడు కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.