గొర్రెల పంపిణీ పథకం మొదటి విడుత సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత పంపిణీకి సిద్ధమవుతున్నది. తొలి విడుతలో మేలురకం గొర్రెలను ఇవ్వడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటుండడంతో జీవాల సంపద గణనీయంగా పెరిగింది. అలాగే, గొల్ల, కురుమలు ఆర్థిక పరిపుష్టి సాధించారు. తొలి విడుత సక్సెస్ కావడంతో రెండో విడుత పంపిణీకి యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నిజామాబాద్ జిల్లాలో 8,386 యూనిట్ల్లు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ కృషితో కుల వృత్తులకు పూర్వ వైభవం వచ్చింది. గతంలో జిల్లాలో 80 ప్రాథమిక గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘాలు మాత్రమే ఉండగా, కేసీఆర్ సర్కారు ప్రోత్సాహంతో సంఘాల సంఖ్య ఇప్పుడు 329కి చేరింది.
బోధన్, ఏప్రిల్ 21 : గ్రామాలు స్వయం ఆర్థిక పరిపుష్టిని సాధించాలన్న లక్ష్యంతో కులవృత్తులను ప్రో త్సహించడంలో భాగంగా గొల్ల, కురుమలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న చర్య లు జిల్లాలో సత్ఫలితాలు ఇచ్చా యి. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు గొర్రెలు, మేకల సంపద వృద్ధి కోసం నాటి పాలకులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా, వాటి పెంపకందారుల సహకార సంఘాలను సైతం నిర్వీర్యం చేశారు. తెలంగాణ ఆవిర్భా వం అనంతరం గ్రామాలు స్వయం ఆర్థిక పరిపుష్టి సాధించే దిశగా గొర్రెలు, మేకల సంపద వృద్ధి అవసరమని సీఎం కేసీఆర్ భావించారు. గొల్ల, కుర్మలకు పెద్ద ఎత్తున గొర్రెలను పంపిణీ చేసి వారి కులవృత్తిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. 2017లో ఇందుకోసం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశా రు. జిల్లాలో మొత్తం 19,106 యూనిట్ల గొర్రెలను పెంపకందారులకు రెండు విడుతల్లో ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో మొదటి విడతలో 10,720 గొర్రెల యూనిట్లను 2017 జూన్ నుంచి పంపిణీ చేయడం ప్రారంభించి, వందశాతం లక్ష్యాన్ని సాధించారు. మేలురకం గొర్రెలను పంపిణీచేయడంతోపాటు వాటికి దాణా సరఫరా చేయడం, వైద్య చికిత్సను అందుబాటులోకి తీసుకురావడంతో గొర్రెలు, మేకల సంపద జిల్లాలో గణనీ యంగా పెరిగింది. గొర్రెల పెంపకంతో గొల్ల, కుర్మ కుటుంబాల ఆదాయం పెరిగింది. 2017లో తమకు ఇచ్చిన గొర్రెల సంఖ్య రెండు రెట్లు పెరిగిందని గొర్రెల పెంపకందారులు సంతోషపడుతున్నా రు. దీంతో వారి కుటుంబ ఆదాయం గణనీయం గా పెరిగింది. ఒక అంచనా ప్రకారం జిల్లాలో ఇప్పుడు 9 లక్షల గొర్రెలు, లక్షా 50 వేల మేకలు ఉన్నాయి. ప్రస్తుతం రెండో విడుత గొర్రెల యూ నిట్ల పంపిణీని రా్రష్ట్ర ప్రభుత్వం చేపట్టడంతో రాబోయే కాలంలో జిల్లాలో ఈ జీవాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
గొర్రెల కొనుగోలు పథకం కింద అర్హులైన లబ్దిదారులను ఎంపికచేసి గొర్రెల యూనిట్ల పంపిణీకి జిల్లా పశుసంవర్థకశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మేలుజాతి గొర్రెలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయమై పరిశీలన జరుపుతున్నారు. ఇప్పటికే కొంతమంది పశువైద్యుల బృందాలను ఇందుకోసం కర్ణాటక రాష్ట్రం రాయచూర్, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలకు పంపించారు. మరోపక్క లబ్ధిదారులను ఎంపిక చేసే కార్యక్రమా న్ని చేపట్టారు. రెండో విడుతలో 8,386 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటికే 1143 మంది గొర్రెల పెంపకందారులు తమ వాటా సొమ్ముకింద డీడీలు తీసి పశుసంవర్థకశాఖకు సమర్పించారు. మిగిలిన లబ్ధి దారులు కూడా తమ వాటా సొమ్ము చెల్లించినట్లయితే.. అందుకు అనుగుణంగా గొర్రెలను కొనుగోలు చేసి జిల్లాకు తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో యూనిట్ కింద లక్షా 75 వేల రూపాయల విలువచేసే గొర్రెలను ఇస్తారు. లబ్ధిదారుడు తన వాటా కింద 25 శాతం మొత్తాన్ని.. అంటే రూ.43,500 డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 75 శాతం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
రాష్ట్రం ఆవిర్భావం అనంతరం జిల్లాలో గొర్రెలు, మేకల ప్రాథమిక సహకార సంఘాలను బలోపే తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకున్న ది. 1994 నుంచి సుమారు 20 సంవత్సరాల పా టు ప్రాథమిక మేకల, గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలకు ఎన్నికలే జరగలేదు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2014లో ఎన్నికలు జరిగాయి.అప్పటివరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లో కేవలం 80 సంఘాలు మాత్రమే ఉండేవి. 2014లో ఆ సంఘాల సంఖ్య 223కు పెరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహం, గొర్రెలు, మేకల సంపద అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో జిల్లాలో ఆ తర్వాత మరిన్ని సహకార సంఘాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం జిల్లాలో 329 ప్రాథమిక గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘాలు గ్రామాల్లో ఉన్నాయి.ఈ సంఘా ల్లో సుమారు 20 వేల మంది సభ్యులు ఉన్నారు.
రెండో విడుత గొర్రెల కొనుగోలు పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసి గొర్రెల యూనిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేశాం. ఇప్పటి వరకు 1143 మంది తమ వాటా సొమ్మును చెల్లించారు. లబ్దిదారుల ఎంపికకు గ్రామాల్లో తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నాం. మరోపక్క మా శాఖ వైద్యులు మేలైన గొర్రెల ఎంపిక కోసం రాయచూర్, అనంతపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లారు.
-డాక్టర్ వి.జగన్నాథాచారి, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి
సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకం గొల్లకుర్మల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కొత్తగా అనేక పెంపకందారుల సంఘాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలకు కలిగిన సంతానంతో గొర్రెల సంఖ్య బాగా పెరిగింది. అప్పట్ల ప్రభుత్వాలు గొల్ల, కుర్మల వృత్తిని పట్టించుకోలేదు. ఇప్పుడు గవర్నమెంట్ గొర్రెలు కొని ఇస్తుండడంతో మళ్లీ వీటి పెంపకం మీద ఆసక్తి పెరిగింది.
-గోరంచె వీరయ్య, మాజీ అధ్యక్షుడు
ప్రాథమిక గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం, బోధన్
గొర్రెల పంపిణీ పథకం కింద పెద్ద ఎత్తున గొర్రెల యూనిట్లను పంపిణీ చేయడంతో పాటు వాటి సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. గ్రామాల్లో గొల్ల,కుర్మలు ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నారు. త్వరలో గొల్ల, కుర్మలు తాము నమ్ముకున్న కులవృత్తితోనే సంపదపరులు కావచ్చన్న నమ్మకం ఏర్పడింది.
– సింగం బాగారెడ్డి యాదవ్, యాదవ సంఘం నాయకుడు, బోధన్