దోమకొండ/విద్యానగర్, జనవరి 9: పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన దోమకొండ మండల కేంద్రంతోపాటు అంచనూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంగమేశ్వర్లో ప్రముఖ వైద్యుడు జలగం తిరుపతిరావు.. తన తండ్రి నాగవేందర్రావు స్మారకార్థం నిర్మించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డివైడర్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కేసీఆర్ నిరంతరం పాటుపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందంజలో ఉంచినట్లు చెప్పారు. విద్య, వైద్యపరంగా ఎంతో అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అందుబాటులో ఉండి పనిచేస్తానని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. కామారెడ్డిని సుందర పట్టణంగా తీర్చిదిద్దుతామని అన్నారు. సిరిసిల్ల రోడ్డు నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు, మున్సిపల్ పరిధిలోని నిజాంసాగర్ రోడ్డు దేవునిపల్లి నుంచి లింగాపూర్ రోడ్డు వరకు రెండు, నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు.