మాచారెడ్డి, డిసెంబర్ 14: ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్ తండా,ఎక్స్రోడ్ దినదినాభివృద్ధి చెందుతూ ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టడంతోపాటు పన్నుల వసూళ్లలో ముందు వరుసలో ఉంటూ అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. కొత్తగా ఏర్పాటైన జీపీ అయినా.. ఐదేండ్లలోనే అభివృద్ధిలో అగ్రభాగాన నిలువడం విశేషం.
గజ్యానాయక్తండా, ఎక్స్రోడ్ గ్రామం ఒకప్పుడు మాచారెడ్డి మండల కేంద్ర పరిధిలో ఉండేది. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన జీపీల్లో ఎక్స్రోడ్ను గజ్యానాయక్తండాతో కలిపి కొత్త పంచాయతీగా ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో సర్పంచుగా ఎన్నికైన హంజీనాయక్.. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు.
గజ్యానాయక్తండా, ఎక్స్రోడ్ గ్రామం పూర్తిగా వ్యాపార, వాణిజ్య సముదాయాలతో కూడుకొని ఉన్నది. ట్రేడ్ లైసెన్స్తోపాటు ఇంటి పన్నులు ప్రతి సంవత్సరం వందశాతం వసూలవుతున్నాయి. దీంతో గ్రామాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు సమకూరుతున్నాయి.
ఉమ్మడి మాచారెడ్డి జీపీలో ఉన్న సమయంలో గజ్యానాయక్తండా,ఎక్స్రోడ్ గ్రామానికి నిత్యం విద్యుత్ సమస్యలు ఎదురయ్యేవి. గజ్యానాయక్తండా వ్యా పార, వాణిజ్య పరంగా దినదినాభివృద్ధి చెందుతున్నది. ఈ దశలో లోవోల్టేజీ సమస్యలు ఎక్కువయ్యాయి. మాచారెడ్డి, చు క్కాపూర్, కొత్తపల్లి, గజ్యానాయక్తండా నాలుగు గ్రామాలకు కలిపి ఒకే సబ్స్టేషన్ ఉండగా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాలుగు గ్రామాల్లో ఎక్కడ ఎల్సీ తీసుకున్నా కరెంట్ సరఫరా నిలిచిపోయేది. సమస్యను అప్పటి విప్ గంపగోవర్ధన్, ఎంపీపీ నర్సింగ్రావు సహకారంతో వరంగల్లోని ఎన్పీడీసీఎల్ ఆపరేషనల్ డైరెక్టర్ను కలిసి వివరించారు. అదే సమయంలో జిల్లాకు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే సబ్స్టేషన్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే నిధుల విడుదల, నిర్మాణం చకచకా జరిగాయి. ప్రస్తుతం నాణ్యమైన విద్యుత్ సరఫరాతో స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
మాజీ విప్ గంప గోవర్ధన్ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా. దాదాపు రూ.27కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాను. బీఆర్ఎస్ హయాంలో గ్రామాలకు పుష్కలంగా నిధులు వచ్చాయి. మండలంలో ఏ గ్రామానికి రానన్ని నిధులను మా జీపీకి తీసుకువచ్చి అభివృద్ధిలో నంబర్వన్గా తీర్చిదిద్దాను.