నిజామాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతరకు తెర లేపింది. వరుసగా నోటిఫికేషన్లను జారీ చేస్తున్నది. ఉద్యోగ ప్రకటనల కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న యువతలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నోటిఫికేషన్లకు అనుగుణంగా సన్నద్ధమవుతున్నది. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా 91 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు ఏడాది కాలంగా వరుసగా ఉద్యోగ ప్రకటనలను విడుదల చేస్తున్నది. గ్రూప్ 1 నుంచి మొదలు పెడితే గ్రూప్ 4 వరకు ఇప్పటికే పలు ప్రకటనలు వెలువడగా, ఇందులో కొన్నింటికీ ప్రవేశ పరీక్ష సైతం ముగిసింది. ఒకటి కాగానే మరొక ఉద్యోగ ప్రకటన వస్తుండడంతో నిరుద్యోగుల్లో సంతోషం కనిపిస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని భావిస్తోన్న అభ్యర్థులంతా లక్ష్యం దిశగా పాటుపడుతున్నారు. నిమిషం సమయాన్ని కూడా వృథా చేయకుండా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. నిరుపేద అభ్యర్థులకు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు చెందిన ప్రజా ప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. పోలీస్ నియామకాల్లో పెద్ద ఎత్తున ఆయా నియోజకవర్గాల్లో శిక్షణ శిబిరాలను నిర్వహించగా, ఇప్పుడు శారీరక దారుఢ్య పరీక్షలకు సైతం ఉచితంగా శిక్షణను ఇప్పిస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరిట రాజకీయాలు చేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. నిరుద్యోగులకు సాయం చేయడంలో ఎక్కడా కనిపించకపోవడం విశేషం.
నిజామాబాద్ వంటి జిల్లాలో దశాబ్దం క్రితం వరకు కోచింగ్ సెంటర్లు ఉండేవి. కాంగ్రెస్ హయాంలో ఇవి మూతబడ్డాయి. అప్పటి పాలకులు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయక కపోవడమే అందుకు కారణం. అయితే, కేసీఆర్ సర్కారు పెద్ద సంఖ్యలో నియామక ప్రకటనలు జారీ చేస్తుండడంతో, మూతబడిన కోచింగ్ సెంటర్లు తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి వంటి జిల్లా కేంద్రాల్లో కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అయితే, వీటిలో మౌలిక సదుపాయాల కొరత ఉండడంతో చాలా మంది హైదరాబాద్ మహానగరానికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. వందలాది కోచింగ్ సెంటర్లతో పాటుగా ప్రిపరేషన్కు అవసరమైన పుస్తకాల లభ్యత కూడా అక్కడ ఉంటుంది. అందుకే హాస్టళ్లలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధం అవ్వడానికి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి చాలా మంది యువత పట్నం బాట పడుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్లలో సీటు దక్కించుకుని, కలల కొలువు కోసం శ్రమిస్తున్నారు. స్తోమత లేని వాళ్లు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్న పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇంకొందరైతే యూట్యూబ్లో అందుబాటులో ఉన్న వీడియా క్లాసుల ఆధారంగా ప్రిపేర్ అవుతుండడం విశేషం.
కొలువుల భర్తీలో తెలంగాణ యువతకు న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇష్టానుసారంగా ఉన్నటువంటి జోనల్ వ్యవస్థను పట్టుబట్టి మార్పులు చేశారు. జోనల్, మల్టీ జోనల్ ఏర్పాటుతో 95శాతం స్థానిక యువతకే ఉద్యోగాలు దక్కేలా ప్రణాళికను రూపొందించి రాష్ట్రపతి ద్వారా ఆమోద ముద్ర వేయించారు. ఫలితంగా శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ యువతకు వారి స్థానికత ఆధారంగానే 95 శాతం ఉద్యోగాలు వాళ్లకే దక్కేటట్లు చేశారు. కేవలం 5శాతం మాత్రమే ఓపెన్ కోటా పెట్టారు. అందులోనూ మనవాళ్లకే 3శాతం ఉద్యోగాలు వస్తాయి. అంటే మొత్తం వందలో 98 శాతం మన ఉద్యోగాలు మనకే దక్కుతాయి. ప్రస్తుతం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 91వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సీరియస్గా అడుగులు వేస్తున్నది. ఆ తర్వాత ప్రతి ఏటా ఖాళీ అయిన ఉద్యోగాలను వెనువెంటనే భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ రూపకల్పనకు కసరత్తు ప్రారంభించింది. ఇలాంటి విధానం దేశంలో యూపీఎస్సీతో పాటు కేరళలో అమలవుతుండగా, తెలంగాణలోనూ అమలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఒక ఏడాది కాలంలో భర్తీ చేసే పోస్టుల వివరాలు, పరీక్షా తేదీలు, పరీక్షల విధానం, సిలబస్ సూచనలు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం సహా మరికొన్ని వివరాలను పొందుపరుస్తారు.
తెలంగాణలో తొలి గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటన వెలువడడంతోపాటు ప్రాథమిక పరీక్ష సైతం ముగిసింది. తుది పరీక్షకు టీఎస్పీఎస్సీ త్వరలోనే తేదీలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నది. అంతకు ముందే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వారి వివరాలను వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నది. ఇంతలోనే ఎస్సై, కానిస్టేబుళ్లకు సంబంధించిన తుది ఫలితాలు సైతం వెలువడనున్నాయి. డిసెంబర్ 8 నుంచి ఫిజికల్ టెస్టులు మొదలు కానున్నాయి. ఇక ఆహార తనిఖీ అధికారులు, పలు శాఖల్లో ఇంజినీర్ పోస్టులకు పరీక్షలు పూర్తవ్వగా, పలు నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను ఇంకా వెల్లడించలేదు. ఇప్పుడు గ్రూప్ 4 భారీ ఉద్యోగ ప్రకటన వెలువడడంతో ఆశావహుల్లో మరింత జోష్ పెరిగింది. ఏకంగా 9,168 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో మరోసారి కాంపిటేటీవ్ యుద్ధానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. వివిధ రంగాల్లో ప్రైవేటు కొలువులు చేస్తున్న వారు సైతం ఈసారి గ్రూప్ 4లో తలపడేందుకు కొద్ది రోజుల పాటు పనికి విరామం ఇచ్చి, పరీక్షలకు సన్నద్ధం కావాలని ఆలోచన చేస్తున్నారు.