ప్రభుత్వ ఆదేశాలతో కొనసాగుతున్న స్థలాల ఎంపిక
పెద్ద పంచాయతీల్లో ఎకరం స్థలంలో ఏర్పాటు
చిన్న పంచాయతీల్లో అర ఎకరంలో క్రీడా మైదానం
అభివృద్ధి పనులకు రూ.4లక్షలు వెచ్చించేందుకు నిర్ణయం
జూన్ 2లోగా మండలానికి 2 పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం
నిజామాబాద్, మే 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధతో పల్లెలన్నీ ఆదర్శవంతంగా మారాయి. తాజాగా గ్రామీణ యువతకు సీఎం కేసీఆర్ మరో వరం ప్రసాదించారు. యువతను క్రీడలవైపు ప్రోత్సహించాలనే ఉద్దేశం తో వారి అవసరాలను క్షేత్రస్థాయిలోనే తీర్చేందు కు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాల పేరుతో ప్రతి గ్రామ పంచాయతీలో స్థలాల సేకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెవెన్యూ, ప్రభుత్వ భూములను ఎకరం నుంచి అర ఎకరం వరకు సేకరించి వీటిని జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శంకుస్థాపనలు, ప్రారంభించుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.
వేగంగా స్థలాల గుర్తింపు ప్రక్రియ..
ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులోభాగంగా కలెక్టర్ నుంచి ఆదేశాలు రావడంతో మండలస్థాయి అధికారులు స్థలాల ఎంపికలో తలామునకలయ్యారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేయనున్న క్రీడా ప్రాంగణాలకు స్థలాల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. జిల్లాలో పంచాయతీ కేంద్రాలతోపాటు అనుబంధ గ్రామాలను కలిపి క్రీడా స్థలాలను ఎంపిక చేయాల్సి ఉంది. రెవెన్యూ, ప్రభుత్వ భూములనే గుర్తించాలని, అటవీ భూములను ఎంపిక చేయొద్దనే నిబంధనలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో ఎక్కువగా అటవీ భూములు ఉండడంతో స్థలాల ఎంపిక పరిస్థితి కాసింత కష్టంగా మారింది. మరోవైపు ఇప్పటికే గ్రామాలకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములు సైతం సాగు, రైతుల కబ్జాలో ఉండగా వాటిని సేకరించడమనేది అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే రైతువేదిక, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాల కోసం స్థలాలు సేకరించారు. ఇప్పుడు మైదానాల స్థల సేకరణ బాధ్యతలు అధికారులకు అప్పగించడంతో గ్రామీణ ప్రాంతాల్లో కలియతిరుగుతున్నారు. కొన్ని పంచాయతీల్లో రెవెన్యూ స్థలా లు లేకపోవడంతో పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిం ది. ప్రతి మండలానికి రెండు చొప్పున నిజామాబాద్ జిల్లాలో 58, కామారెడ్డి జిల్లాలో 44 క్రీడా మైదానాలను జూన్ 2లోగా పూర్తి చేసి ప్రారంభించాలని అధికారులు ఆదేశించారు. పెద్ద పంచాయతీల్లో ఎకరం భూమి, చిన్న పంచాయతీల్లో అర ఎకరం భూమిలో ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు క్రీడా స్థలానికి రూ.4లక్షల వరకు నిధులు ఖర్చు చేయనున్నారు.
అర్బన్లోనూ క్రీడా ప్రాంగణాలు..
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో టీకేపీ- అర్బన్ పేరిట క్రీడా మైదానాల ఏర్పాటుకు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. నగరీకరణ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరత కారణంగా క్రీడా మైదానాలకు ఆస్కారం లేకుండా పోయింది. కొన్ని పట్టణాల్లో మైదానాలు ఉన్నా.. పెరుగుతున్న జనాభా నేపథ్యంలో అవి సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో పురపాలికల్లోనూ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఆ విర్భావ దినోత్సవం నాటికి ప్రతి పురపాలికల్లో రెండు క్రీ డా మైదానాలు ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో మున్సిపాలిటీల్లో క్షేత్రస్థాయిలో స్థలాల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. తెలంగాణ క్రీడా ప్రాంగణాలను పురపాలికల్లోని అన్నివార్డుల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వార్డు కు కనీసం ఒకటి చొప్పున, వార్డుల పరిధి ఎక్కువగా ఉం టే అదనంగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాల్సి ఉం టుంది. ప్రధానంగా ఐదు రకాల క్రీడలకు ఒకే చోట ఎకరం స్థలం ఉండేలా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అన్ని పురపాలికలకు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, లాంగ్ జం ప్, వ్యాయామం చేసేందుకు సింగిల్, డబుల్ బార్ ఉండే లా పనులు చేపట్టాలి. వీటి ఏర్పాటుకు ఏ మేరకు మైదానాలు అవసరమనే విషయాలపై మార్గదర్శకాలు, డిజైన్ల ను పంపించారు. క్రీడా ప్రాంగణం చుట్టూ జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకంలో మొక్కలను పెంచడం, సుందరం గా ఉండేలా పనులు చేపడతారు. వీటి ఏర్పాటుకు ఆట వస్తువులు, పరికరాల కొనుగోలుకు ఏటా ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుంది.
ఆట స్థలాల్ని గుర్తిస్తున్నాం…
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలకు స్థలాలను గుర్తిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా అత్యధిక గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన చిన్న పంచాయతీల్లోనూ స్థలాల కొరతను అధిగమించేందుకు స్థానిక పాలకవర్గాలతో చర్చిస్తున్నాం. జూన్ 2 నాటికి మండలానికి రెండు చొప్పున క్రీడా ప్రాంగణాలు సిద్ధం చేస్తాం.
– చందర్ నాయక్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి,
నిజామాబాద్ జిల్లా