కామారెడ్డి, జనవరి 24: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో జీవనోపాధి కోల్పోయామని, మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వమే తమను ఆదుకొని నెలకు రూ.15వేల జీవనభృతి ఇవ్వాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఆటో యూనియన్ ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో కేంద్రంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 20వేల మంది ఆటోలు నడుపుతున్నారని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆటోల్లో ఎవరూ ప్రయాణించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో తాము ఆటో ఫైనాన్స్లు, ఇంటి కిరాయిలు, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోలేకపోతున్నామని, ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
జిల్లా కేంద్రంలో ఆటోనగర్ కాలనీ ఏర్పాటు చేసి ఆరు ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి జీవో విడుదల చేయాలని, 60శాతం సబ్సిడీతో బ్యాం కు రుణాలు ఇప్పించాలని అన్నా రు. ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.5లక్షలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఆటో డ్రైవర్లకు లేబర్ కార్డులు ఇవ్వాలని,ఆటోబంధు పథకం అమలు చేయాలన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. సీఎస్ఐ గ్రౌండ్లో మొదలైన ర్యాలీ నిజాంసాగర్ చౌరస్తా మీదుగా హైవే రోడ్డు వరకు కొనసాగింది. యూనియన్ జిల్లా అధ్యక్షుడు బోదాస్ నర్సింహులు, ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణ, కోశాధికారి గోల్కొండ రాజయ్య, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.