కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం 310 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్నారు. సేకరించిన ధాన్యాన్ని తక్షణమే రైస్మిల్లులకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 34,549 మంది రైతుల నుంచి 2,00,612 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రూ.217.71 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు.
కామారెడ్డి, మే 18 (నమస్తే తెలంగాణ): రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లను సజావుగా చేపడుతున్నది. కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 344 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అందులో ఐకేపీకి ఆధ్వర్యంలో 22, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 322 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 310 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈనెల 18 నాటికి జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 11,433 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 1,89,179 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 34,549 మంది రైతుల నుంచి 2,00,612 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీనిలో 1,35,629 మెట్రిక్ టన్నులకు సంబంధించిన ట్యాబ్ఎంట్రీ పూర్తి కాగా.. 1,23,443 మెట్రిక్ టన్నులకు ట్రక్చిట్లను జారీచేశారు. జిల్లాలో 1,15,430 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన రూ.217.71 కోట్లను రైతులకు చెల్లించారు. మొత్తం 413.26 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు.
ప్రభుత్వం అన్ని గ్రామాలు, తండాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రైతులు ధాన్యాన్ని తరలిస్తున్నారు. దళారులను గ్రామాల్లోకి అడుగుపెట్టనీయకుండా.. ప్రభుత్వం అందజేస్తున్న కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోగా, ప్రస్తుతం తీవ్రంగా ఉన్న ఎండల్లో ఆరబెట్టి, వాటిని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ల ద్వారా ఆన్లైన్ చేస్తూ, అధికారులకు రైతులకు అండగా నిలుస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా తాగునీటి వసతి కల్పిస్తున్నారు.
శరవేగంగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్ల అనంతరం లారీల్లో సంచులను ఎప్పటికప్పుడు రైస్మిల్లులకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,85,794 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించారు. గురువారం ఒక్కరోజే 13,760 టన్నుల ధాన్యాన్ని తరలించడం గమనార్హం. కేవలం 14,818 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే రైస్మిల్లులకు తరలించాల్సి ఉంది. ధాన్యం తరలింపులో ఎలాంటి ట్రాన్స్పోర్టు సమస్య లేకుండా సివిల్ సప్లయీస్ జిల్లా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రైస్మిల్లులకు తరలించిన ధాన్యంలో 1,58,453 మెట్రిక్ టన్నుల ధాన్యం అన్లోడ్ అయ్యింది. ఇంకా 27,340 మెట్రిక్ టన్నుల ధాన్యం అన్లోడ్ చేయాల్సి ఉంది. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్షిండే, కలెక్టర్, అదనపు కలెక్టర్తోపాటు పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షిస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేకుండా అదనపు గన్నీ బ్యాగులను సమకూర్చడం గమనార్హం. కొనుగోలు కేంద్రాలకు 50,75,000 గన్నీ బ్యాగులను తరలించగా.. వాటిలో 44,79,718 గన్నీ బ్యాగులు ఉపయోగంలో ఉన్నాయి. గోదాముల్లో ఇంకా 27,96,000 గన్నీ బ్యాగులు నిల్వ ఉన్నాయి. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో 5,92,282 గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయి. గతంలో గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉండేది. కానీ ప్రస్తుతం అదనంగా అందుబాటులో ఉన్నాయి.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపడుతున్నాం. కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల్లో తరలిస్తున్నాం. తరలింపులో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ చేస్తున్నాం. చెల్లింపుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. వారం పది రోజుల్లో చెల్లింపులు పూర్తవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేశాం.
– అభిషేక్ సింగ్,
సివిల్ సప్లయీస్ డీఎం, కామారెడ్డి
ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు. కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయి. నేను దగ్గరుండి కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నాను. గన్నీ సంచుల కొరత లేదు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెనువెంటనే రైస్మిల్లులకు తరలిస్తున్నారు.
– కె.సాగర్గౌడ్, సర్పంచ్, రాఘవాపూర్
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వేగంగా సేకరిస్తున్నారు. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.
– మంద సిద్ధిరాములు,రైతు, రాఘవాపూర్
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో శరవేగంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవు. చెల్లింపులు కూడా సజావుగా సాగుతున్నాయి. రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు.
– ఉగ్లోత్ తుకారాం, ఉప సర్పంచ్, రాఘవాపూర్
పదిరోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు మేం కృంగిపోయాం. కానీ ప్రభుత్వం అండగా ఉండి సర్వే చేయించింది. ధాన్యం కొనుగోళ్లలో తడిసిన ధాన్యంపై ఎలాంటి నిబంధనలు పెట్టకుండా కొనుగోలు చేస్తున్నది. మాకు ఎంతో ధైర్యం వచ్చింది.
– ఆత్మకూరి స్వామి, రాఘవాపూర్