నందిపేట్, సెప్టెంబర్ 23 : రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. మండలంలోని సిద్దాపూర్, వన్నెల్ (కే) గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సిద్దాపూర్లో ఆయా కుల సంఘాల భవనాలు, సీసీ రోడ్లు, మారంపల్లి మగ్గిడి వయా వన్నెల్ (కే) మీదుగా రోడ్డు, సిద్దాపూర్ -అమ్దాపూర్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వన్నెల్ (కే) గ్రామంలో రూ. 51 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. పలు వాడల్లో తిరుగుతూ గ్రామస్తులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకొన్నారు.అనంతరం బైక్ర్యాలీ నిర్వహించగా.. ఎమ్మెల్యే బైక్ నడుపుతూ వన్నెల్ (కే) వరకు వెళ్లారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రాష్ట్రం దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలుస్తోందన్నారు. రైతులకు ఏ ప్రభుత్వం అందించని పథకాలను అందించి ఆర్థికంగా తోడ్పాటున్న అందిస్తున్నదని తెలిపారు. పేద బడుగు, బలహీన వర్గాల కోసం కొత్త పథకాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూర్చి వారి కష్టాలను దూరం చేస్తున్నామన్నారు. అనారోగ్యంతో ఉన్న వారికి ఎల్వోసీలు, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు.గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమం తో నియోజకవర్గ ప్రజలు ఎంతో సంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఎన్నో దశాబ్దాల నుంచి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తిచేసి చూపించామన్నారు. కార్యక్రమంలో డీపీవో జయసుధ, ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి, సర్పంచులు తొంటి లక్ష్మి, కాటిపల్లి లలిత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, సొసైటీ చైర్మన్ కార్తిక్ రెడ్డి, నాయకలు ఎర్రం ముత్యం, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.