జీవకోటి మనుగడకు అడవులే ప్రధానం. చెట్లు అంతరించిపోతే పర్యావరణ సమతుల్యత లోపిస్తుంది. కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అనేకచోట్ల మానవ తప్పిదాలే అడవులకు శాపాలుగా మారుతున్నాయి. మంటలతో చెట్లన్నీ బుగ్గిపాలవుతున్నాయి. ప్రస్తుతం ఆకురాలే కాలంలో ఇలాంటి ప్రమాదాలు మరింత ఎక్కువయ్యాయి. దట్టంగా పెరిగిన అడవులు బూడిదగా మారుతున్నాయి.
-వినాయక్నగర్, ఏప్రిల్ 12
ఏటా ఎండాకాలంలో అడవుల్లో మంటలు చెలరేగడం చూస్తుంటాం. కొన్నిఘటనల్లో చెట్ల కొమ్మల రాపిడితో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటే.. ఎక్కువశాతం మానవ తప్పిదాలే కార్చిచ్చుకు కారణంగా తెలుస్తున్నది. అడవుల గుండా రహదారుల వెంబడి వెళ్లేవారు బీడీలు, సిగరెట్లను నిర్లక్ష్యంగా పడేయడంతో ఎండుటాకులకు నిప్పంటుకొని మంటలు వ్యాపిస్తున్నాయి. మరోవైపు బొగ్గు, తూనికాకు సేకరించేవారు కూడా అడవులకు నిప్పంటించిన ఘటలను విచారణలో వెలుగు చూశాయి.
గతంలో తమిళనాడు రాష్ట్రంలోని పశ్చిమ కనుమల అడవుల్లో చెలరేగిన మంటల కారణంగా విలువైన సంపదతోపాటు పదిమంది అగ్నికి ఆహుతయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అటవీశాఖ మరింత అప్రమత్తమైంది. అడవులను దహించే కార్చిచ్చును ఎప్పటికప్పుడు ఆర్పేయడానికి ముందస్తు ప్రణాళికను సిద్ధంచేసింది. ఇందులో భాగంగా ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీని నియమించింది. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రివెన్షన్, డిటెన్షన్, పోస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ విధానలపై క్షేత్రస్థాయి సిబ్బందికి నిర్ధిష్టమైన సూచనలు చేసింది.
నిజామాబాద్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని మల్లారం అటవీ ప్రాంతంలో మార్చి 28వ తేదీన మంటలు చెలరేగి కొంత ఏరియా పూర్తిగా దగ్ధమైంది. మంటలను గుర్తించిన స్థానికులు ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మారావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక శాఖ సహకారంతో మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గుర్తు తెలియని పశువుల కాపరులు నిప్పంటించడంతోనే ఈ మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానం వ్యక్తంచేశారు.
తూనికాకు సేకరించేవారి కారణంగా అడవులు తగలబడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. వీటిని నివారించేందుకు అటవీశాఖ ప్రత్యేక చొరవతో తూనికాకు పెరుగుదలకు సహకరిస్తున్నది. ఇందుకోసం ఫైర్లైన్స్ చేపడుతున్నారు. ఎండుటాకులను పోగుచేసి చుట్టుపక్కల మంటలు వ్యాపించకుండా దగ్గరుండి నిప్పంటిస్తున్నారు. దీనిద్వారా ప్రమాదాలను అదుపుచేయొచ్చని భావిస్తున్నారు.
మానవ తప్పిదాల కారణంగా అడవులో అగ్ని ప్రమాదాలు జరగుతున్నట్లు గుర్తించాం. అటవీ సంసదకు తీవ్ర నష్ణం జరుగుతున్నది. ఫారెస్టు అధికారుల అనుమతి లేకుం డా అడవుల్లోకి వెళ్తే కేసులు నమోదు చేసి, చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
అడవుల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగి నియంత్రిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫైర్ బ్లోవర్స్ ఏర్పాటుచేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 10 బ్లోవర్స్ అందుబాటులో ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్ ఫారెస్టు డివిజన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో 40 మందితో కూడిన స్ట్రయికింగ్ ఫోర్స్ను అందుబాటులో ఉంచిన్నట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్ డివిజన్లో నిజామాబాద్ నార్త్ రేంజ్, నిజామాబాద్ సౌత్ రేంజ్, ఇందల్వాయి, వర్ని రేంజ్తోపాటు ఆర్మూర్ డివిజన్లోని కమ్మర్పల్లి రేంజ్, ఆర్మూర్, సిరికొండ రేంజ్ పరిధిలో ప్రత్యేక ఫోర్స్ను అందుబాటులో ఉంచారు. అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిన సమాచారం అందిన వెంటనే మంటలను ఆర్పేందుకు ఈ ర్యాపిడ్యాక్షన్ ఫోర్స్ సిద్ధంగా ఉంటుంది. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన రక్షణ సిబ్బందికి ఎస్ఎంఎస్ అలర్ట్ వెళ్తుంది. దీని ద్వారా ప్రమాదం జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఉన్న సిబ్బంది జీపీఎస్ ద్వారా ఘటనా స్థలానికి చేరుకుంటారు. అగ్నిప్రమాదాలకు కారణమైన వారికి ఆరునెలల జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు.