బీర్కూర్, జూన్ 21: సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవంలో స్పీకర్ పాల్గొన్నారు. ముందుగా పోచారం శ్రీనివాసరెడ్డి, శంభురెడ్డి దంపతులు, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి సుదర్శన యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఆధ్యాత్మికతతోనే మనసులోని చెడు ఆలోచనలు పోయి మంచి ఆలోచనలకు ఆజ్యం పోస్తాయన్నారు. మసీదు, గుడి, చర్చి ఏదైనా రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పెద్దపీట వేసి వాటి అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించారన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోనే ఇందు కోసం రూ.150 కోట్లు ఇచ్చారన్నారు. రాజుల కాలంలో మాత్రమే శిల్పాలతో ఆలయాలు నిర్మించే వారని, ఇప్పుడు రూ.1200 కోట్లతో యాదాద్రిని నిర్మించి ప్రపంచం గర్వించదగ్గ ఆలయంగా నిలిపారన్నారు. ఆలయ ధర్మకర్తలమైన తాము తెలంగాణ తిరుమల ఆలయాన్ని, గర్భగుడిని మాత్రమే నిర్మించామని, మా విన్నపం మేరకు ఆలయాన్ని దర్శించుకున్న సీఎం కేసీఆర్ ఆలయాభివృద్ధికి రూ.23 కోట్లు మంజూరు చేశారన్నారు. ప్రతి గ్రామంలో ఆలయ నిర్మాణం వెనుక కేసీఆర్ భక్తిభావం కలగలిపి ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వేతనాలకు నోచుకోని అర్చకులకు స్వరాష్ట్రం సిద్ధించిన ధూపదీప నైవేద్యం కింద మొ దట రూ.4 వేలు, రూ.6 వేలు ఇవ్వగా ఇప్పుడు రూ.10 వేలకు పెంచుతూ ప్రొసీడింగ్ కాపీలను అందించామన్నారు. అర్చకులు సభాపతి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీ ఆకట్టుకున్నది. కార్యక్రమానికి హాజరైన గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీని సభాపతి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, ఎర్వాల కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, తహసీల్దార్ రాజు, ఎంపీడీవో భానుప్రకాశ్, తిమ్మాపూర్ సర్పంచ్ రమారాంబాబు, అప్పారావ్, తిరుమల బ్యాంకు చైర్మన్ చంద్రశేఖర్, నర్సరాజు, గంగారాం, బద్యానాయక్, భక్తులు పాల్గొన్నారు.