కామారెడ్డి, జూన్ 5 (నమస్తే తెలంగాణ): దేశంలో కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్లో నిర్వహించిన విద్యుత్ విజయోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలోని సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేసేందుకే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కరెంటు కష్టాలు తప్పవని హేళన చేసిన ఆంధ్రప్రదేశ్లో ఏడు గంటల కరెంటు ఇస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ను తమ ప్రభుత్వం ఇస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామంటే విద్యుత్ శాఖలో కిందిస్థాయి నుంచి ఇంజినీర్ స్థాయి ఉద్యోగుల వరకు కష్టపడి పనిచేయడంతోనే సాధ్యపడిందని అన్నారు. కామారెడ్డి నియోజకర్గంలో కొత్తగా పది సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి రైతులు, వినియోగదారులకు నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు.
కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావం కన్నా ముందు కేవలం 34 మెగావాట్లు ఉన్న విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సోలార్ ద్వారా 256 మెగావాట్లకు పెంచుకున్నట్లు తెలిపారు. షెడ్యూల్ కులాలు, తెగల వినియోగదారుల గృహాలకు ప్రతి నెలా 101 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నదన్నారు. 2014లో జిల్లాలో సాగు విస్తీర్ణం 3 లక్షల 33 ఎకరాలు ఉండగా, ప్రస్తుతం 5 లక్షల 11, 579 ఎకరాలకు చేరిందని చెప్పారు. 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయడంతో సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. అనంతరం విద్యుదాఘాతంతో మరణించిన రెండు రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అందజేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ సాలియా నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్కుమార్, బీఆర్ఎస్ నాయకులు నర్సింగ్రావు, పిప్పిరి వెంకన్న, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.