Stray Dogs | నిజామాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హైదరాబాద్ నగరంలోని అంబర్పేటలో కొద్ది రోజుల క్రితం జరిగిన హృదయవిదాయక ఘటన సమాజాన్ని తీవ్రంగా కలిచి వేసింది. నాలుగైదు ఊర కుక్కలు కలిసి ఐదేండ్ల బాలుడిపై దాడి చేసి చంపేసిన దృశ్యాలు అందరి మదిని కదిలించాయి. అంబర్పేటలో ప్రాణాలు కోల్పోయిన సదరు బాలుడి స్వస్థలం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం. ఆ కుటుంబం బతుకు దెరువు కోసం రాజధానికి వెళ్లింది. ఈ ఘటన వెలుగు చూసిన వెంటనే ఊర కుక్కల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వీధుల్లో కుక్కల సంతతిని నివారించేందుకు వెంటనే యాక్షన్ ప్లాన్ తయారు చేసి చర్యలు తీసుకోవాలని పురపాలక సంఘాలకు ఆదేశాలను జారీచేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని మున్సిపల్ కమిషనర్లు హుటాహుటిన చర్యలకు ఉపక్రమించారు. నిజామాబాద్లో జోన్ల వారీగా శానిటరీ ఇన్స్పెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. ఆర్మూర్, బోధన్, భీంగల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడల్లోనూ కమిషనర్లు రంగంలోకి దిగి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి కుక్కల బెడదను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కుక్కలను పట్టుకునేందుకు నేపాల్ బృందాలను తీసుకు వస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్ నగరపాలక సంస్థలో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేపాల్కు చెందిన నిపుణులు చాకచక్యంగా కుక్కలను పట్టుకోవడంలో నిష్ణాతులు. ప్రమాదకమైన జంతువులను సైతం బంధిస్తారు. వీరితో తక్కువ సమయంలో ఎక్కువ మూగ జీవాలను బంధించనున్నారు. వీటి ద్వారా ప్రజల ప్రాణాలకు హాని కలుగకుండా ఉండేందుకు గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను పాటించనున్నారు. కుక్కలను చంపకుండా కేవలం వాటి సంతాన నియంత్రణతో పాటు కుక్క కాటు వంటి ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టనున్నారు.
శునకాలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు కూడా నిర్వహించనున్నారు. అప్పటికప్పుడు కుక్కలను పట్టుకునేలా కార్యాచరణ సిద్ధమైంది. ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లో మొదటి ప్రాధాన్యతగా కుక్కలను పట్టుకుని యాంటీ రేబిస్ టీకాలను వేసే పనిని చేపట్టనున్నారు. గతంలో శస్త్ర చికిత్స జరిగిందో లేదో కూడా తెలుసుకుంటారు. అప్పటికే టీకా ఇచ్చి ఉంటే వాటిని వదిలేస్తారు. లేదంటే ఆరోగ్య కేంద్రానికి తరలించి సంతాన నిరోధక టీకాలు వేస్తారు. ప్రస్తుతం కుక్కల నియంత్రణ కార్యాచరణ బల్దియాకు పెద్ద మొత్తంలో నిధుల ఖర్చుకు దారితీయనుంది. ఒక కుక్కకు శస్త్ర చికిత్స చేసి, యాంటీ రేబిస్ టీకా వేయడానికి వెయ్యి నుంచి రూ.1,500వరకు ఖర్చు అవుతున్నట్లు సమాచారం. ఎక్కువ వ్యయం అవుతున్నా భవిష్యత్తులో వీధి కుక్కల సంఖ్య తగ్గించేందుకు తాజాగా చేపట్టబోయే చర్యలు దోహదం చేయనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మేలు కోసం నిరంతరం అనేక చర్యలు తీసుకుంటున్నది. గతంలోనూ శునకాల సమస్యపై స్పందించి నియంత్రణ చర్యలను చేపట్టింది. తాజాగా మరోమారు ప్రత్యేక డ్రైవ్ రూపంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. నగరంలో పెరుగుతున్న వీధి కుక్కల బాధను తగ్గించేందుకు బల్దియా ఇప్పుడు క్షేత్ర స్థాయిలోనే చర్యలు చేపడుతున్నది. గతంలో వీధి కుక్కలను పట్టి, దవాఖానలకు తీసుకెళ్లి అక్కడ శస్త్ర చికిత్స చేసి వ్యాక్సిన్ వేసేవారు. దీంతో కొన్ని రోజుల పాటు అక్కడే పరిశీలనలో ఉంచాల్సి వచ్చేది. ఇది బల్దియాకు ఆర్థికంగా భారంగా కూడా మారడంతో వీధి కుక్కలు ఉన్న చోటే టీకాలు వేయడం మొదలు పెట్టారు.
జోన్ల వారీగా నిజామాబాద్ నగరంలోనూ ఉధృతంగా ఈ కార్యక్రమం అమలైంది. కొద్ది రోజులుగా వీధి కుక్కల బారిన పడి చాలా మంది ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి తోడు హైదరాబాద్ అంబర్పేటలో తాజాగా వెలుగు చూసిన ఘటనతో రాష్ట్ర పురపాలక శాఖ అప్రమత్తమైంది. యాక్షన్ ప్లాన్ తయారు చేసి నియంత్రణ చర్యలపై వెంటనే దృష్టి సారించాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో రంగంలోకి దిగిన పురపాలక సంఘాల కమిషనర్లు సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించే పనిలో పడ్డారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. ప్రజలకు తీవ్రంగా కుక్కల బెడద పొంచి ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా చోట్ల కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టనున్నారు. ముఖ్యంగా రేబిస్ వ్యాధి సోకకుండా, వీధి కుక్కల సంతతి విస్తరించకుండా చూడడం వంటి చర్యలతో ప్రజలకు ప్రయోజనాలు నెరవేర్చడం కోసం పురపాలక సంఘాలు పాటుపడనున్నాయి.
వీధి కుక్కలను చంపకూడదనే నిబంధన మేరకు ప్రజా క్షేమం కోసం కుక్కల నియంత్రణలో భాగంగా ఎనిమల్ బర్త్ కంట్రోల్ అనే ఏజెన్సీని 2020లో ఏర్పాటు చేయడం జరిగింది. యాంటీ రేబిస్ టీకాలు, సంతానోత్పత్తి నియంత్రణ చర్యలను మరోమారు చేపట్టబోతున్నాం. నగరంలో వీధి కుక్కల బెదద ఉంటే నగరపాలక సంస్థ సిబ్బందికి, అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. 24గంటల్లోనే కుక్కల సమస్యకు తప్పనిసరిగా పరిష్కారం చూపుతాం.
– ఎంఏ అలీం, డిప్యూటీ కమిషనర్, నిజామాబాద్ నగరపాలక సంస్థ