వడగండ్ల వాన.. రైతుకు కన్నీళ్లనే మిగిల్చింది. ఉమ్మడి జిల్లాలో సోమ, మంగళవారాల్లో కురిసిన అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కామారెడ్డి జిల్లాలో 31 వేల ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 10 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ తేల్చింది. నష్టపోయిన రైతులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. రైతులకు అండగా ఉంటామని మంత్రి వేముల భరోసా ఇచ్చారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు.
నిజామాబాద్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) / మాక్లూర్:
యాసంగిలో మరోమారు భారీ వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. ఇందూరు అన్నదాతలను తీవ్రంగా కుంగదీసింది. కురిసిన కుండపోత వానలతో నిజామాబాద్ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అతి భారీ వానలకు తోడుగా గాలి దుమారం తీవ్రంగా చేటు చేసింది. దీంతో ఆరుగాలం సాగులో అన్నదాతకు ఆదిలోనే ఆటంకం ఎదురైనట్లుగా మారింది. ఊహించని విపత్తుతో రైతులను కోలుకోకుండా చేసింది. ఏపుగా ఎదిగిన వరి పంట నేలవాలి పూర్తిగా పనికి రాకుండా పోయింది. చాలా చోట్ల వరి గింజలన్నీ నేలరాలి పనికి రాకుండా మారింది. దెబ్బతిన్న పంటలను చూసి కర్షకులు కంటతడి పెడుతున్నారు. వరుసగా ఎదురవుతున్న నష్టాలను తలచుకొని అధికారులు, ప్రజాప్రతినిధుల ఎదుట ఆవేదన వెలిబుచ్చుతున్నారు.
పంట నష్ట పరిహారం ద్వారా రైతులకు సాంత్వన చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నది. సకాలంలో పరిహారం అందివ్వడం ద్వారా కర్షకుడి కన్నీటిని తుడిచేలా వ్యవసాయ శాఖ వ్యవహరిస్తున్నది. పంట నష్టం వాటిల్లిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు రావడం, పంట నష్టాన్ని అంచనా వేయడం, నివేదిక సమర్పించడం వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అనేక చోట్ల అకాల వర్షం తీవ్ర ప్రభావాన్ని చూపింది. నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాలతోపాటు కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో అపార నష్టం వాటిల్లింది. చాలా చోట్ల కోత కోయకముందే వడగండ్ల వానకు వడ్ల గింజలన్నీ నేలరాలిపోయాయి. పొలాల్లో కుప్పలు కుప్పలుగా పడిపోయిన వడ్లను చూసి రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఇదేం కర్మ అనుకుంటూ నెత్తి కొట్టుకుంటూ నిట్టూరుస్తున్నారు.
కంట నిద్దుర లేదు..
కుటుంబం అంతా కలిసి పనిచేసి పిల్లలను సాదినట్లు పంటను సాదుకున్నం. చేతికొచ్చిన పంట బురదలో కొట్టుకు పోతుంటే మనసున పడుతలేదు. గింతటి దుస్థితి ఎన్నడూ సూడలే. కంట నిద్దుర లేదు. తడిసిన వడ్లను ఆరబెట్టుకునుడు రందిగా మారింది. వడ్ల గింజలు కండ్ల ముందే వాన నీటిలో కుప్పలు కుప్పలుగా కొట్టుకుపోయినాయి.
– అరుణ, మహిళా రైతు
నష్టం వివరాలను సేకరిస్తున్నాం
అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వానలు, వడగండ్లతో నిజామాబాద్ జిల్లాలో పెద్దసంఖ్యలో పంట నష్టం వాటిల్లింది. ఇప్పటికే నష్టపోయిన రైతుల వివరాలను సేకరిస్తున్నాం. వ్యవసాయ విస్తరణాధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ రైతులకు ధైర్యం చెబుతున్నారు. రైతుల వివరాల నమోదులో ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకున్నాం. ఎవరికైనా సమస్యలుంటే స్థానిక ఏఈవోలకు ఫిర్యాదు చేస్తే న్యాయం చేకూర్చేలా చర్యలు తీసుకుంటాం.
– తిరుమల ప్రసాద్, నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధికారి
తలచుకుంటే దుఃఖం వస్తున్నది.
మేము 3 ఎకరాల్లో వరి వేసినం. 2 ఎకరాలను కోపిచ్చినాము. మిషిన్కు రూ.30వేల వరకు ఖర్చైంది. తెచ్చిన పంట ఆరబోస్తే వానకు కొట్టుకుపోయింది. వడ్లను బురదలో నుంచి తీసి మళ్లీ ఆరబెట్టుకోవాల్సి వస్తుంది. మిగిలిన ఎకరం భూమిలో వడ్ల గింజలన్నీ నేల రాలినాయి. తలచుకుంటేనే దుఃఖం వస్తున్నది. పొలం వైపు సూడాలంటేనే బాధనిపిస్తుంది. ఏమీ చేయాలో అర్థం కావడం లేదు.
– రాంచందర్, పద్మ దంపతులు
గింత ఘోరం ఎన్నడూ జరగలేదు..
నాకున్న రెండు ఎకరాల్లో వరి పంట కోపిచ్చిన. కొద్దిగా తడి ఉందని ఆరబెడదామని ఇక్కడికి తీసుకువచ్చిన. 24గంటలైతే నా పంట అమ్ముడు పోతుండే. అంతలోనే కురిసిన వానకు నా పంట అంతా నాశనమైంది. పచ్చిగా మారింది. ఎండ సక్కగా కొడితేనే మా ఏమైనా దిక్కుంటది. వానలు ఇట్లనే కొడితే ఈ పంట ఎటూ పనికి రాకుండా పోతదనే భయం ఉన్నది.
– మోతీలాల్, రైతు, మామిడిపల్లి తండా
ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
ధర్పల్లి, ఏప్రిల్ 26: ప్రకృతి వైపరీత్యం కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, అండగా ఉంటామని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ధర్పల్లి మండలంలో అకాల వర్షంతో నష్టపోయిన పంటలను బుధవారం ఆయన పరిశీలించారు. మైలారం, కేశారం, సల్లగరిగె, దుబ్బాక, ధర్పల్లి తదితర గ్రామాల పరిధిలోని పంట నష్టం పరిశీలించి వారికి ధైర్యం చెప్పారు. మైలారం, సల్లగరిగె గ్రామాల్లో వరితోపాటు 267 ఎకరాల్లో దెబ్బతిన్న నువ్వుల పంటను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు కంటతడి పెట్టుకొని ఎమ్మెల్యేకు తమ గోడును వెలిబుచ్చారు. అందరినీ అక్కున చేర్చుకొని ఆవేదన చెందవద్దని, మీకు నేనున్నానని ఆయన ధైర్యం చెప్పి భరోసా కల్పించారు.
రైతుకు అండగా నిలుస్తాం..
ఎమ్మెల్యే జాజల సురేందర్.
లింగంపేట/గాంధారి, ఏప్రిల్ 26: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ భరోసా కల్పించారు. లింగంపేట మండలం ఐలాపూర్, మెంగారం, చింతల్గుట్ట తండా, బోనాల్, జల్దిపల్లి, భవానీపేట, గాంధారి మండలంలోని గండివేట్, గండివేట్ తండా, సీతాయిపల్లి, మేడిపల్లి, చెన్నాపూర్ గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంటను బుధవారం పరిశీలించారు. పంట నష్టంపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. అకాల వర్షంతో జరిగిన నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు. చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉన్నందున రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్కు రైతుల కష్టాలు తెలుసని అన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ అండగా ఉంటామని వెల్లడించారు.
నిజామాబాద్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్లోని ఆర్మూర్, భీమ్గల్, నిజామాబాద్ డివిజన్ పరిధిలోనే పంట నష్టం నమోదు అయ్యింది. ప్రధానంగా వరి, మామిడి, నువ్వులు, జొన్న పంటలపై అకాల వర్షం తీవ్ర ప్రభావం చూపింది. సోమ, మంగళవారాల్లో కురిసిన చెడగొట్టు వానలకు తోడుగా వడగండ్లతో వెలుగు చూసిన పంట నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ సేకరించింది. ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో కలియ తిరుగుతూ స్థానిక రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది సహకారంతో పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరించారు. 10, 460 ఎకరాల్లో వరి, మామిడి, జొన్న, నువ్వుల పంటలు నష్టం సంభవించగా 7,276 మంది రైతులకు ఇబ్బందులు తప్పలేదు. చెడగొట్టు వానలతో జిల్లాలోని 18 మండలాల్లో ప్రభావం చూపింది. ఇందులో 160 గ్రామాల్లో నష్టం వెలుగు చూసింది. సేకరించిన పంట నష్టం వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్కు నివేదిస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన వారందరికీ న్యాయం జరుగుతుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.
పంటల వారీగా ఇలా…
వరి పంట నష్టం 8005 ఎకరాల్లో వాటిల్లింది. దీంతో 5,307 మంది రైతులకు నష్టం జరిగింది. 85 గ్రామాల్లో ప్రభావం చూపింది. నువ్వులు సాగు చేస్తున్న 1411 మంది రైతులకు అకాల వర్షం దెబ్బతీసింది. 46 గ్రామాల్లో 1602 ఎకరాల్లో నువ్వుల పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ పేర్కొన్నది. జొన్న పంటను సైతం అకాల వర్షం వదల్లేదు. 612 ఎకరాల్లో 441 మంది రైతులకు చెందిన జొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. భీమ్గల్ వ్యవసాయ శాఖ డివిజన్ పరిధిలోని ముప్కాల్, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లోని 12 గ్రామాల్లో జొన్న నష్టం గుర్తించారు. కోసేందుకు సిద్ధమైన దశలో ఉన్న మామిడి కాయలు సైతం భారీ వర్షాలకు నేలరాలి రైతులను నిండా ముంచాయి. జిల్లాలో ప్రధానంగా మోపాల్, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో 5 గ్రామాలు, భీమ్గల్ డివిజన్లో 12 గ్రామాలు కలిపి మొత్తం 17 గ్రామాల పరిధిలో మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. 250 ఎకరాల్లోని మామిడి పంట సైతం వడగండ్లతో 117 మంది రైతులకు నష్టాన్ని మిగిల్చింది.
కామారెడ్డిలో 31,242 ఎకరాల్లో నష్టం..
కామారెడ్డి, ఏప్రిల్ 26: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో మంగళవారం కురిసిన అకాల వర్షానికి 31,242 ఎకరాల పంట నష్టపోయిందని జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి వీరస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 17 మండలాలు, 171 గ్రామాల్లో అకాల వర్షానికి వరి 31,128 ఎకరాలు, మక్కజొన్న 10 ఎకరాలు, టమాట 64 ఎకరాలు, మామిడి 40 ఎకరాలు, మొత్తం 31,242 ఎకరాల పంట నష్టపోయిందని వెల్లడించారు.
నివేదికను ప్రభుత్వానికి పంపుతాం..
లింగంపేట/ రాజంపేట్/ బీబీపేట్/ భిక్కనూర్, ఏప్రిల్ 26: వడగండ్ల వర్షంతో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించి వివరాలు సేకరించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. లింగంపేట్, రాజంపేట్, బీబీపేట్, భిక్కనూర్ మండలాల్లో దెబ్బతిన్న పంట పొలాలను బుధవారం పరిశీలించారు. జిల్లాలో లింగంపేట, రాజంపేట మండలాల్లో అత్యధికంగా పంట నష్టం వాటిల్లినట్లు తెలిపారు. పంట నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వానికి పంపుతామని, నష్టపోయిన రైతులకు పరిహారం అందించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినట్లు గుర్తుచేశారు. వ్యవసాయ క్షేత్రంలో పంట నష్టం వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు, కొనుగోలు కేంద్రాల్లో నష్టం వివరాలను సహకార సంఘాల సీఈవోలు సేకరించినట్లు తెలిపారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయాధికారి వీరస్వామి, తహసీల్దార్ చంద్రరాజేశ్, ఏడీఏ రత్నం, ఎంఏవో అనిల్కుమార్, రైతులు ఉన్నారు.