ప్రైవేటులో 9 శాతమే సాధారణ కాన్పులు, 91 శాతం కోతలే
సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేలా సర్కారు చర్యలు
కడుపు కోతలు, ఫీజు వాతలకు త్వరలోనే చెక్
పర్యవేక్షణ కోసం ఆడిట్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
సాధారణ కాన్పుచేయిస్తే వైద్యసిబ్బందికి నగదు ప్రోత్సాహకం
పురిటి నొప్పులతో ప్రైవేటు దవాఖానకు వెళ్తే చాలు.. సిజేరియన్ చేసేస్తున్నారు. డబ్బు యావతో ఇష్టారాజ్యంగా కడుపు కోతలకు పాల్పడుతున్నారు. సాధారణ ప్రసవం చేసేందుకు కనీస ప్రయత్నాలే చేయకుండా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. జిల్లాలోని ప్రైవేటు దవాఖానల్లో 91 శాతం సిజేరియన్లు జరుగుతుండగా, తొమ్మిది శాతమే సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కడుపు కోతలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అనవసరంగా చేసే సిజేరియన్లకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ప్రైవేటు దవాఖానల్లో జరిగే అన్ని సిజేరియన్ కేసులను పర్యవేక్షించడంతో పాటు ఆయా దవాఖానలపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రతి జిల్లాకు ఆడిట్ కమిటీని ఏర్పాటు చేసింది. సాధారణ కాన్పులను ప్రోత్సహిస్తూ తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్న ధ్యేయంతో పలు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నది. సర్కారు దవాఖానల్లో నార్మల్ డెలివరీలు చేయిస్తే ఆశ కార్యకర్తల, ఏఎన్ఏంలు, స్టాఫ్ నర్సులు, వైద్య వర్గాలకు రూ.3 వేలు పారితోషికం అందించనున్నది.
“ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరగాలి..
నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరగాలి. ప్రజల ఆరోగ్యం కోసం మార్పు తీసుకువద్దాము. సర్కారు దవాఖానల్లో అన్నీ వసతులు ఉన్నాయని, అన్నీ రకాల వైద్యం అందిస్తున్నట్లు ప్రజలకు తెలియజేసేలా మన సేవలుండాలి. ప్రైవేటు దవాఖానలకు వెళ్తున్న వారికి ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ప్రభుత్వాసుపత్రులకు వచ్చిన వారికి పైసా ఖర్చు లేకపోగా ప్రోత్సాహకాలు అందుతున్నాయి. సర్కారు దవాఖానల్లో నార్మల్ డెలివరీలు చేయిస్తే ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, వైద్య వర్గాలకు రూ.3 వేల పారితోషికం అందిస్తాం.”
– వారం క్రితం వైద్యారోగ్య శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి హరీశ్రావు దిశా నిర్దేశం
నిజామాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సాధారణ కాన్పులను ప్రోత్సహిస్తూ తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్న ధ్యేయంతో రాష్ట్ర ప్రభు త్వం పలు చర్యలు చేపట్టింది. అనవసరంగా చేసే సిజేరియన్లకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. కడుపు కోత(శస్త్ర చికిత్స) చేసే ప్రైవేటు దవాఖా నలపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. మొదటి కాన్పు తప్పకుండా ప్రభుత్వ వైద్యశాలల్లో జరిగేలా వైద్యారోగ్య శాఖ సిబ్బంది కృషి చేయాలని ప్రభు త్వం మార్గదర్శకాలు రెడీ చేస్తున్నది. ఒక వేళ మొద టి కాన్పు ప్రైవేటు దవాఖానలో సిజేరియన్ చేస్తే అందుకు దారి తీసిన కారణాలు వైద్య ఆరోగ్య శాఖ కు చూపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రతి జిల్లాకు ఆడిట్ కమిటీ ఏర్పాటు చేసింది. ప్రైవేటు దవాఖానల్లో జరిగే అన్ని సిజేరియన్ కేసులను సదరు కమిటీ పర్యవేక్షించనున్నది. అవసరం లేకున్నా శస్త్ర చికిత్స చేసినట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. నిజామాబాద్ జిల్లాలో సగటున ఒక నెలలో జరుగుతున్న మొత్తం కాన్పు ల్లో 60శాతం సాధారణ, 40శాతం శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇష్టానుసారంగా ప్రసవాల పేరిట అనవసరంగా కడుపు కోతలకు పాల్పడుతు న్న ఘటనల్లో నిజామాబాద్ జిల్లా ముందు వరుసలో ఉండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది.
పైసల దందా…
నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు వైద్యశాలలకు కాన్పు కోసం వెళ్తే ఇక కడుపు కోతలు తథ్యమనే పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఎడాపెడా శస్త్ర చికిత్స లు చేసేసి బిల్లులు రూపంలో రూ.వేలు దండుకోవడం పనిగా మారింది. ఇందుకోసం చైన్ సిస్టమ్ ను ప్రైవేటు దవాఖానలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో గ్రామాల్లో పని చేసే ఆర్ఎంపీ, పీఎంపీలను మధ్యవర్తులుగా పెట్టుకుంటున్నారు. అంగన్వాడీ, ఆశ కార్యకర్తల సలహాలు, సూచనలతో 9 నెలల వరకు పౌష్టికాహారం అందుకుంటున్న వారు అకస్మాత్తుగా నొప్పులు రాగానే హడావుడిగా ప్రైవేటుకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ప్రజల భయాలను, ఆందోళనలను గుర్తిస్తున్న ఆర్ఎంపీలు చేతినిండా డబ్బులు సంపాదిస్తున్నారు. అప్పటికే ఆయా దవాఖానలతో ఒప్పందాలు చేసుకోవడంతో పీఆర్వోల ద్వారా ఆపరేషన్లకు రికమండ్ చేసి కమీషన్ పొందుతున్నారు. ఈ రూపంలో పైసల దందా ఇష్టారీతిన జరుగుతుండడంతో సామాన్యులకు ప్రైవేటులో తలకు మించిన భారం పడుతున్నది. ఒక్కో కాన్పుకు రూ.50వేలు నుంచి రూ.70వేలు వరకు ఖర్చు అవుతుంది. అమాయక ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలనే టార్గెట్గా చేసుకుని ఈ దందాను మూడు పువ్వు లు, ఆరు కాయలు అన్నట్లుగా కొనసాగిస్తున్నారు.
కోతల లెక్కలివీ…
నిజామాబాద్ జిల్లాలో గత రెండేండ్లలో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో జరిగిన కాన్పుల గణాంకాలు పరిశీలిస్తే ఆశ్చర్యం వేయక మానదు. 2020-21లో ప్రభుత్వ వైద్యశాలల్లో మొత్తం 11,787 కాన్పులు జరిగినట్లు వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో సాధారణ ప్రసవాలు 5029, శస్త్ర చికిత్సలు 6,758 జరిగాయి. నిజామాబాద్లో అన్ని సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవాలు కేవలం 42శాతం ఉండగా, 68శాతం ఇష్టానుసార కోతలే ఉన్నాయి. ఇక ఇదే సంవత్సరంలో ప్రైవేటు దవాఖానల్లో మొత్తం 11,645 డెలివరీలు జరిగాయి. సాధారణ ప్రసవాలు అత్యల్పంగా 979, శస్త్ర చికిత్సలు 10,666 జరిగాయి. ప్రైవేటు వైద్యశాలల్లో సాధారణ ప్రసవాల శాతం కేవలం 9 మాత్రమే. 91 శాతం ఆపరేషన్లే జరిగాయి. ఇక 2021-22లో జరిగిన ప్రసవాలు చూస్తే ఆశ్చర్యపోవడం తప్పదు. ప్రభుత్వ దవాఖానల్లో 10,992 కాన్పులు జరిగాయి. ఇందులో సాధారణ ప్రసవాలు 4,571 అంటే కేవలం 41శాతం మాత్ర మే జరిగాయి. 59శాతం అంటే 6,421 శస్త్ర చికిత్సలు వెలుగు చూశాయి. ప్రైవేటు దవాఖానల్లో మొత్తం 13,499 ప్రసవాలు అయ్యాయి. ఇందు లో సాధారణ ప్రసవాలు అతి తక్కువగా 1,320, శస్త్ర చికిత్సలు అత్యధికంగా 12,179 జరగడం వీస్తూ గొల్పుతున్నది. ప్రైవేటు దవాఖానల్లో సాధారణ ప్రసవాలు 9.7శాతం, శస్త్రచికిత్సలు 90.3 శాతం ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం…
నిజామాబాద్ జిల్లాలో వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా పురుడు పోసుకున్న కామారెడ్డి జిల్లాలో ప్రైవేటులో రోజురోజుకూ శస్త్ర చికిత్సలు తగ్గుముఖ పట్టి సాధారణ కాన్పులు పెరుగుతున్నాయి. దీనికి ప్రధానంగా సంబంధిత అధికారుల పర్యవేక్షణ, నిరంతర తనిఖీలే కారణంగా నిలుస్తున్నాయి. నిజామాబాద్కు వచ్చే సరికి వైద్యారోగ్య శాఖలో ఒంటెద్దు పోకడలతో ఓ అధికారి ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం మూలంగా సమన్వయం లోపించింది. పైసల కోసం కక్కుర్తి పడడం, ప్రైవేటు దవాఖానల యాజమాన్యాల నుంచి నెలవారీగా మామూళ్ల సంబంధాలు నెరపడంతో ఈ దురావస్థ కనిపిస్తోంది.
మచ్చుకూ తనిఖీలు లేకపోవడంతో ప్రైవేటు నిర్వాహకుల్లో భయమే లేకుండా పోయిం ది. సర్కారు పెద్దలు పదే పదే మాతా, శిశు సంరక్షణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఎక్కడా ఉలుకు పలుకు లేకపోవడం విశేషం. ఇన్చార్జి హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయకపోవడంతో వ్యవస్థ కుప్పకూలుతున్నది.
ప్రైవేటు దవాఖానలకు ఆదేశాలిచ్చాం
నిజామాబాద్ జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే ప్రైవేటు, ప్రభుత్వ దవాఖానలను అప్రమత్తం చేశాం. ఆపరేషన్లు చేయాల్సి వస్తే అందుకు బలమైన కారణాలను నోట్ చేయాల్సిందిగా చెప్పాం. ఇకపై సాధారణ కాన్పులకు ప్రయత్నం చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. నిరంతరం రికార్డులను పరిశీలించి చేసి పర్యవేక్షణను పెంచుతాం.
– సుదర్శనం, నిజామాబాద్ వైద్యారోగ్య శాఖ అధికారి