నిజామాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లాలో టన్నుల కొద్దీ దొడ్డు బియ్యం నిల్వలు బయట పడుతూనే ఉన్నాయి. అధికారుల తనిఖీల్లో గుట్టు రట్టు అవుతుండడంతో అంతా అవాక్కవుతున్నారు. రెండు రోజుల క్రితం వేల్పూర్లోని ఓ రైస్మిల్లులో వెలుగు చూసిన ఉదంతంతో అందరూ నోళ్లెల్లబెట్టాల్సి వస్తున్నది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 120 మెట్రిక్ టన్నులు(లక్షా 20వేల కిలోలు) మేర అక్రమ బియ్యం నిల్వలు గుర్తించడం రికార్డుగా మారింది. ఇంత భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు ఏ విధంగా సేకరించారన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మిగులుతున్నది. లోతుగా ఈ వ్యవహారాన్ని శోధిస్తే భారీ నెట్వర్క్ వేళ్లూనుకొని ఉంటుందని అంతా భావిస్తున్నారు. ప్రధానంగా రైస్మిల్లులోనే బియ్యం నిల్వలు పట్టుబటడంతో సీఎంఆర్కు లింక్ ఉన్నట్లుగా అర్థమవుతున్నది.
ప్రతినెలా రెండో వారంలోనే గ్రామాల్లోకి బియ్యం కొనుగోలుదారులు ప్రవేశిస్తున్నారు. ఆటోల్లో తిరుగుతూ కిలోకు రూ.10 వరకు చెల్లించి అందినకాడికి తీసేసుకుంటున్నారు. బహిరంగంగానే ఇదంతా జరుగుతున్నప్పటికీ స్థానిక పోలీసులు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ పట్టింపు లేకుండా వ్యవహరించడం ఇందులోని అసలు విషయం. సామాన్యుల నుంచి రూ.10కి సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని రెట్టింపు ధరలకు మిల్లర్లకు అందిస్తున్నారు.
వేల్పూర్లో రైస్మిల్ వ్యవహారంలో బోధన్కు చెందిన ఓ వ్యాపారి హస్తం ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఇతడికి బోధన్ నియోజకవర్గంతోపాటు సరిహద్దులో మహారాష్ట్రలోనూ లీజుకు, సొంతంగా రైస్మిల్లులు, గోదాములు ఉన్నట్లు సమాచారం. తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ తదితర ప్రాంతాల నుంచి సేకరించిన బియ్యాన్ని ఆయా గోదాముల్లో నిల్వచేసి సీఎంఆర్ సమయంలో ఇవే బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లుగా తెలుస్తున్నది. రైస్మిల్ యంత్రాలను నడిపించకుండానే, కరెంట్ మీటరు గిరగిరా తిరగకుండానే కూర్చున్న చోటే సీఎంఆర్ పూర్తిచేయడం ఇందులోని మర్మంగా కనిపిస్తున్నది. బోధన్ వ్యాపారికి ఈ వ్యవహారంలో సిద్ధహస్తుడిగా పేరున్నది. తనఖా పడుతున్న రైస్మిల్లులను చేజిక్కించుకోవడం, లీజులకు తీసుకోవడంలో దిట్ట. అప్పలపాలై ఇబ్బందులు పడుతున్న రైస్మిల్లర్లను తన వలలో వేసుకొని రైస్మిల్లులను అధికారికంగా మార్పిడి చేసుకోకుండానే దందాను నడుపుతున్నట్లుగా సమాచారం. పీడీఎస్ రైస్ను నిల్వచేస్తే అసలు ఓనర్కే చిక్కులు వస్తాయి. తద్వారా అక్రమ వ్యాపారం చేసే తెర వెనుక ఉన్న కుట్రదారుడు సేఫ్గా ఉండడం ఇందులోని భాగంగా తెలుస్తున్నది. ఇందుకు ప్రభుత్వ యంత్రాంగం సైతం వంత పాడుతున్నట్లుగా అవగతమవుతున్నది.
ఈ వ్యవహారంపై అన్నీ తెలిసినా రైస్మిల్ అసోసియేషన్ మిన్నకుండిపోతుండడం విచిత్రంగా ఉన్నది. అక్రమ వ్యవహారాలను రూపుమాపి మిల్లర్లను సన్మార్గంలో పెట్టాల్సిన సంఘం పెద్దలెవ్వరూ నోరు విప్పకపోగా తెరచాటున పలువురు బడానేతలే పాత్రధారులుగా ఉంటుండడం చర్చనీయాంశం అవుతున్నది. రాజకీయ పార్టీల్లో సభ్యత్వం కలిగిన పలువురు నేతల హస్తం కూడా ఇందులో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. వేల్పూర్లో పట్టుబడిన 120 టన్నుల పీడీఎస్ బియ్యం వ్యవహారంలో లోతైన విచారణ జరుగుతుందా? ఇందులో అసలు దొంగలు చట్టం ముందు దోషులుగా నిలబడతారా? లేదా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది.