నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 21: బాన్సువాడ నియోజకవర్గంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మన్దేవ్ పల్లి గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. రూ.2.88 కోట్లతో ప్రధాన రహదారి, సీసీ రోడ్డు, రూ.60 లక్షలతో నిర్మించిన ఆరు అదనపు తరగతి గదులు, రూ.1.36 కోట్లతో నిర్మించిన 27 డబుల్ బెడ్రూం ఇండ్లు, రూ.33.14 లక్షలతో నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదామును ప్రారంభించారు. అనంతరం రూ.15 లక్షలతో చేపట్టనున్న కుర్మ సంఘం భవనం, బొమ్మన్దేవ్ పల్లి నుంచి హాజీపూర్ గ్రామం వరకు రూ.1.75 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ..దేశంలో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సాయం (రూ.1,00,116 ) అందజేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
బాన్సువాడ నియోజక వర్గంలో 14వేల మందికి రూ.130 కోట్లు అందజేసినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. బలం కోసం న్యూట్రిషన్ కిట్, ప్రసవం అయిన తర్వాత కేసీఆర్ కిట్ అందజేస్తున్నట్లు తెలిపారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నవారి కోసం బాన్సువాడ దవాఖానలో 10 డయాలసిస్ యూనిట్లతో సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గానికి 11వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరైనట్లు చెప్పారు. ఇంకాఎవరైనా సొంతిల్లు లేనిపేదలు ఉంటే వారికి గృహలక్ష్మి పథకం మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల కోసం నియోజక వర్గంలో గురుకులాలను ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. బాన్సువాడలో రూ.40 కోట్లతో నర్సింగ్ కళాశాల భవనం నిర్మిస్తున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించడం తమ బాధ్యత అని, చదివి బాగుపడడం విద్యార్థుల బాధ్యత అని స్పష్టం చేశారు.
ఉమ్మడి పాలనలో గ్రామాల అభివృద్ధికి నిధులు రాక తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లమని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలు కోరిన పనులన్నింటికీ నిధులు మంజూరు చేస్తున్నదని తెలిపారు. దేశంలో 28 మంది ముఖ్యమంత్రులు ఉన్నారని, కానీ కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఎక్కడా అమలుచేయడం లేదన్నారు. మిగతా రాష్ర్టాల్లో పంట ఉత్పత్తులను కొనేదిక్కులేదన్నారు. కానీ మన రాష్ట్రంలో రైతుల పొలాల వద్ద కాంటాలు పెట్టి మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో 57 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇస్తున్నామని, పక్కన ఉన్న మహారాష్ట్రలో 80 ఏండ్లు దాటితేనే పెన్షన్ ఇస్తున్నారని, అదికూడా రూ.1000 మాత్రమే అని చెప్పారు. కర్ణాటకలో రూ. 600, గుజరాత్లో వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. కొంత మంది ప్రతిపక్షాల నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. వారి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ సంక్షేమ పథకాలను అమలు చేసిన తర్వాత మాట్లాడాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ,ఎంపీపీ పాల్త్య విఠల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, జిల్లా కో-ఆప్షన్ మెంబర్ మాజీద్, విండో చైర్మన్లు గంగారాం, మారుతి, సుదీర్, మారుతి, ఎంపీటీసీ నారాయణ రెడ్డి, నాయకులు ప్రతాప్ సింగ్, రవీందర్ రెడ్డి, పవన్గౌడ్, రమేశ్, బాబాగౌడ్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.